Champions Trophy: పాక్‌ కాదు.. భారత్‌ మ్యాచ్‌లకు వేదిక ఇదే?! | Champions Trophy: Dubai Could Host India Matches Considering Hybrid Model, Says Report | Sakshi
Sakshi News home page

Champions Trophy: పాక్‌ కాదు.. భారత్‌ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

Published Mon, Jul 15 2024 3:52 PM | Last Updated on Mon, Jul 15 2024 4:18 PM

Champions Trophy: Dubai Could Host India Matches If Hybrid Model: Report

వచ్చే ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో మరో ఐసీసీ టోర్నీ క్రికెట్‌ ప్రేమికులకు వినోదం పంచనుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరిగిన విషయం తెలిసిందే.

వన్డే ప్రపంచకప్‌ విజేతగా ఆస్ట్రేలియా అవతరించగా.. టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఇక భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో టాప్‌ సెవన్‌లో నిలిచిన జట్లు చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు అర్హత సాధిస్తాయని  ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.

ఇక ఈ టోర్నమెంట్‌ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్నట్లు కూడా తెలిపింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు సమాచారం.

ఆసియా వన్డే కప్‌-2023 మాదిరే హైబ్రిడ్‌ విధానంలో ఈ ఈవెంట్‌ను కూడా నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్‌ల వేదిక గురించి ఐసీసీ చర్చలు జరుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో దుబాయ్‌ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. భారత్‌ మినహా మిగతా జట్లు ఆడే మ్యాచ్‌లకు పాకిస్తాన్‌ వేదిక అయితే.. రోహిత్‌ సేన మాత్రం దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళిక రచించేందుకు ఐసీసీ సుముఖంగా ఉందని సంకేతాలు ఇచ్చింది.

కాగా బీసీసీఐ నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఐసీసీ ఈ విషయం గురించి వార్షిక సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. జూలై 19- 22 వరకు కొలంబో వేదికగా జరుగనున్న మీటింగ్‌లో ఈ అంశం గురించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక గతేడాది ఆసియా వన్డే కప్‌ ఆతిథ్య హక్కులను కూడా పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్‌ మండలి అధ్యక్షుడు జై షా సారథ్యంలోని ఏసీసీ హైబ్రిడ్‌ విధానంలో ఈ టోర్నీ నిర్వహణకు పచ్చజెండా ఊపింది.

భారత్‌ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఇక ఈ టోర్నీలో శ్రీలంక- టీమిండియా ఫైనల్‌ చేరగా.. రోహిత్‌ సేన ట్రోఫీ గెలిచింది.

చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే జట్లు
ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ నేరుగా ఈ టోర్నీలో చోటు దక్కించుకోగా.. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, అఫ్గనిస్తాన్‌ వన్డే వరల్డ్‌కప్‌ పాయింట్ల పట్టిక ఆధారంగా అర్హత సాధించాయి.

చదవండి: రిటైర్మెంట్‌పై రోహిత్‌ కీలక వ్యాఖ్యలు.. అభిమానులకు గుడ్‌న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement