
ప్రపంచ వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్పై కివీస్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్తో కివీస్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.
చెలరేగిన సిరాజ్, షమీ
391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. . భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
అదరగొట్టిన కోహ్లి, గిల్
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు.
చదవండి: IND vs SL: మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం
Comments
Please login to add a commentAdd a comment