
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించగా, దానిని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ శశిథరూర్ కొనియాడారు. ప్రత్యేకంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అమోఘమంటూ కొనియాడారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. శశిథరూర్ ‘లక్ష్మణ రేఖ’ దాటారంటూ విమర్శించింది.
దీనిపై శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ ఇక్కడ భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రత్యేక కోణంలో చూడాలి. నేను ఒక భారతీయుడిగా మాత్రమే ప్రధాని మోదీని పొగిడాను. ఇది నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. దీనికి పార్టీ నిర్ణయంతో పనేంటి?’ అంటూ ధ్వజమెత్తారు.
‘భారత్, పాకిస్తాన్ ల యుద్ధంపై నన్ను కొంతమంది అడిగారు. దీన్ని మీరు ఎలా చూస్తారు అని ప్రశ్నించారు. దీనిపై నాకు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడా. ఇక్కడ నేను మాట్లాడింది అంతా క్లియర్ గానే ఉంది. ఒక భారతీయుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఇక్కడ ప్రధాని మోదీని పొగిడితే పార్టీ అభిప్రాయం ఎలా అవుతుంది’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు శశిథరూర్.
కాగా, ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. రెండు రోజుల క్రితం శశిథరూర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమంటూ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెస్సేజ్ పంపించారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న దానిని అస్సలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు.
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశిథరూర్. భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు శశిథరూర్. ఇక కోవిడ్ సమయంలో కూడా ప్రధాని మోదీ స్పందించిన తీరును ఈ సందర్భంగా శశిథరూర్ ప్రస్తావించారు.
ఇక్కడ చదవండి: