
సాక్షి, తిరుపతి: తన తీరు నచ్చక పార్టీకి దూరంగా ఉన్న నేతలను మెప్పించే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్టీకి పూర్తిగా దూరమైపోతారేమోననే భయంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారిని, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభను పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ పదవులపై వారి అనుచరులు పెదవి విరుస్తున్నారు. ఈ పదవులు ఎందుకంటూ బాహాటంగా విమర్శిస్తున్నారు.
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఇటీవలే పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాస్ ఇటీవల తిరుమలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ రెండు ఘటనలు చంద్రబాబుని కలవరపాటుకు గురిచేశాయి. ప్రస్తుతం పార్టీలో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జ్లు స్థానికంగా ఉండడంలేదు. దీనిపై చంద్రబాబునాయుడులో ఆందోళన మొదలైనట్టు కనిపిస్తోంది. (అవినీతి నేతకు అధ్యక్ష పదవా?)
వారు పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం కొంత అసహనానికి గురిచేస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో సొంత జిల్లాలో పార్టీ నేతలు ఎలాంటి సహాయక కార్యక్రమాలు చేపట్టలేదు. పైగా సొంత సమస్యలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు రెండు పదవులు కట్టబెట్టి కార్యకర్తలను మరోసారి బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment