ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్‌ షా | Amit Shah to Begin Touring Poll Bound States Starting with tamil Nadu | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్‌ షా

Published Mon, Apr 7 2025 10:45 AM | Last Updated on Mon, Apr 7 2025 11:15 AM

Amit Shah to Begin Touring Poll Bound States Starting with tamil Nadu

న్యూఢిల్లీ: ఇప్పుడు బీజేపీ దృష్టి బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులపైనే ఉంది. ఈ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను పటిష్టం చేయడానికి, కార్యకర్తలను సమాయత్తం చేయడానికి, స్థానిక నాయకులతో సమన్వయం కుదుర్చుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతి నెలా రెండు రోజుల పాటు ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమై, ఎన్నికలు ముగిసే వరకు కొనసాగనున్నాయి. పటిష్ట వ్యూహం (Strong strategy)తో బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది.

బీహార్‌లో బీజేపీ వ్యూహం
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2025 (Assembly elections in Bihar) అక్టోబర్-నవంబర్‌లో జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో కీలక భాగస్వామిగా ఉంది. ఇందులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్), చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. అమిత్ షా ఏప్రిల్ 30,మే 1 తేదీల్లో బీహార్‌లో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన పట్నా, గయ,భాగల్పూర్  తదితర నగరాల్లో సమావేశాలు నిర్వహించి, బూత్ స్థాయి కార్యకర్తలతో  సమావేశాలు నిర్వహించనున్నారు. బీహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అయిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీ ఈ పర్యటనలను చేపడుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లు గెలుచుకున్నప్పటికీ, ఈసారి సీట్ల సంఖ్యను 100కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షా ఈ పర్యటనల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కేంద్ర పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటివాటిని హైలైట్ చేయనున్నారు.

టీఎంసీకి సవాలు విసిరేందుకు..
పశ్చిమ బెంగాల్‌లో 2026 మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 2021 ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అమిత్ షా ఏప్రిల్ 14-15 తేదీలలో కోల్‌కతా, హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో తన ఓటు శాతాన్ని 40 శాతం నుంచి 50శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో అమిత్‌షా  స్థానిక నేతలతో ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.

తమిళనాడులో కొత్త ఒరవడి
తమిళనాడులో 2026 మార్చి-ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో బీజేపీ గతంలో ఎన్నడూ గణనీయమైన విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు అధికార డీఎంకే-ఇండియా కూటమి(ruling DMK-India alliance)ని ఎదుర్కొనేందుకు ఏఐఏడీఎంకేతో మళ్లీ పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షా ఏప్రిల్ 10-11 తేదీల్లో చెన్నై, కోయంబత్తూర్, మధురైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామితో సమావేశమై, కూటమి ఒప్పందంపై చర్చలు జరపనున్నారని సమాచారం. 2021 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి 66 సీట్లు గెలిచినప్పటికీ, తర్వాత విడిపోయాయి. ఈసారి బీజేపీ తమిళనాడులో కనీసం 50 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షా పర్యటనల్లో రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో హిందుత్వ ఎజెండాను ప్రచారం చేయడంతో పాటు, డీఎంకే ద్రవిడ రాజకీయాల ఆధిపత్యంపై విమర్శించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రాజెక్టులైన పంబన్ వంతెన, రైల్వే ఆధునీకరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ టారిఫ్‌ దడ.. షాపింగ్‌ మాల్స్‌ ముందు లాక్‌డౌన్‌ దృశ్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement