
సాక్షి, విజయవాడ: ఈ నెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని అవినాష్ మండిపడ్డారు.
‘‘జగన్ హయాంలో ఉన్నత విద్యను అందించి పథకాలు అమలు చేసింది. కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలను నాశనం చేసింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను నాశనం చేసారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 12వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కార్యక్రమాలు చేపడతాం’’ అని అవినాష్ తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం: స్వామిదాస్
మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేదలకు విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ‘‘విద్యతోనే సముల మార్పు సాధ్యం.. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జగన్ పిలుపు మేరకు 12వ తేదీన ఫీజు పోరు చేస్తున్నాం. మెడికల్ కాలేజీలను అమ్ముకొని కార్పొరేట్లకు ఊడిగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులు సరిచేసుకోవాలి. సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదు. విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం పథకాలు మాయం చేశారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాలు ఒప్పుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు.
మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారు: మొండితోక జగన్మోహన్రావు
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్సార్, జగన్ హయంలో పేద ప్రజలు ధీమాగా ఉండేవారు. చదువు విషయంలో బెంగ పడేవారు కాదు. జగన్ మంచి చేస్తారనే నమ్మకం వారిలో ఉండేది. మెడికల్ కాలేజీలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తప్పులు బయటపడతాయని వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని జగన్మోహన్రావు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment