
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా.. 104 పథకాన్ని మూసేయడమా.. లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా.. కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం JHS, EHS స్కీములను పాతరేయడంతో పాటు పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొడుతోందంటూ విమర్శించారు.
కేసీఆర్ హామీ ఇచ్చిన జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు.. రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవని, హెల్త్ టవర్ లేదని ఎద్దేవా చేశారు. ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టింపులేదని, పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. దవాఖాన్లలో సిబ్బంది లేకపోయినా పట్టించుకోరు.. ఆసుపత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేని ప్రభుత్వం ఇదేనంటూ ఫైర్ అయ్యారు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని వ్యంగాస్త్రాలు సంధించారు. జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment