
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. డయేరియా మరణాలపై చర్చ సందర్భంగా ఆయన నవ్వుతూ.. మండలి సభ్యులను హేళన చేసేలా మాట్లాడారు.
డయేరియా మరణాలపై శాసనమండలి చర్చలో భాగంగా తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్గా మాట్లాడే క్రమంలో మంత్రి సత్యకుమార్ నోరు జారారు. ‘‘డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయి’’ అని చిరునవ్వుతో మాట్లాడారాయన.
వెంటనే బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలి’’ అని అన్నారాయన. అనంతరం.. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.
