
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో వంద కోట్ల మేర ఇసుక దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్ వేశారని తెలిపారు. రీచ్లకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి కాకాణి తాజాగా నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలన అంతా దోపిడీమయమే. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దోపిడీకి స్కెచ్ వేశారు. ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి ఇరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, టిప్పర్లను పట్టుకున్నారు. ఈ రీచ్కు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారు. వాహనాలను పట్టుకున్న అధికారులను సోమిరెడ్డి బెదిరించారు. రీచ్లో ఇసుకను తీసుకెళ్లే దారులను తెగ్గొట్టారు.
టీడీపీ నేతలు సూచించిన దారుల్లోనే వెళ్లాలని చెబుతున్నారు. ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. అధికారులను బెదిరించి మరీ సోమిరెడ్డి దోచుకుంటున్నారు. పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారు. దీనివల్ల నీరు చివరకు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు. ఇసుక, నీటి పారుదల, గ్రావెల్లలో అక్రమాలతో పాటు అనధికారికంగా బెల్ట్ దుకాణాలు.. బార్లను కొనసాగిస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. జిల్లాకు కలెక్టర్, ఎస్సీలు ఉన్నా.. వారు లేనట్టుగానే ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment