
పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్
ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), తిలక్ వర్మ (30 నాటౌట్) కూడా రాణించారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
16.4వ ఓవర్- 148 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హరీస్ రౌఫ్ బౌలింగ్లో సంజూ శాంసన్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్
12.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔటయ్యాడు. అభిషేక్ మరో భారీ షాట్కు ప్రయత్నించే క్రమంలో హరీస్ రౌఫ్కు క్యాచ్ ఇచ్చాడు. తిలక్ వర్మకు (1) జతగా సంజూ శాంసన్ క్రీజ్లోకి వచ్చాడు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
10.3వ ఓవర్- హరీస్ రౌఫ్ బౌలింగ్లో అబ్రార్ అహ్మద్ క్యాచ్ తీసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యాడు. బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకొని నేరుగా అబ్రార్ చేతుల్లోకి వెళ్లింది. భారత్ స్కోర్ ప్రస్తుతం 106/2గా ఉంది. అభిషేక్కు (58) జతగా తిలక్ వర్మ క్రీజ్లోకి వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
9.5వ ఓవర్- 105 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మకు (57) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు.
దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు
172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. గిల్ 35, అభిషేక్ 33 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు ఇంకా 84 బంతుల్లో 103 పరుగులు మాత్రమే చేయాలి.
విధ్వంసం సృష్టిస్తున్న భారత ఓపెనర్లు
172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. గిల్ 22, అభిషేక్ 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్
172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్సర్ బాదాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఈ ఘనత సాధించాడు. తొలి ఓవర్ తర్వాత భారత్ స్కోర్ 9/0గా ఉంది. అభిషేక్ 8, గిల్ 1 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరే ఇచ్చింది. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కాస్త పర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు.
కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చుకున్న భారత బౌలర్లు
11.2 ఓవర్లలోనే 100 పురుగులు పూర్తి చేసి భారీ స్కోర్ చేస్తుందనుకున్న పాక్కు భారత బౌలర్లు పగ్గాలు వేశారు. 19 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 159/5గా మాత్రమే ఉంది.
నాలుగో వికెట్ కోల్పోయిన పాక్
14.1వ ఓవర్- 115 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ (58) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన పాక్
13.1వ ఓవర్-110 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి హుస్సేన్ తలాత్ (10) ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఎట్టకేలకు క్యాచ్ పట్టిన అభిషేక్
ఈ మ్యాచ్లో రెండు క్యాచ్లు వదిలేసిన అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఓ క్యాచ్ పట్టుకున్నాడు. శివమ్ దూబే బౌలింగ్లో సైమ్ అయూబ్ (21) ఆడిన షాట్ను అభిషేక్ కష్టమైనా క్యాచ్గా మలిచాడు. 10.3 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 93/2గా ఉంది. ఫర్హాన్కు (53) జతగా హుస్సేన్ తలాత్ క్రీజ్లోకి వచ్చాడు.
పాక్ ఓపెనర్ మెరుపు హాఫ్ సెంచరీ
పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో సిక్సర్తో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/1గా ఉంది. ఫర్హాన్తో (52) పాటు సైమ్ అయూబ్ (21) క్రీజ్లో కొనసాగుతున్నాడు.
మరో క్యాచ్ జారవిడిచిన అభిషేక్
తొలి ఓవర్లో ఈజీ క్యాచ్ వదిలేసిన అభిషేక్ శర్మ 8వ ఓవర్లో మరో క్యాచ్ జారవిడిచాడు. క్యాచ్ పట్టకపోగా బంతి బౌండరీ ఆవల పడింది (సిక్సర్). 8 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 70/1గా ఉంది. ఫర్హాన్ 39, సైమ్ అయూబ్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
రెండు డ్రాప్ క్యాచ్లు.. పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసిన పాకిస్తాన్
భారత ఫీల్డర్లు రెండు ఈజీ క్యాచ్లు డ్రా చేయగా, పాకిస్తాన్ పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసింది. 6 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
ఈజీ క్యాచ్ జారవిడిచిన కుల్దీప్
4.4వ ఓవర్- వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సైమ్ అయూబ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కుల్దీప్ యాదవ్ జారవిడిచాడు. 5 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/1గా ఉంది. ఫర్హాన్ 20, సైమ్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ కూడా ఓ ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు.
హార్దిక్ బౌలింగ్లో ఫకర్ ఔట్
పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (15) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్దిక్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఫకర్ ఆడదామా.. వ ద్దా అనే అనుమానంతో బ్యాట్ ను పెట్టాడు. ఆ బంతి ఫకర్ బ్యాట్ను ముద్దాడుతూ వెళ్లి కీపర్ సంజూ చేతుల్లో పడింది.
అయితే దీనిపై కాస్త అనుమానం వచ్చింది. అది సంజూ శాంసన్ గ్లౌజ్లో పడే ముందు నేలను తాకినట్లు అనిపించింది. కానీ అది నేలను తాకకుండా సంజూ ఫింగర్స్ను తాకుతూగ్లౌజ్లో పడటంతో ఫకర్ పెవిలియన్కు చేరక తప్పలేదు. అయితే ఈ నిర్ణయంపై ఫకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.
తొలి ఓవర్లోనే పాక్ ఓపెనర్కు లైఫ్
పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ చేతిలో పడిన క్యాచ్ను వదిలేశాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో ఫకర్ జమాన్ రెండు బౌండరీలు బాది జోరును ప్రదర్శించాడు. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 17/0గా ఉంది. ఫకర్ 11, ఫర్హాన్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది.
అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో ఆడిన హసన్ నవాజ్, ఖుష్దిల్ షా ఈ మ్యాచ్లో ఆడటం లేదు.
తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(c), మహ్మద్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఫమీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్