రేవంత్‌.. 50 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా?: కేటీఆర్‌ | BRS MLA KTR Serious Comments On CM Revanth REddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. 50 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా?: కేటీఆర్‌

Published Sun, Feb 16 2025 9:22 AM | Last Updated on Sun, Feb 16 2025 10:47 AM

BRS MLA KTR Serious Comments On CM Revanth REddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం భవిష్యత్‌ తరాలకు శాపంగా మారిందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. కాంగ్రెస్‌ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయన్నారు. ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని ఘాటు విమర్శలు చేశారు.

తెలంగాణలో గురుకులాల పరిస్థితిపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌..‘ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు.. నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారు. నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే.. నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయి. నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే.. నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయి.

ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తోంది. ఈ సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపం. జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement