
లక్ష్యం కొండంత.. వసూలు అంతంత!
సిద్దిపేటజోన్: మున్సిపాలిటీల్లో పన్ను వసూలు అంతంగానే సాగుతోంది. గడువు ముంచుకొస్తున్నా.. మొండి బకాయిలు గుదిబండలా మారాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని అందుకునేందుకు మార్చి 31 చివరి గడువు ఉంటుంది. మరోవైపు మున్సిపాలిటీల్లో కొండంత వసూలు లక్ష్యం అధికార యంత్రాంగానికి సవాల్గా నిలిచింది. నెల ముందు నుంచే ప్రత్యేక డ్రైవ్ల ద్వారా వంద శాతం వసూలు లక్ష్యం చేరుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో రానున్న 30 రోజుల్లో రూ.10కోట్లకుపైగా ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, మున్సిపాలిటీల్లో ప్రతి ఏటా ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ సాగుతోంది. ఈ లెక్కన 2024–25 ఆర్థిక సంవత్సరం లక్ష్యం మార్చి31లోగా పూర్తి చేయాలి. వంద శాతం పన్నుల వసూలు చేసిన మున్సిపాలిటీకి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని రెవెన్యూ యంత్రాంగం ముందస్తు ప్రణాళికల మేరకు ఆస్తిపన్ను చెల్లింపుదారుల పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అవసరమైతే ఒకేసారి చెల్లించే వారికి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాయితీలు అందిస్తోంది.
బకాయిలు ఇలా..
సిద్దిపేట మున్సిపల్ పరిధిలో రూ.17.42కోట్లకు గాను రూ.12.20కోట్లు వసూలు చేశారు. మిగతా రూ.5.23 కోట్లు ఈ నెలాఖరులోగా వసూలు చేయాలి. హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.1.72కోట్లకు గాను కోటి వసూలు చేశారు. మిగతా 72 లక్షల బకాయిలున్నాయి. దుబ్బాక మున్సిపాలిటీలో రూ.2 03కోట్లకు రూ.1.23 కోట్లు వసూలు అయ్యాయి. ఇక్కడ మరో 80 లక్షలు రావాల్సి ఉంది. గజ్వేల్ మున్సిపాలిటీలో రూ. 4.75 కోట్లకు రూ.3.05 కోట్లు వసూలు చేశారు. మరో కోటి 70 లక్షల బకాయిలున్నాయి. చేర్యాల మున్సిపాలిటీలో రూ.3.14 కోట్లకు రూ.1.60కోట్లు వసూలు చేశారు. మరో 30 రోజుల్లో రూ.1.54కోట్లు వసూలు చేయాలి
రంగంలోకి కమిషనర్లు..
ప్రభుత్వ నిర్దేశించిన వంద శాతం పన్నుల వసూలు లక్ష్యం ఛేదించడానికి మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ అధికారులతో కలిసి బకాయిలు పేరుకుపోయిన వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించి వసూలు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వ రాయితీ గూర్చి వివరించి వారిలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
పన్ను బకాయిలు రూ.10కోట్ల పైనే
ముంచుకొస్తున్న గడువు
గుదిబండగా మొండి బకాయిలు
లక్ష్య సాధనకు చర్యలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి31లోగా నిర్దేశించిన లక్ష్యం సాధించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బంది వెళ్తున్నారు. మిగిలిన బకాయిలు త్వరితగతిన వసూలు చేస్తాం
–ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట

లక్ష్యం కొండంత.. వసూలు అంతంత!
Comments
Please login to add a commentAdd a comment