
పిడుగు గుట్టు.. పసిగట్టు!
హుజూరాబాద్:
ప్రకృతి వైపరీత్యాలు.. ఈదురుగాలులు.. ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు. పిడుగుపాట్లు.. ప్రాణనష్టం.. ఆస్తినష్టం.. ఏడాదిలో ఎప్పుడైనా జరగొచ్చు. ముఖ్యంగా వర్షాకాలనికి ముందు అకాల వర్షాలు ఎక్కువగా పడుతాయి. రైతులు ఇబ్బంది పడుతారు. ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటు ఘటనలు అనేకంగానే చోటుచేసుకుంటున్నాయి. ఏటా పిడుగుపాటు మరణాలు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మూగజీవాలు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ. ఎత్తైన కొండలు, గుట్టటూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహజంగానే పిడుగులు పడుతుంటాయి. సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాలిలో విచ్ఛిన్నత అధికమైన వాతావరణంలో పిడుగులు పడే అవకాశం ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు.
అలర్ట్గా ఉంటే మేలు..
పిడుగుపాటును ముందే తెలుసుకోగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రమాదాన్ని అరగంట ముందే గుర్తించగలిగే శ్రీదామినిశ్రీ మొబైల్ యాప్ ఉంది. పుణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) నాలుగేళ్ల క్రితం దీనిని విడుదల చేసింది. పిడుగుపాటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 83 చోట్ల ప్రత్యేక సెన్సర్లు అమర్చారు.
యాప్ను ఎలా యూజ్ చేయాలంటే..?
ముందుగా ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్లి..దామిని లైట్నింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్కోడ్తో రిజిస్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లోకేషన్ తెలుసుకోవడం కోసం యాప్కు పర్మిషన్ ఇవ్వాలి. మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి మూడు రంగులను ఐడెంటిఫికేషన్ కలర్స్ కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరు ఉన్న చోట పిడుగు పడే ఛాన్స్ ఉంటే ముందే హెచ్చరిస్తుంది.
రెడ్ కలర్: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది.
ఎల్లో కలర్: మరో 10–15 నిమిషాల్లో పిడుగుపడే చాన్స్ ఉంటే యాప్లోని సర్కిల్ పసుపు కలర్లోకి చేంజ్ అవుతుంది.
బ్లూ కలర్: 18–25 నిమిషాల్లో పిడుగు పడే చాన్స్ ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్లోకి మారుతుంది.
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు కొన్ని సందర్భాల్లో పోతున్న ప్రాణాలు
జాగ్రత్తలు తీసుకుంటే బటయపడొచ్చంటున్న నిపుణులు
పిడుగులపై ‘దామిని’ ముందస్తు హెచ్చరికలు
జాగ్రత్తలు పాటిస్తే మేలు
వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు. పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలకు (విద్యుత్ స్తంభాలు, సెల్ ఫోన్ టవర్లు, బోర్ పంప్ సెట్లు) దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో ఉపయోగించకూడదు.
బహిరంగ ప్రదేశాలలో పిడుగు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంట పొలాలలో మొబైల్ వాడకూడదు. ఎందుకంటే మొబైల్ నుంచి వచ్చే సిగ్నల్ పిడుగు పడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది.
పాడి పశువులను మేతకు బయటికి తీసుకెళ్లకుండా పశువుల పాకలోనే ఉంచాలి.
నల్లని మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పంట పొలాలలో తిరగకుండా ఏవైనా భవనాల కిందే తలదాల్చుకునే లాగా చూసుకోవాలి. ఒకవేళ వారికి అందుబాటులో ఏదైనా భవనం లేకపోతే తాము ఉన్నస్థావరంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను తమ చేతులతో మూసుకోవాలి.
ఈ చిత్రంలో శవమై కనిపిస్తున్న ఈయన పేరు రుద్రారపు చంద్రయ్య. ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం భరత్నగర్. గత ఏడాది మే 16న పొలం పనులకు వెళ్లాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం స్టార్ట్ అయ్యింది. అంతలోనే వ్యవసాయ పనులు చేస్తున్న చంద్రయ్యపై పిడుగు పడింది. ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు. ఇంటిపెద్ద హఠాత్తుగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య, ముగ్గురు కూతుళ్లు ఒంటరివారయ్యారు.
–తంగళ్లపల్లి(సిరిసిల్ల)
అలెర్ట్గా ఉంటే ప్రమాదాలకు దూరం
వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు పడుతాయన్న సమయంలో బయటికి వెళ్లకుండా పనులు ఆపుకుంటే మంచింది. అత్యవసర పనులు ఉండి బయటికి వెళ్లిన సమయంలో దామిని లైట్నింగ్ యాప్ను ఉపయోగించే పిడుగు ఎక్కడ పడుతుందో.. ఏ సమయంలో పడుతుందో పసికట్టవచ్చు. తద్వారా ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
– కనకయ్య, తహసీల్దార్, హుజూరాబాద్
సూచనలు పాటించాలి
జగిత్యాల అగ్రికల్చర్: ఆకాశం మేఘావృతమై బలమైన ఈదురు గాలులతో వర్షం కురిసే సమయంలో పిడుగులు పడుతుంటాయి. వీటికి అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. ఇది విపరీతమైన గాలులు వీచినప్పుడు, మేఘాలలోని మంచు కణాల మధ్య రాపిడి జరిగి ఎలక్ట్రికల్ చార్జి విడుదల చేస్తుంది. రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు మేఘాలలో ఉండే పాజిటివ్ కణాలు బరువుగా ఉండే నెగెటివ్ కణాలను ఆకర్షించుకొని ఆకాశంలో మెరుపులకు దారితీస్తాయి. నెగెటివ్ కణా లు, భూమిలోని పాజిటివ్ కణా లను ఆకర్షిస్తాయి. ఫలితంగా మెరుపులతో పిడుగు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకండ్కు 100కిపైగా పిడుగులు పడుతున్నాయి. ఏటా పిడుగుపాటుకు గురై 24 వేల మంది చనిపోతున్నారు. రెండు లక్షల మందికి పైగా గాయపడుతున్నారు.
– బి. శ్రీలక్ష్మి,
వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త

పిడుగు గుట్టు.. పసిగట్టు!

పిడుగు గుట్టు.. పసిగట్టు!

పిడుగు గుట్టు.. పసిగట్టు!