చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్‌సీపీ | Ysrcp Fires On Chandrababu Government Over Illegal Arrests | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్‌సీపీ

Nov 9 2024 3:42 PM | Updated on Nov 9 2024 4:31 PM

Ysrcp Fires On Chandrababu Government Over Illegal Arrests

వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ అరాచక పోస్టులపై ఆ పార్టీ మండిపడుతోంది. వైఎస్‌ జగన్‌ సహా అనేక మంది నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై ఆధారాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఫిర్యాదులు చేస్తున్నారు.

కాకినాడ జిల్లా: కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కక్షసాధింపు తప్పా మరో వ్యాపకం లేదని.. వేధింపులు ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదనపు ఎస్పీ భాస్కరరావుకు ఆయన ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీ: కురసాల కన్నబాబు
‘‘చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీని ఎప్పటి నుండో నడుపుతున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్‌ చంద్రబాబుకు అలవాటుగా మారింది. టీడీపీ కార్యాలయం కేంద్రంగా సోషల్ మీడియా దుష్ప్రచారానికి తెర తీశారు. ఈ మాట డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పాడు. టీడీపీ తన పద్దతి మార్చుకోవాలి. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై వచ్చిన సోషల్ మీడియా పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని కన్నబాబు తెలిపారు.

అరాచక పాలన పై పోరాటం చేస్తాం: అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం: వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్‌లు వస్తున్నాయని.. టీడీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోరా? అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మేసేజ్‌లు పెట్టిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అంటే ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయమంటే చంద్రబాబు ఉలికిపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబు అరాచక పాలనపై పోరాటం చేస్తాం’’ అని అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.

అక్రమ అరెస్ట్‌లు.. హేయమైన చర్య: దూలం నాగేశ్వరావు
ఏలూరు జిల్లా: కూటమి ప్రభుత్వం చేపట్టిన సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌కు ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, చింతలపూడి కన్వీనర్ విజయరాజు, ఏలూరు కన్వీనర్ జయప్రకాష్ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్టులపై నేడు విమర్శించినట్లుగా అరెస్టులు చేయడం హేయమైన చర్య. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. వారిని ఎక్కడ ఉన్నారో కూడా తెలపడం లేదు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అడిగినా చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు.

అక్రమాలను ప్రశ్నిస్తే.. కేసులా: ధర్మాన కృష్ణదాస్‌
శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావుకు వైఎస్సార్‌సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మెంటాడ పద్మావతి, నాయకులు పొన్నాడ రుషి, ఎడ్ల వెంకట్ ,అంబటి శ్రీను ఇతర నాయకులు పాల్గొన్నారు.

జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలనకు స్వస్తి పలకాలన్నారు. జిల్లాలో ఏ సోషల్ మీడియా కార్యకర్తని ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. అరెస్టు చేసిన కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో కూడా తెలపడం లేదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించారనే అక్కసుతో మా సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐటీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు: వరుదు కల్యాణి
విశాఖపట్నం: కూటమిపాలనలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘ఏపీలో ఉన్నామా?  ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా? సోషల్ మీడియా కార్యకర్తల పేరుతో మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మహిళని చూడకుండా సంధ్యారాణిని పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు పోస్టింగులు పెడుతున్న ఐటీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు. పవన్ కల్యాణ్‌ తల్లిని తిట్టించిన లోకేష్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరించే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement