
Wayanad: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పోటీ చేస్తున్న వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మైనారిటీ ముఖ్య నేత ఏపీ అబ్దుల్లాకుట్టిని పోటీకి దింపవచ్చునన్న ప్రచారం సాగుతోంది. ఇక్కడ ఎల్డీఎఫ్ నుంచి అన్నీ రాజా పోటీలో ఉన్నారు.
కేరళలో బీజేపీ 12 మంది అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించింది. దాని మిత్రపక్షమైన బీడీజేఎస్ కూడా నాలుగు స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ మినహా మూడు నియోజకవర్గాలైన కొల్లాం, ఎర్నాకుళం, అలత్తూర్లలో అభ్యర్థుల ఖరారు ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట సీనియర్ నేత సందీప్ వారియర్ను బరిలోకి దించే అవకాశం ఉందని సమాచారం.
వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురం జిల్లా పరిధిలోకి వస్తాయి. దీంతో ఇక్కడ ఐయూఎంఎల్ గణనీయమైన ప్రాబల్యాన్ని కలిగి ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేస్తోన్న బీజేపీ ఢిల్లీకి చెందిన యువమోర్చా నేత అనూప్ ఆంటోనీ పేరును కూడా పరిశీలిస్తోంది. అనూప్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అంబలపుజ నుంచి పోటీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో సమావేశం కానున్న పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఏపీ అబ్దుల్లాకుట్టి పూర్తి పేరు అరువన్పల్లి పుతియాపురక్కల్ అబ్దుల్లాకుట్టి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఈయన కేరళ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కేరళ రాష్ట్రంలోని కన్నూర్ లోక్ సభ నుంచి రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అలాగే కన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment