
సాక్షి, అమరావతి: మహానాడు దేనికోసం నిర్వహించారో అర్థం కాలేదని.. ప్రభుత్వంపై బురద చల్లేందుకే మహానాడు జరిగినట్టుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విష ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. బీసీ మంత్రుల బస్సు యాత్రను చూసి ఓర్వలేకపోయారన్నారు. మహానాడులో అన్నీ అబద్ధాలే చెప్పారని ధ్వజమెత్తారు.
చదవండి: నారా లోకేశ్ టీమ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
‘‘ఏదో ఎన్నికల్లో గెలిచినట్టు మహానాడులో హడావుడి చేశారు. ప్రభుత్వంపై పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. మహానాడులో ఆ ఏడుపు మరీ ఎక్కువైంది. ఏపీ సీఎం హోదాలో జగన్ దావోస్ సదస్సులో పాల్గొన్నారు. దావోస్ ఒప్పందాలపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు. సీఎం జగన్ హుందాగా వ్యవహరించే వ్యక్తి. చంద్రబాబులా జగన్ ప్రగల్భాలు పలికే వ్యక్తి కాదు. ప్రజలకు మేలు చేకూర్చే పథకం ఒక్కటైనా బాబు తెచ్చారా?. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతోనే ఈ ఏడుపు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.