నేటితో ఉపసంహరణకు గడువు ముగింపు | Sakshi
Sakshi News home page

నేటితో ఉపసంహరణకు గడువు ముగింపు

Published Mon, Apr 29 2024 4:44 AM

Deadline for withdrawal is today

17 స్థానాల్లో 625 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం 

16 నియోజకవర్గాల్లో 15మందికి మించి అభ్యర్థుల నామినేషన్లు 

ఆయా చోట్ల ఒకటికి మించిన సంఖ్యలో బ్యాలెట్‌ యూనిట్ల వినియోగం? 

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రానున్న స్పష్టత 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానా ల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది. అనంతరం ఎన్నికల బరిలో మిగలనున్న తుది అభ్యర్థుల జాబితాలు వెల్లడి కానున్నాయి. పరిధిలో మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వివిధ కారణాలతో 268 మంది అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం నిర్వహించిన పరిశీలనలో తిరస్కరించారు. మొత్తంగా 625 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.

ఎవరైనా అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోగా స్థానిక లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నిర్దేశిత ఫారం–5 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి స్వయంగా లేదా తన ఎన్నికల ఏజెంట్‌/ప్రపోజర్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి ఫారం–5 దర ఖాస్తును సమర్పించాలి.

అభ్యర్థి తరఫున ఏజెంట్‌/ ప్రపోజర్‌ ఫారం–5 దరఖాస్తును సమర్పించే సందర్భాల్లో వారికి నామినేషన్‌ ఉపసంహరణ దరఖాస్తును సమర్పించడానికి అధికారం(ఆథరైజేషన్‌) కలి్పస్తూ అభ్యర్థి రాతపూర్వకంగా జారీ చేసిన లేఖను సైతం జత చేయాల్సి ఉంటుంది.  

ఈ స్థానాల్లో బ్యాలెట్‌ బద్దలు కావాల్సిందే 
రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈసారి ఒకటికి మించి ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్‌ యూని ట్లను వినియోగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో 15 మందికి మించి అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. 

లోక్‌సభ స్థానాల వారీగా పరిశీలిస్తే పెద్దపల్లిలో 49 మంది, కరీంనగర్‌లో 33 మంది, నిజామాబాద్‌ లో 32 మంది, జహీరాబాద్‌లో 26 మంది, మెదక్‌లో 53 మంది, మల్కాజ్‌గిరిలో 37 మంది, సికింద్రబాద్‌లో 46 మంది, హైదరాబాద్‌లో 38 మంది, చెవెళ్లలో 46 మంది, మహబూబ్‌నగర్‌లో 35 మంది, నాగర్‌కర్నూల్‌లో 21 మంది, నల్లగొండలో 31 మంది, భువనగిరిలో 51 మంది, వరంగల్‌లో 48 మంది, మహబూబాబాద్‌లో 25 మంది, ఖమ్మంలో 41 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల యంత్రాంగం ఆమోదించింది. 

నామినేషన్ల ఉపసంహర ణ ముగిసిన తర్వాత ఆయా స్థానాల్లో ఎన్ని బ్యాలె ట్‌ యూనిట్లతో ఎన్నికల నిర్వహించాలో స్పష్టత రానుంది. 15మంది అభ్యర్థులు, ఆలోపు ఉంటే ఒక బ్యాలెట్‌ యూనిట్‌ సరిపోనుంది. అభ్యర్థుల సంఖ్య 16–31 మధ్యలో ఉంటే రెండు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం కానున్నాయి.

 అభ్యర్థుల సంఖ్య 32–47 మధ్య ఉంటే మూడు బ్యాలెట్‌ యూనిట్లను వాడాల్సి ఉండనుంది. 48–63 మధ్యలో ఉంటే నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించక తప్పదు. ప్రస్తుతానికి అత్యధికంగా మెదక్‌ స్థానంలో 53 మంది, భువనగిరి స్థానంలో 51 మంది అభ్యర్థులుండడం గమనార్హం.

Advertisement
Advertisement