![Congress holds screening committee meet for Rajasthan in Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/6/rajasthan_0.jpg.webp?itok=cGJY9TkR)
రాజస్థాన్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా రాష్ట్రంలో 34.6 శాతం ఓట్లు సాధించింది.
సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. మార్చి 7న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుందని చెప్పారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నామని, అతి త్వరలోనే పేర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా గెలుపు గుర్రాలను గుర్తించినట్లు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లో పొత్తుల భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకంపై మాట్లాడుతూ.. “రాజస్థాన్లో పొత్తు ఎవరితో, ఎలా ఉండాలో నిర్ణయించే ఇండియా కూటమితో పాటు మాకు ఏఐసీసీ కమిటీ ఉంది” అన్నారు.
2019లో ఎన్డీఏ క్లీన్స్వీప్
2019 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం 25 స్థానాలకు గానూ 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఈ పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కావడం విశేషం. అంటే అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి క్లీన్స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 59 శాతం ఓట్లు సాధించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా రాష్ట్రంలో 34.6 శాతం ఓట్లను సాధించగలిగింది. కాగా 2018లో రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
2014లో ‘జీరో’ సీట్లు
అంతకు ముందు 2014 సార్వత్రికలో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లోక్సభ స్థానాల్లో ఖాతా తెరవలేకపోయింది. అప్పుడు కూడా ఎన్డీఏ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 25 సీట్లలో 21 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 55.6 శాతం ఓట్లు సాధించింది. ఇక ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ 30.7 శాతం ఓట్లు తెచ్చుకుంది. 2019 ఎన్నికలను పరిశీలిస్తే 47 శాతం ఓట్లతో 20 సీట్లు గెలుపొందగా, బీజేపీ 36.6 శాతం ఓట్లతో కేవలం 4 స్థానాలే గెలిచింది. మరి ఈసారైనా కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారుతుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment