
తమ్మినేని వీరభద్రం, ఎస్. వీరయ్య, బి. వెంకట్, జూలకంటి రంగారెడ్డి,
సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం వరుసగా మూడోసారి ఎన్నిక కానున్నారని సమాచారం. పార్టీ నిబంధనల ప్రకారం మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా ఒక నేతను ఎన్నుకొనే అవకాశం ఉన్నందున ఈసారి కూడా ఖమ్మం కామ్రేడ్కే పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ నాయకత్వం యోచిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం కూడా సుముఖంగానే ఉందని, వచ్చే మహాసభల్లో గా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ్మినేనినే మరోమారు కార్యదర్శిగా కొనసాగించాలనే ప్రతిపాదన పెట్టి ఆమోదించనుందని తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో ఆదివారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, కార్యదర్శివర్గంతోపాటు కార్యదర్శిని కూడా చివరిరోజు ఎన్నుకోనున్నారు. ఒకవేళ తమ్మినేని కాకపోతే నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్. వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బి. వెంకట్లలో ఒకరిని ఎన్నుకొనే అవకాశం ఉందని ఎంబీ భవన్ వర్గాలంటున్నాయి.
రాష్ట్ర కార్యదర్శివర్గంలో మార్పులు!
రాష్ట్ర కార్యదర్శివర్గంలో కూడా రెండు, మూ డు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా చెరుపల్లి సీతారాములు, నంద్యాల న ర్సింహారెడ్డి, సి.రాములు, సాయిబాబా, పోతి నేని సుదర్శన్, జాన్వెస్లీ, జ్యోతి, డి.జి.నర్సింహారావు, జి.రాములు, డాక్టర్. మిడియం బా బూరావులు కొనసాగుతున్నారు. వీరిలో జి. రాములు, మాజీ ఎంపీ మిడియం బాబూరావులు రిటైర్ అవుతారని అంటున్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఢిల్లీ సెంటర్కు వెళ్తారని, ఆయన స్థానంలో మరో ట్రేడ్ యూనియన్ నేత పాలడుగు భాస్కర్ను కార్యదర్శివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. జి.రాములు, బాబూరావుల స్థానం లో మరో ఇద్దరు నేతలకు అవకాశం వ స్తుందని, అందులో మరో మహిళానేతకు అ వకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. సీఐటీయూ నాయకురాలు రమ, ఐద్వానేత మల్లు లక్ష్మిలో ఒకరిని కార్యదర్శివర్గంలోకి తీసుకొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.
వామపక్ష ఐక్య కూటమి ఎటువైపు..?
సీపీఎం రాష్ట్ర కమిటీ ఎన్నిక ఒక ఎత్తయితే పార్టీ మహాసభల్లో ఆమోదించే రాజకీయ తీర్మానంపై అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తితో ఉన్నాయి. తమకు ప్రధాన శత్రువైన బీజేపీని తెలంగాణలో బలపడకుండా చూడటమే తక్షణ రాజకీయ కర్తవ్యమని శనివారం జరిగిన ఆన్లైన్ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అలా అని ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్తో కలిసివెళ్లేది లేదని కూడా వెల్లడించారు.
గత ఎన్నికల్లో లాల్, నీల్ ఎజెండాతో ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో వామపక్ష ఐక్య కూటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఎలాంటి రాజకీయ తీర్మానం చేస్తారన్నది రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్పై ప్రజాసమస్యల గురించి పోరాటాలు చేస్తూనే బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ సమయానికి కలిసి వెళ్తారా? కాంగ్రెస్ను కలుపుకుంటారా? లేక వామపక్ష ఐక్య కూటమితో ముందుకెళ్తారా? అన్నది వేచిచూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment