Champions Trophy 2025 Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? | How Much Prize Money Will The Winner And Runner Up Of IND VS NZ Champions Trophy Final Will Get | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025 Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

Mar 8 2025 8:21 PM | Updated on Mar 9 2025 10:28 AM

How Much Prize Money Will The Winner And Runner Up Of IND VS NZ Champions Trophy Final Will Get

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్‌ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.

విజేతకు భారీ ప్రైజ్‌మనీ
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($2.24 మిలియన్) లభిస్తాయి. ఫైనల్లో ఓడిపోయిన జట్టు రూ. 9.74 కోట్లు ($1.12 మిలియన్) పొందుతుంది.

సెమీఫైనలిస్టులకు కూడా భారీ ప్రైజ్‌మనీ 
ఈసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనలిస్ట్‌లకు కూడా భారీ ప్రైజ్‌మనీ లభించనుంది. సెమీస్‌లో ఓడిన జట్లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రూ. 4.87 కోట్లు ($5,60,000) చొప్పున పొందుతాయి. ఈసారి గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది.

ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌కు రూ. 3.04 కోట్లు ($3,50,000) లభిస్తాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు సుమారు రూ. 1.22 కోట్లు ($1,40,000) లభిస్తాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు రూ. 60 కోట్లు ($6.9 మిలియన్లు) కేటాయించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53 శాతం అధికం.

అజేయ భారత్‌
ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్‌.. గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌నూ సూపర్‌ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్‌ గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్‌ చేతిలో ఓడింది. అయినా గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్‌ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.

రెండోసారి
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్‌ ఫైనల్లో కివీస్‌ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్‌. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ సాధించిన రెండో టైటిల్‌ కూడా భారత్‌పైనే (ఫైనల్స్‌) కావడం గమనార్హం. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు మంచి ట్రాక్‌ రికార్డు లేకపోవడంతో భారత అభిమానులు ఆందోళన పడుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement