
సాక్షి, అమరావతి: తెలుగు దొంగల పార్టీకి, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తు వచ్చిందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దివంగత మహానేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ది ప్రారంభమైందని దువ్వాడ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తన పాదయాత్ర ద్వారా ఉత్తరాంధ్ర సమస్యలని గుర్తించారని, ఉద్దానం సమస్యని చూసి ఆయన చలించిపోయారని అన్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్దాన సమస్య పరిష్కారానికి 750 కోట్ల రూపాయలతో తాగునీటిని అందించబోతున్నారని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. ఉద్దానంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్తో పాటు రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన వివరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తమ ప్రాంతానికి అన్యాయమే చేశారని, దోచుకోచడానికే చూశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేత నారా లోకేష్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment