
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.
జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథరెడ్డి జెడ్పీ చైర్మన్గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా పరిషత్లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే కావడం విశేషం.

వైఎస్సార్సీపీ సభ్యులకు విప్ జారీ...
జిల్లా పరిషత్లో 47మంది జెడ్పీటీసీలకు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సూచన మేరకు వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి ద్వారా సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ జారీ చేసిన రిసిప్ట్ కాపీలు ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. విప్ ధిక్కరిస్తే ఆయా సభ్యులు సభ్యుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని సమాచారం. దాంతో వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. చైర్మన్గిరిని పార్టీ ఖాతాలో జమ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంది.
రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్ పీఠం
బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్ పీఠం దక్కనుంది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యరి్థగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతిని«థ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని ఎంపిక చేశారు. అధినేత సూచనలు మేరకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు చైర్మన్ ఎన్నిక కోసం కంకణబద్ధులై ఉన్నారు. కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం.

తెలుగుదేశం పార్టీ ద్వంద్వనీతి
జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది.