
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ను పరిశీలించారు. అనంతరం, ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ ఏర్పాటుపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలో వెంకట రెడ్డి మాట్లాడుతూ..‘ఢిల్లీలో వీలైనంత త్వరగా కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న భవన్లో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదు. గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన వైఖరి మేం తీసుకుంటాం. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మరొక మణిహారం. ట్రిపుల్ ఆర్ సహా పలు జాతీయ రహదారుల అంశాలపై మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ను కలుస్తున్నాం. రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం’ అని కామెంట్స్ చేశారు.
మరోవైపు.. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వారితో కోమటిరెడ్డితో మాట్లాడుతూ..‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అని అప్పటి పీఎం మన్మోహన్ చెప్పారు. ఇప్పటికీ విభజన చట్టం అమలుపరచకపోవడం బాధాకరం. నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు, అమలుపరిచే బాధ్యత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిది’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment