
కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి.
భారత మహిళా బ్యాటర్లలో స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్లు తమ కెరీర్లో అత్యున్నత ఫామ్లో ఉండగా.. బౌలింగ్లో రేణుకా సింగ్ తన మిస్టరీ బౌలింగ్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే. కామన్వెల్త్ గేమ్స్లో మహిళల విభాగంలో క్రికెట్ను ప్రవేశపెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా భారత మహిళల జట్లు కొత్త రికార్డు నెలకొల్పనుంది.
సెమీస్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా గెలుపు
ఇక శనివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఆసీస్ మహిళలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అమేలియా ఖేర్ 40 పరుగులతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ 3, తాహిలా మెక్గ్రాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెత్ మూనీ 36, తాహిలా మెక్గ్రాత్ 34 పరుగులు చేశారు.
చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు'
Katherine Brunt CWG 2022: ఇంగ్లండ్ బౌలర్కు షాకిచ్చిన ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment