
టీ20 వరల్డ్కప్ ఛాంపియన్స్ టీమిండియాకు తమ సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. ముంబైలో వేలాది మంది అభిమానుల నీరాజనాల మధ్య భారత ఆటగాళ్ల బస్ విక్టరీ పరేడ్ అంగరంగవైభంగా జరిగింది. ఆ తర్వాత వాఖండే స్టేడియంలో విశ్వవిజేతలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది.
ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియంకు తరలిచ్చారు. టీమిండియా స్టేడియంలో అడుగుపెట్టగానే జయహో భారత్ అంటూ జేజేలు కొట్టారు. భారత ఆటగాళ్లు సైతం వారి అభిమానానికి పిధా అయిపోయారు.
దీంతో భారత ప్లేయర్లు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ను అలరించారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 2007 వరల్డ్కప్ విజయం కంటే ప్రస్తుత ప్రపంచకప్ గెలుపు తనకెంతో ప్రత్యేకమైనదని రోహిత్ తెలిపాడు.
"2007 వరల్డ్కప్ విజయాన్ని నేను ఎప్పటికి మర్చిపోలేను. ఎందుకంటే అది నా ఫస్ట్ వరల్డ్కప్ విజయం. అప్పుడు కూడా ఇదే ముంబైలో విక్టరీ పరేడ్ జరిగింది. అయితే అది మధ్యాహ్నం.. ఇప్పుడు ఇది సాయంత్రం. అయితే ఈసారి వరల్డ్కప్ విజయం నాకెంతో ప్రత్యేకం.
ఎందుకంటే విజేతగా నిలిచిన జట్టుకు నేను సారథిగా ఉన్నాను. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. ఈ విజయం నా ఒక్కడికే కాదు ఎవత్ దేశానికి గర్వకారణం.
ఈ ట్రోఫీ కోసమే గత 13 ఏళ్లగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 140 కోట్ల భారతీయుల కలనెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని" బీసీసీఐతో రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment