
పృథ్వీ షా (PC: ICC X)
Ranji Trophy 2023-24: ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమనంలో ధనాధన్ శతకంతో సత్తా చాటాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత పృథ్వీ షా మళ్లీ మైదానంలో దిగాడు.
గతేడాది ఆగష్టులో మోకాలి నొప్పి కారణంగా దేశవాళీ క్రికెట్కూ దూరమైన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకున్న పృథ్వీ షా.. నెట్స్లో కఠిన శ్రమకోర్చి.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు.
ఎన్సీఏలో పునరావాసం పొంది
ఈ క్రమంలో రిటర్న్ టు ప్లే సర్టిఫికెట్ సంపాదించి రంజీ ట్రోఫీ-2024 సీజన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్తో మ్యాచ్ సందర్భంగా పునరాగమనం చేసిన పృథ్వీ.. తన మొదటి మ్యాచ్లో 35 పరుగులకే పరిమితమయ్యాడు.
తాజాగా.. శుక్రవారం ఛత్తీస్గఢ్తో మొదలైన మ్యాచ్లో సెంచరీతో మెరవడం విశేషం. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పృథ్వీ షా.. 107 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు.
పదమూడో సెంచరీ
మరో ఓపెనర్ భూపేన్ లల్వాణీ 37 పరుగులతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో భాగంగా 32 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. ఇక పృథ్వీ షాకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది పదమూడో సెంచరీ కావడం విశేషం.
కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పృథ్వీ షా ఓపెనర్గా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, శుబ్మన్ గిల్తో ఎదురైన పోటీలో వెనుకబడ్డ అతడు.. మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.
ఈ క్రమంలో 2021లో టీమిండియా తరఫున ఆఖరి టీ20 ఆడాడు పృథ్వీ షా. ఇక భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ అయిన పృథ్వీ షా సారథ్యంలో శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ తదితరులు ఆడటం విశేషం.
చదవండి: Ind vs Eng: కేఎస్ భరత్కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
Comments
Please login to add a commentAdd a comment