ఎందుకంత ప్రేమంట..!
● ఒకే ఊరికి 30 గోకులాలు మంజూరు
గోకులాల నిర్మాణానికి ఎంతెంత?
రెండు ఆవులు ఉంటే.. రూ.1లక్షా30వేలు
నాలుగు ఆవులకు రూ.1లక్షా80వేలు
ఆరు ఆవులకు రూ.2లక్షల 30వేలు
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 90శాతం రైతులకు నిధులు ఇవ్వగా పది శాతం మాత్రమే రైతులు పెట్టుకోవాలి
బ్యాంకులో బంగారం పెట్టి గోకులం కట్టాను
మినీ గోకులం నిర్మాణానికి రూ.1లక్షా 30వేలు ఖర్చుచేశాను. గోకులం నిర్మాణం పూర్తయినా ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వలేదు.నా భార్య బంగారం బ్యాంకులో తాకట్టుపెట్టి నిర్మాణం చేశాను. బిల్లు కోసం ఎదురు చూస్తున్నాను.
– లోగిశ సూరప్పడు, లోగిశ గ్రామం
గజపతినగరం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పశువులను కమ్మలతో కూడిన శాలల్లో ఉంచడం వల్ల అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నాయి. తగిన సదుపాయాలు లేక ఆరోగ్యం పాడై మృత్యువాత పడుతున్నాయి. ఈ సందర్భాలను రాష్ట్ర ప్రభుత్వం గమనించి, ఆసక్తి ఉన్న రైతులకు మినీ గోకులాల నిర్మాణం చేపట్టుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం 90శాతం నిధులు మంజూరుచేస్తే స్ధానిక రైతులు పదిశాతం మాత్రమే పెట్టుబడి పెట్టి మినీ గోకులాల నిర్మాణం చేసుకోవచ్చంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు తమ గ్రామాల్లో ఆధిపత్యం చెలాయించడం కోసం మినీ గోకులాలు అధికంగా కావాలని నాయకుల వద్దకు సిఫార్సులతో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గజపతినగరం మండలంలోని లోగిశ గ్రామ రైతులకు మండలంలో ఏగ్రామానికి లేనంతగా 30గోకులాలు అధికార పార్టీ నేతలు మంజూరు చేయించారు. అయితే దీని వెనుక అదే గ్రామానికి చెందిన మాజీ మండల ప్రజాప్రతినిధి అభీష్టం మేరకు స్థానిక మంత్రి జిల్లాస్ధాయి అధికారులతో మాట్లాడి 30 గోకులాలు మంజూరుచేయించినట్లు సమాచారం. జిల్లాలో ఒక్కో మండలానికి తొలిదశలో 75 గోకులాలు మంజూరైతే ఒక్క గజపతినగరం మండలానికి ఏకంగా 135 గోకులాలు మంజూరు చేశారు. ఇందులో ఒక్క లోగిశ గ్రామానికే 30గోకులాలు మంజూరు చేయడంపై సంబంధిత మాజీ ప్రజాప్రతినిధిపై స్థానిక మంత్రికి కాస్త ప్రేమ ఎక్కువగానే ఉన్నట్లు ఉందని కూటమి ప్రభుత్వానికి చెందిన స్థానిక నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ 30 గోకులాలు మంజూరైనప్పటికీ అందులో కేవలం ఏడు గోకులాలు మాత్రమే నిర్మాణం పూర్తిచేసుకున్నట్లు సమాచారం. మిగిలిన 23 మంది రైతులు ముందు తాము పెట్టుబడి పెడితే ఆనక బిల్లులు మంజూరు కావడంలో ఆలస్యమైతే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోకులాల నిర్మాణానికి ముందుకు రానట్లు సమాచారం.
నిధులు రాలేదు
నిర్మాణాలు పూర్తయిన గోకులాలన్నింటికి బిల్లులు అప్లోడ్ చేసి ఉంచాం. నిధులు రాగానే బిల్లులు చెల్లింపు చేస్తాం. ఇప్పటివరకూ మండలానికి 135 గోకులాలు మంజూరుకాగా 80 గోకులాల నిర్మాణం పూర్తయింది. లోగిశ గ్రామానికి మంజూరైన 30 గోకులాలు స్ధానిక మంత్రి జిల్లా స్ధాయి అధికారులతో మాట్లాడి మంజూరు చేయించారు.
– కల్యాణి, ఎంపీడీఓ, గజపతినగరం మండలం
ఎందుకంత ప్రేమంట..!
ఎందుకంత ప్రేమంట..!
ఎందుకంత ప్రేమంట..!
Comments
Please login to add a commentAdd a comment