
Photo Courtesy:IPL
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి వచ్చిన మ్యాక్స్వెల్.. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పెద్దగా అనుకూలించని పిచ్పై 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 59 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి జతగా కోహ్లి(33) మినహా ఎవరూ రాణించలేదు. తద్వారా ఆర్సీబీ 149 పరుగులకే పరిమితమైంది. అయనప్పటికీ ఆరు పరుగుల తేడాతో గెలిచి వరుసగా విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్వెల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
కాగా, ఇది మ్యాక్స్వెల్కు ఐపీఎల్లో ఐదు ఏళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. మ్యాక్స్వెల్కు ఇది ఏడో ఐపీఎల్ హాఫ్ సెంచరీగా నమోదైంది. చివరిసారి 2016లో మ్యాక్స్వెల్ ఐపీఎల్లో అర్థ శతకం సాధించాడు. ఈడెన్ గార్డెన్లో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్లీ అర్థ శతకంతో మెరిశాడు. 2016, మే4 తేదీన కింగ్స్ పంజాబ్ తరఫున మ్యాక్సీ 42 బంతుల్లో 68 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్ ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేయడానికి పట్టిన రోజులు 1,806. మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడంతో ఆర్సీబీ మురిసిపోతోంది. ఈ ఏడాది కచ్చితంగా టైటిల్ గెలిచి తమ సత్తాచాటాలని భావిస్తున్న ఆర్సీబీకి మ్యాక్సీ టచ్లోకి రావడం ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మ్యాక్స్వెల్కు 14 కోట్ల 25 లక్షల భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
ఇక్కడ చదవండి: విరాట్ కోహ్లికి మందలింపు
Comments
Please login to add a commentAdd a comment