
డ్రోన్ పైలట్గా ఎదిగిన కమలాపురం పొదుపు మహిళ జ్యోత్స్న
‘లక్పతి దీదీ’ పథకం ద్వారా వైఎస్సార్ జిల్లా నుంచి ఎంపిక
ఇప్పటివరకు 9 మండలాల్లో పొలాలకు పురుగుమందుల పిచికారి
58 రోజుల్లోనే రూ.3లక్షల వరకు ఆదాయం
ఆసక్తి ఉంటే అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగవచ్చని... ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని నిరూపించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మున్సిపాలిటీలోని కె.అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘంలో క్రియాశీలకంగా ఉన్న ఆమె డ్రోన్ పైలట్గా ఎదిగారు. తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా డ్రోన్ మహిళగా గుర్తింపు పొందారు. –కమలాపురం
రూ.3లక్షల వరకు వచ్చాయి
నేను కలలో కూడా డ్రోన్ పైలట్ అవుతానని అనుకోలేదు. ఇప్పటి వరకు కమలాపురం, చెన్నూరు, వల్లూరు, సీకే దిన్నె, కడప, వేముల, సిద్ధవటం, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేశాను. ఎకరాకు రూ.400 తీసుకుంటున్నా. తొమ్మిది మండలాల్లో 58 రోజుల్లో దాదాపు 700 ఎకరాల్లో పురుగుమందులు పిచికారి చేశా. రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – నామాల జ్యోత్స్న, కె.అప్పాయపల్లె, కమలాపురం, వైఎస్సార్ జిల్లా
పొదుపు సంఘం నుంచి ఢిల్లీ వరకు
దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ జిల్లా ఒకటి. వైఎస్సార్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోత్స్నను డ్రోన్ పైలట్గా ఎంపిక చేశారు. ఆమె కమలాపురంలోని ‘నికితా’ పొదుపు సంఘం లీడర్గా ఉన్నారు. గ్రూప్ లీడర్గా బాగా పనిచేస్తున్న జ్యోత్స్నను డీఆర్డీఏ అధికారులు గుర్తించి కరోనా కాలంలో క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. ఆమె బంతి, నిమ్మ, గుమ్మడి, వంగ, మిర్చి, వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘లక్పతి దీదీ’ పథకానికి కూడా జ్యోత్స్నను అధికారులు ఎంపిక చేశారు. ఆమె 2023 డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్లో శిక్షణ పొందారు. లక్పతి దీదీ పథకాన్ని 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్తోపాటు డ్రోన్ అందజేశారు. మార్చి 27న అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె 58 రోజులపాటు డ్రోన్ ఉపయోగించి పురుగుమందులు పిచికారి చేసి రూ.3లక్షల వరకు ఆదాయం పొందారు.
స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరు..
ఢిల్లీలో 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించేందుకు డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వైఎస్సార్ జిల్లా నుంచి జ్యోత్స్న వెళ్లి స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని ఆమె తెలిపారు. కడపలో 2024, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీఆర్డీఏ తరఫున ఆమె డ్రోన్ ఎగురవేసి రూ.25వేలు నగదు బహుమతి పొందారు.