
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్లో ఇంగ్లండ్కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు.
ఈ మేరకు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్ల్లో వార్విక్షైర్ క్లబ్ తరఫున విహారి బరిలోకి దిగనున్నాడు. వార్విక్షైర్ తరఫున అతను కనీసం మూడు మ్యాచ్లు ఆడతాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్కు వెళ్లిన విహారి 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు.