Hanuma Vihari
-
రికీ భుయ్, కేఎస్ భరత్ మెరుపులు.. గోవాపై ఆంధ్ర ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ రికీ భుయ్ (38 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (38 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన గోవా నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్ (51 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా... అర్జున్ టెండూల్కర్ 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్, శ్రీకర్ భరత్ ధనాధన్ షాట్లతో కట్టిపడేశారు. అశ్విన్ హెబర్ (13), షేక్ రషీద్ (8) విఫలం కాగా... భరత్, భుయ్ మూడో వికెట్కు 98 పరుగులు జోడించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఆంధ్ర జట్టు 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర ఆడుతుంది. -
Fact Check: వివాదాల ‘విహారి’!
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చేస్తున్న కృషితో పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్రీడలు దేశాన్నే ఆకర్షించాయి. ఈ రాష్ట్రం ఏ రంగంలో బాగుపడినా నచ్చని పచ్చమీడియా.. ముఖ్యంగా రామోజీరావు క్రీడలపైనా విషం చిమ్ముతున్నారు. ఇందుకు ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ హనుమ విహారి ఉదంతాన్ని కూడా విషపూరితం చేసి, చిలువలు పలువలు అల్లి ఈనాడులో కథనాలు వండి వారుస్తున్నారు. నిజానికి ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్గా హనుమ విహారి వైఖరి ఆది నుంచి వివాదాస్పదమే. జట్టు సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడుతుంటారన్న ఫిర్యాదులున్నాయి. విహారి వ్యవహార శైలిపై పలుమార్లు సాటి ఆటగాళ్లు, ఏసీఏ అధికారులు, కోచ్లు, కోచ్ హెడ్లు కూడా ఫిర్యాదులు చేశారు. అవన్నీ వాస్తవమేనని విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఏసీఏ కథనం ప్రకారం.. విహారిపై ఫిర్యాదుల్లో కొన్ని.. ♦ బెంగాల్ రంజీ మ్యాచ్లో విహారి అందరి ముందు ఒక ఆటగాడి (పృథ్వీరాజ్)ని అసభ్యంగా దుర్భాషలాడారు. దీనిపై ఆయన ఏసీఏకు ఫిర్యాదు చేశారు. ♦ సాటి జట్టు సభ్యులు, సపోర్టు స్టాఫ్తో పాటు ఏసీఏ అధికారులు సైతం తరచూ విహారి అసభ్యకర పదజాలంపై ఫిర్యాదులు చేశారు. ♦ ముస్తాఖ్ ఆలీ టోర్నమెంట్ ఆంధ్ర టీం మేనేజర్ రాజారెడ్డి కూడా జట్టులో గ్రూపులకు విహారి కారణమవుతున్నారని ఫిర్యాదు చేశారు. ♦ ఇతర రాష్ట్రాల తరఫున మ్యాచ్లు ఆడేందుకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాలని విహారి పదే పదే ఏసీఏని అడిగేవారు. కొన్నిసార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కూడా చెప్పేవారు. తరచూ కెప్టెన్సీ నుంచి తప్పించాలనేవారు. మళ్లీ ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని చెబుతుండేవారు. ♦ విహారి అనుభవం, ఆంధ్ర క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా జట్టులో కొనసాగించారు. ♦ హనుమపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని విచారణలో తేలింది. ♦ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో విహారి తర్వాత స్థానంలో ఉన్న రిక్కీబుయ్ని కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని కూడా విహారి అంగీకరించి అభినందించారు కూడా. ♦ ఆ తర్వాత కెప్టెన్గా తననే కొనసాగించాలంటూ విహారి తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు జట్టు సభ్యులు తెలిపారు. ♦ పృథ్వీరాజ్ ఒకేసారి రంజీ జట్టులోకి రాలేదు. అండర్ 14, 16, అండర్ 19 వినూ మన్కడ్, కూచ్ బిహార్, అండర్ 23, 25 కల్నల్ సీకేనాయుడు, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడి ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇంత సీనియారిటీ, అనుభవం ఉన్నప్పటికీ, జనవరిలో బెంగాల్తో జరిగిన రంజీ మ్యాచ్లో కెప్టెన్ విహారి అతన్ని ఆడించలేదు. గాయపడిన మరో వికెట్ కీపర్ను ఆడించారు. చాలా జట్లలో 17 మందికన్నా ఎక్కువ సభ్యులు ఈనాడు పేర్కొన్నట్టు.. క్రికెట్ జట్టులో 15 మందే ఉండాలన్న నిబంధనేమీ లేదు. 17 మందికి మించి సభ్యులున్న జట్లు చాలానే ఉన్నాయి. 2023–24 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ టీమ్లో 18 మంది ఉన్నారు. హైదరాబాద్ జట్టులోనూ 17 మంది కంటే ఎక్కువే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఏసీఏ కూడా ఆంధ్ర జట్టుకు 22 మందిని ఎంపిక చేసింది. ఏసీఏ కార్యదర్శి కోటా కూడా కొత్తదేమీ కాదు.. చంద్రబాబు హయాం నుంచే ఉంది. ఈ విషయాలు తెలియకుండానే రామోజీ కథనం అల్లారా? ఫౌండేషన్ మూతపడేలా 2021 నవంబర్లో తిరుపతిలో వరదల్లో ప్రజలకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను హనుమ విహారి ఫౌండేషన్ అందించింది. ఫౌండేషన్ సహాయ కార్యక్రమాల్లో ఇద్దరు వాలంటీర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని కనిపించారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడంలేదని, తామే చేస్తున్నామంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. అయితే, ఈ సహాయ కార్యక్రమానికి టీడీపీకి కానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు కానీ సంబంధం లేదని, తమ బృందంలోని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారని, అంతమాత్రాన ఇది ఎన్టీఆర్ ట్రస్టు చేసినట్టు కాదంటూ విహారి ఫౌండేషన్ గట్టిగా ఖండించింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు విహారిని వేధించి, వెంటబడి ఫౌండేషన్ మూతపడేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే టీడీపీ నేతలు ఇప్పుడు విహారిపై ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రికెట్పై రాజకీయాలు దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ క్రీడపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘క్రికెట్ అభివృద్ధి, విస్తరణకు దేశంలోని పలు అసోసియేషన్ల మాదిరిగానే ప్రతిష్టాత్మక ఏసీఏ కూడా విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు తావులేదు. ఏసీఏనుద్దేశించి హనుమ విహారి ఆరోపణలు చేయడం విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా సమన్వయం కుదిర్చి సత్ఫలితాలు సాధించడం జట్టు బాధ్యత. అందులోభాగంగా ఏ ఆటగాడైనా తొందరపడినా, మరో రకంగా ప్రవర్తించినా వారి పట్ల అత్యంత సంయమనం పాటిస్తూ జట్టును ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఏసీఏ కృషి చేస్తుంది. జట్టు ప్రయాజనాలు, క్రికెట్ స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని లోలోపలే సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. పరిధి దాటితే నిబంధనల ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. హనుమ విహారి బహిరంగంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఏసీఏ, సాటి సభ్యులపై ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు గమనించాలి’ అని ఏసీఏ కోరింది. పైరవీలు చేస్తే నా కొడుకు కెప్టెన్ అయ్యేవాడుగా? ఆంధ్రా క్రికెట్ జట్టు సభ్యుడు పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి తిరుపతి మంగళం: ‘భారత క్రికెట్ జట్టుకు ఆడిన ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి తన సహచర ఆటగాడు పృథ్వీరాజ్పై అసత్య ఆరోపణలతో ట్వీట్ చేయడం బాధాకరం. నిజంగా నేను పైరవీలు చేసి ఉంటే నా కుమారుడు పృథ్వీరాజ్ ఎందుకు ఆంధ్రా జట్టులో 17వ ఆటగాడిగా ఉంటాడు. ఏకంగా కెపె్టన్ అయ్యేవాడు కదా..’ అని పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి అన్నారు. ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతికి చెందిన నా కుమారుడు పృథ్వీరాజ్ అండర్–12, 14, 17, 19 క్రికెట్లో విశేష ప్రతిభ చూపాడు. బ్యాటర్గా, వికెట్ కీపర్గా అనేక రికార్డులు పృథ్వీరాజ్పై ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఒక్క రంజీ మ్యాచ్ అడే అవకాశం రాలేదు. నేను రాజకీయంగా ప్రభావితం చేసి నా కుమారుడిని క్రికెట్ జట్టులోకి తీసుకువస్తున్నట్లు హనుమ విహారి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. నేను ఏసీఏను రాజకీయంగా ప్రభావితం చేయగలిగే వాడినే అయితే నా కుమారుడు ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడకుండా ఉంటాడు. నా కుమారుడు పృథ్వీరాజ్ ప్రతిభ కలిగినవాడు. స్వశక్తితో పైకి రావాలని కోరుకుంటాడు. పైరవీలు, రాజకీయ ప్రభావంతో ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారి తోటి క్రీడాకారులను పైకి తీసుకువచ్చే విధంగా ఆలోచించాలి. కానీ ఆయన మరొక క్రికెటర్ను దెబ్బతీసేలా మాట్లాడటం, అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. హనుమ విహారి చేసిన తప్పులను త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తా..’ అని నరసింహాచారి చెప్పారు. -
క్రికెట్పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. క్రికెట్ అభివృద్ధి విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఇందుకు విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నియమ నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్ ముందుకు సాగుతోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు ఎక్కడా తావులేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ఉద్దేశిస్తూ హనుమ విహారి ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై ఇలాంటి ఆరోపణలు విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా వారి మధ్య సమన్వయం కుదిర్చి మంచి ఫలితాలు సాధించడం అన్నది జట్టు మేనేజ్మెంట్ మీద ఉన్న ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఏ ఆటగాడైనా తొందరపడ్డా, లేక మరో రకంగా ప్రవర్తించినా వారి విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరించి జట్టును ఒక్కతాటిపైకి తీసుకురావడానికి మేనేజ్మెంట్ నిరంతరం ప్రయత్నిస్తుంది. జట్టు ప్రయోజనాలను, క్రికెట్ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని లోలోపలే వాటిని సర్దుబాటు చేయడానికి యత్నిస్తుంది. పరిధి దాటినప్పుడు నిర్దేశిత నియమావళి, పద్ధతులు ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. సీనియర్ ఆటగాడు హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్పైనా, తోటి ఆటగాళ్లపైనా విమర్శలు చేసిన నేపథ్యంలో కొన్ని రాజకీయ పక్షాల నాయకులు వాటిని ఆసరాగా తీసుకుని అసోసియేషన్ నాయకత్వంపైనా, మేనేజ్మెంట్పైనా ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వాస్తవ అంశాలను తెలియజేస్తున్నాం. హనుమ విహారి బాల్యం నుంచి అన్ని ఏజ్ గ్రూప్ల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడారు. 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడారు. ఇక్కడి నుంచే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తర్వాత 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుండి విహారి తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. హనుమ విహారి విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది. కాని ఈసారి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో భారత జట్టుకు ఎంపిక కాకపోవడం పట్ల తాను ఫ్రస్టేషన్లో ఎమోషన్కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ, ఆంధ్రా తరపున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను కోరాడు. జట్టులోకి విహారి రావడం, పోవడం వల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది. అయినప్పటికీ విహారి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. -
Hanuma Vihari: బా‘బోరు’ అంతే!.. మావాళ్లు చేస్తే పడుండాలి అనే టైపు!
ప్రపంచంలో ఎక్కడ.. ఏ మూలన జరిగే విషయమైనా తనకు పనికి వస్తుందనుకుంటే వెంటనే రాగం అందుకుని సాగదీయడం చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్న మాట రాజకీయవర్గాల్లో తరచూ వినిపిస్తుంది. మంచి జరిగితే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ఆయన ఎంత ‘దూరమైనా’ వెళ్తారంటారు. టీమిండియా క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టుకు ఆడబోనంటూ ఆరోపణలు చేసిన హనుమ విహారి విషయంలోనూ బాబు అదే పంథాను అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. ‘‘హనుమ విహారిని వేధించారు.. మేము అతడికి అండగా ఉంటాం’’.. అంటూ... తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు... తాము అధికారంలోకి వస్తే విహారికి రెడ్కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తామంటూ ఆయన కుమారుడు లోకేశ్ సానుభూతి ఒలకబోస్తున్నారు. టార్చర్ పెట్టారు.. అప్పుడే మర్చిపోయారా? అధికారంలోకి వస్తే.. అని మాట్లాడుతున్న లోకేశ్, చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో.. తమ పార్టీ హనుమ విహారిని వేధించిన తీరును మర్చిపోయినట్లున్నారు. కేవలం ఆటకే పరిమితం కాకుండా హనుమ విహారి ఫౌండేషన్ పేరిట కార్యక్రమాలు చేస్తుంటే.. దానిని తమకు ఆపాదించుకుని.. ఆపై విహారే స్వయంగా తమకు క్షమాపణలు చెప్పేలా టార్చర్ పెట్టిన తీరు వాళ్లకు గుర్తున్నట్లు లేదు. కులం పేరిట విహారిని వివక్షకు గురిచేసి, వ్యక్తిగతంగానూ అతడి ప్రతిష్టను దిగజార్చి ఫౌండేషన్ మూయించేసిన టీడీపీ పెద్దలు ఇప్పుడేమో అతడి పట్ల సానుభూతి ప్రదర్శించడం గమనార్హం. అది కూడా తమ స్వప్రయోజనాల కోసం పాకులాడుతూ..పైగా అతడికేదో మేలు చేస్తామంటూ మొసలి కన్నీళ్లు కార్చడం దౌర్భాగ్యం. గతంలో ఏం జరిగింది? 2021లో తిరుపతిలో వర్షాల నేపథ్యంలో వరదలో చిక్కుకున్న ప్రజలకు విహారి ఫౌండేషన్ పాలు, బ్రెడ్ సహా పలు ఆహార పదార్థాలు పంపిణీ చేసింది. తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్టు టీ షర్ట్స్ వేసుకుని కనిపించడంతో.. ఇక టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. ప్రభుత్వంపై బురద జల్లే క్రమంలో విహారి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని బాబోరి ఖాతాలో వేసేసింది. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందిస్తాయన్న విషయాన్ని.. అది కూడా పక్కోళ్లు చేసిన సాయానికి క్రెడిట్ తీసుకోవాలని స్కెచ్ వేసింది. సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సాయం కాదిది ఈ విషయాన్ని గమనించిన విహారి ఫౌండేషన్.. ‘‘19- నవంబరు-2021న తిరుపతిలో జరిగిన ఈ సహాయ కార్యక్రమాలకి టీడీపీకి గానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మాతో పాటు వచ్చిన రవి, లోకేష్ అని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ-షర్ట్స్ వేసుకుని ఉన్నారు. అంతమాత్రాన ఇది మీరు చేసినట్లు కాదు కదా?’’ అని టీడీపీ క్యాంపునకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. కేవలం రూ. 3500 బ్రెడ్ ఇచ్చి దానకర్ణుడిలా బిల్డప్పా అంటూ దీంతో బాబోరి బ్యాచ్కు కోపమొచ్చి.. ‘‘రవి, లోకేశ్ వాలంటీర్లు కాదు. ఎన్టీఆర్ ట్రస్టు ఉద్యోగులు. అయినా హనుమ విహారి ఫౌండేషన్ కేవలం రూ. 3500 విలువ చేసే బ్రెడ్ను మాత్రమే ప్రజలకు అందించింది. కానీ మేము రూ. 3 లక్షలు అందించాం’’ అంటూ విహారి సేవలను తక్కువ చేసేలా పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో విహారి, అతడి ఫౌండేషన్ను ట్రోల్ చేస్తూ ఫౌండేషన్తో వ్యాపారం చేస్తున్నావా? కుల రాజకీయాలకు పాల్పడుతున్నావా అని తమ బుద్ధులను ఆపాదిస్తూ కించపరిచింది. ట్రోల్స్ స్థాయి శ్రుతి మించడంతో విహారి తట్టుకోలేకపోయాడు. కుల వివక్షకు గురిచేశారు ‘‘మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు కానీ రాజకీయ ఉద్దేశాలు కానీ లేవు. జరిగింది ఒక సమాచార లోపం. గత 24 గంటల్లో అతి తీవ్రమైన వ్యక్తి దూషణలకి, మరియు కుల వివక్షకు గురి అయ్యాము. గత 6 నెలల్లో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవ కార్యక్రమాలు చేసాము. ఇక ముందు మేము ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం లేదు. ధన్యవాదాలు’’ అంటూ తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఎక్స్(ట్విటర్) వేదికగా విహారి ఫౌండేషన్ ప్రకటించింది. బాబూ మీకో దండం అన్నట్లు విధిలేక క్షమాపణలు కూడా చెప్పింది. తానా అంటే తందాన అదండీ సంగతి.. పక్కోళ్ల క్రెడిట్ కొట్టేయడమే గాకుండా.. పైగా వాళ్లనే బోడి సాయం అన్న చందంగా కించపరిచి... అయినా అహం చల్లారక కుల వివక్ష చూపుతూ ట్రోల్ చేసి ఫౌండేషన్ను మూసివేయించింది పచ్చ బ్యాచ్. నలుగురికి అందే ఆ సాయమేదో అందకుండా చేసి పైశాచిక ఆనందం పొందింది. ఇప్పుడేమో హనుమ విహారి ఏవో రాజకీయాలంటూ స్పష్టమైన కారణం చూపకుండా ఆంధ్ర జట్టుకు ఆడనంటే.. అతడిపై సానుభూతి ప్రదర్శించే నాటకాన్ని రక్తికట్టించే పనిలో పడింది. ఇక టీడీపీ బాస్కు తానా అంటే తందానా అని భజన చేసే యెల్లో మీడియా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ గుండెలు బాదుకుంటోంది! అట్లుంటది మరి బా‘బోరు’.. ఆయన బ్యాచ్ పని(ప్రచార)తనం!! చదవండి: ఇంకేంటి విహారి?!.. అన్నీ నువ్వే చెప్తే ఎలా? ఆ కోతులకేమో కొబ్బరి చిప్ప! -
Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి..
Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రికీ భుయ్ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. రంజీ తాజా ఎడిషన్ ఆరంభంలో కెప్టెన్గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి 43, కరణ్ షిండే 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్ హెబ్బర్ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఆఖర్లో గిరినాథ్రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది. ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ స్కోర్లు: ►మధ్యప్రదేశ్- 234 & 107 ►ఆంధ్రప్రదేశ్- 172 & 165. -
ఆ రోజు ద్రవిడ్ చెప్పాడు.. తర్వాత ఎవరూ టచ్లో లేరు!
Hanuma Vihari Comments: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి టీమిండియా పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్మెంట్ నుంచి తనకు ఇప్పటి వరకు పిలుపు రాలేదని.. ప్రస్తుతం తాను జాతీయ జట్టులో చోటు గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని పేర్కొన్నాడు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఏ జట్టు కోసమైనా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం రంజీ ట్రోఫీ మీదనే ఉందని.. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే మంచిదేనంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్తో అరంగేట్రం కాగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 మ్యాచ్లు ఆడి 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(111) కూడా ఉంది. అదే ఆఖరు ఇక వన్డౌన్లో బ్యాటింగ్ చేసే విహారి ఆఖరిసారిగా 2022లో ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలం(మొత్తం 31 రన్స్) కావడంతో మళ్లీ సెలక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టిన హనుమ విహారి తాజా రంజీ సీజన్లో తొలుత ఆంధ్ర కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే, బ్యాటింగ్పై ఫోకస్ చేసేందుకు కెప్టెన్సీ వదులుకుని ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆరోజు ద్రవిడ్ అదే చెప్పాడు ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి విహారి 365 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ గురించి ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘మేనేజ్మెంట్తో నేను కాంటాక్ట్లో లేను. నా ఆఖరి టెస్టు తర్వాత రాహుల్ ద్రవిడ్ ఒక్కడే నాతో మాట్లాడాడు. నా ఆటలోని లోపాలను తెలియజేసి.. వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకతను వివరించాడు. ఆ తర్వాత ఎవరూ టచ్లో లేరు. అయితే, ప్రస్తుతం దేని గురించి ఆలోచించకుండా.. బ్యాటింగ్ను మెరుగుపరచుకోవడంపై మాత్రమే దృష్టి సారించాను. నా దృష్టి మొత్తం బ్యాటింగ్ మీదే ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా బెస్ట్ ఇచ్చి పరుగులు రాబట్టడమే పని. కెరీర్ పరంగా ఇప్పుడు నేను ఎలాంటి ఆశలు, అంచనాలు పెట్టుకునే దశలో లేను. ఏదేతే అది జరుగుతుంది. టెస్టు జట్టులో లేనందుకు నిరాశ, బాధ ఉన్న మాట వాస్తవమే. అయినా ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఇప్పుడైతే రంజీలో వీలైనన్ని పరుగులు రాబట్టడమే పని’’ అని 30 ఏళ్ల హనుమ విహారి చెప్పుకొచ్చాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో ఎలైట్ బి గ్రూపులో ఉన్న ఆంధ్ర జట్టు ప్రస్తుతం మూడు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: #Arjun Tendulkar: సచిన్ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్లో కూడా -
హనుమ విహారి, రికీ భుయ్ శతకాలు.. ఆంధ్ర ఘన విజయం
Ranji Trophy 2023-24- Chhattisgarh vs Andhra: రంజీ ట్రోఫీ 2023-24లో ఛత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రాయ్పూర్ వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఛత్తీస్గఢ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర 431 పరుగుల భారీ స్కోరు చేసింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్లో హనుమ విహారి(183), కెప్టెన్ రికీ భుయ్(120) సెంచరీలు చేయడంతో ఈ మేరకు పరుగులు సాధించింది. అనంతరం ఛత్తీస్గఢ్ 262 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించగా.. ఆంధ్రకు 169 రన్స్ ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆంధ్ర జట్టు.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఛత్తీస్గఢ్కు 320 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, ఆంధ్ర బౌలర్ల విజృంభణ కారణంగా ఛత్తీస్గఢ్ 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా సోమవారం ముగిసిన ఈ రంజీ మ్యాచ్లో ఆంధ్ర బౌలర్లలో ప్రశాంత్ కుమార్, నితీశ్ రెడ్డి మూడేసి వికెట్లు తీయగా.. పృథ్వీరాజ్ యర్రా రెండు, గిరినాథ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
Ranji Trophy: హనుమ విహారి సెంచరీ
Ranji Trophy 2023-24 - Chhattisgarh vs Andhra రాయ్పూర్: ఛత్తీస్గఢ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో ఆంధ్ర జట్టు కోలుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హనుమ విహారి (119 బ్యాటింగ్; 15 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ రికీ భుయ్ (120; 14 ఫోర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 231 పరుగులు జోడించారు. విహారి, కరణ్ షిండే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక ఇరుజట్ల మధ్య శనివారం రెండో రోజు ఆట మొదలైంది. -
బ్యాట్తో రాణించిన నితీశ్ రెడ్డి.. ఆంధ్ర 188 ఆలౌట్
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది. సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తన్మయ్, రాహుల్ తొలి వికెట్కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
Ind vs Eng: గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే!
Ranji Trophy 2023-24-Mumbai vs Andhra- ముంబై: రంజీ ట్రోఫీ-2024లో తన ఆరంభ మ్యాచ్లో అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కాగా ‘ఎలైట్’ గ్రూప్లో భాగంగా ముంబై- ఆంధ్ర జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ముంబై ఓపెనర్ భూపేన్ లాల్వాని (61) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (48), సువేద్ పార్కర్ (41) ఫర్వాలేదనిపించారు. ఇక గత మ్యాచ్కు దూరమై ఈసారి కెప్టెన్గా బరిలోకి దిగిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (0) తొలి బంతికే నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ గోల్డెన్ డక్ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. రీఎంట్రీ ఇక కష్టమే ఇంగ్లండ్తో టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడం ఇక కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తొలి రెండు జట్టులకు ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఆట ముగిసేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. ఆంధ్ర బౌలర్ నితీశ్కు 3, షోయబ్ మొహమ్మద్ ఖాన్కు 2 వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో 281/6 ఓవర్నైట్ స్కోరుతో ముంబై శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. కెప్టెన్సీకి విహారి రాజీనామా... మరోవైపు.. ఆంధ్ర రంజీ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తప్పుకున్నాడు. బ్యాటింగ్పై పూర్తిగా దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగాల్తో జరిగిన తొలి మ్యాచ్లో విహారి కెప్టెన్గా వ్యవహరించగా... అతని స్థానంలో ఈ మ్యాచ్ నుంచి రికీ భుయ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. -
ఐపీఎల్ 2024 వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న తెలుగు ఆటగాళ్లు వీరే..!
దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీరాజ్ యర్రాలకు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ యర్రా 2 ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు. హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్ ఆల్రౌండర్, 24 ఐపీఎల్ మ్యాచ్ల్లో 284 పరుగులు) కేఎస్ భరత్ (30) (వైజాగ్, వికెట్కీపర్ బ్యాటర్, 10 ఐపీఎల్ మ్యాచ్ల్లో 199 పరుగులు, ఓ హాఫ్ సెంచరీ) పృథ్వీరాజ్ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, 2 ఐపీఎల్ మ్యాచ్ల్లో (కేకేఆర్) ఓ వికెట్) రోహిత్ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) అనికేత్ రెడ్డి (23) (నిజామాబాద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్) రవి తేజ (29) (హైదరాబాద్, ఆల్రౌండర్) మనీశ్ రెడ్డి (24) (హైదరాబాద్, ఆల్రౌండర్) మురుగన్ అభిషేక్ (19) (హైదరాబాద్, స్పిన్ బౌలర్) ఎర్రవల్లి అవనీశ్ రావ్ (19) (హైదరాబాద్, బ్యాటర్) రక్షణ్ రెడ్డి (23) (హైదరాబాద్, మీడియ పేసర్) రాహుల్ బుద్ది (26) (హైదరాబాద్, బ్యాటర్, 2022లో ముంబై ఇండియన్స్ సభ్యుడు) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
మళ్లీ ఓడిన హైదరాబాద్, ఆంధ్ర.. విహారి, హెబ్బర్ రాణించినా..!
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం గ్రూప్ ‘బి’ మ్యాచ్లో సర్వీసెస్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 210 పరుగుల వద్ద ఆలౌటైంది. రాహుల్ బుద్ధి (87 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (45; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. సర్వీసెస్ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పలివాల్ (101 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు), వినీత్ ధన్కర్ (76 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో సర్వీసెస్ను గెలిపించారు. విహారి, హెబ్బర్ రాణించినా.. చండీగఢ్: గ్రూప్ ‘డి’లో ఆంధ్ర జట్టు కూడా వరుసగా రెండో మ్యాచ్లో ఓడింది. రాజస్తాన్ 38 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ 50 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజిత్ తోమర్ (115 బంతుల్లో 124; 15 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ సాధించగా, రామ్ చౌహాన్ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పిన్నింటి తపస్వికి 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆంధ్ర 47.4 ఓవర్లలో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. హనుమ విహారి (80 బంతుల్లో 60; 9 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (89 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించినా... మిడిలార్డర్ వైఫల్యంతో ఆంధ్ర ఓటమిపాలయ్యింది. అనికేత్ చౌదరి 4 వికెట్లతో దెబ్బ తీసాడు. -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214, సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
క్రికెటర్ విహారి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్
-
తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా..
Hanuma Vihari About His Love Story: ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది.. ప్రొఫెషన్తోతో సంబంధం లేకుండా.. కోతి పనులైనా సరే చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది.. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఇదే జరిగింది.. కులాంతర ప్రేమ వివాహం కోసం విహారి పడిన పాట్లు వింటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు గత జ్ఞాపకాలు గుర్తుకురావాల్సిందే. తన నెచ్చెలి ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు.. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించేక్రమంలో రెండేళ్ల ఎడబాటు.. ఆపై పెళ్లితో శుభం కార్డు.. విహారి వీర ప్రేమగాథను తెలుసుకోవాలంటే ఇటు వైపు ఓ లుక్ వెయ్యండి! ఘ ఐపీఎల్లో.. టీమిండియా టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యాటర్ హనుమ విహారి. ఐపీఎల్లో.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడిన ఈ అతడు.. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటివరకు మొత్తంగా 23 ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్ రేట్తో 284 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఇక టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 839 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ ఆఫ్బ్రేక్ స్పిన్నర్. అత్యధిక స్కోరు 111. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో కీలక ఆటగాడైన విహారి అనేక మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలున్నాయి. జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినపుడల్లా తనను తాను నిరూపించుకుంటున్న విహారి.. విమర్శకుల ప్రశంసలతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మెప్పు కూడా పొందాడు. ఇలా ఓవైపు క్రికెటర్గా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమాయణాన్ని కూడా సాగించాడీ బ్యాటింగ్ ఆల్రౌండర్. తల్లే మొదటి గురువు కాకినాడలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విహారి.. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో క్రికెటర్గా ఎదిగాడు. ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారి చెబుతున్నాడు. ప్రీతి అంటే మహాప్రీతి.. ఇక విహారి ప్రేమ విషయానికొస్తే.. తన స్నేహితురాలు ద్వారా ప్రీతి అతడికి పరిచయమైంది. స్నేహం పెరిగి కాస్త ప్రేమగా మారింది.. ఎలాంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు.. విహారికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రేమ కోసం మినీ యుద్ధమే విహారి, ప్రీతి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి నిరాకరించారు. దీంతో.. రెండేళ్ల పాటు కష్టపడి.. వారిని ఒప్పించి చివరికి 2019లో ఇద్దరూ ఒకటయ్యారు. అయితే.. ఈ రెండేళ్ల పాటు ఓ మినీ యుద్ధమే చేశానని ‘సాక్షి’తో చెప్పుకొచ్చాడు విహారి. ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరి వెళ్లి చూసేవాడిని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాగా హనుమ విహారి- ప్రీతి ప్రేమకు గుర్తుగా వారికి కొడుకు జన్మించాడు. కాగా విహారి భార్య ప్రీతికి క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేనప్పటికీ భర్త కోపసం మ్యాచ్లు చూస్తుందట. ఏపీ ప్రభుత్వం సూపర్ ఇదిలా ఉంటే.. ఇటీవల విహారి ఆంధ్రప్రీమియర్ లీగ్లో ఆడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ సొంతరాష్ట్రంలో ఏపీఎల్ సీజన్-2లో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడేవిధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని ప్రశంసించాడు. మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో గానో ప్రోత్సహిస్తున్నది అని హనుమ విహారి హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఏపీఎల్ సీజన్-2లో రాయలసీమ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించిన హనుమ విహారి జట్టుకు టైటిల్ అందించిన విషయం తెలిసిందే. నరేష్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, విశాఖపట్నం View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) -
హనుమ విహారి కీలక నిర్ణయం.. మళ్లీ ఆంధ్రతోనే
హైదరాబాద్: భారత టెస్టు క్రికెటర్ గాదె హనుమ విహారి వచ్చే దేశవాళీ సీజన్లో మధ్యప్రదేశ్ జట్టుకు ఆడాలనుకున్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. తన సొంత జట్టు ఆంధ్ర తరఫునే కొనసాగేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సభ్యుల విజ్ఞప్తి మేరకు విహారి ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత సీజన్లో విహారి నాయకత్వంలోనే ఆంధ్ర రంజీ ట్రోఫీ నాకౌట్ దశకు చేరగా...బ్యాటింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన అతను 14 ఇన్నింగ్స్లలో 2 హాఫ్ సెంచరీలతో 490 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో కుడి చేతికి తీవ్ర గాయం కాగా, జట్టును ఓటమినుంచి రక్షించేందుకు అతను ఎడమచేత్తో బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది. భారత్ తరఫున చివరిసారిగా ఏడాది క్రితం బర్మింగ్హోం ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో విహారి బరిలోకి దిగాడు. చదవండి: ODI World Cup 2023: ప్లీజ్ స్టోక్స్ వచ్చేయ్.. ప్రపంచకప్లో ఆడు! -
ఏపీఎల్ సీజన్ 2 వేలంలో విశాఖ క్రికెటర్కు రికార్డు ధర
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ వేలం మంగళవారం విశాఖలో జరిగింది. ఇందులో దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన విశాఖ కుర్రాడు రికీ బుయ్ రికార్డు ధర పలికాడు. రూ.8,10,000కు బెజవాడ టైగర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర. సౌత్జోన్ కెప్టెన్ హనుమ విహారీను రూ.6,60,000తో రాయలసీమ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఏపీలోని 6 ఫ్రాంచైజీ జట్లతో ఈ నెల 16 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా తరఫున రంజీలతో సహా అంతర్జాతీయ క్రికెట్లో పలు స్థాయిల్లో సత్తా చాటిన 567 మంది ఆటగాళ్లను వారి గ్రేడ్ను బట్టి వేలం నిర్వహించారు. 6 ఫ్రాంచైజీలు మొత్తంగా 120 మంది ఆటగాళ్లను జట్లకు ఎంపిక చేసుకున్నాయి. ఏసీఏ పర్యవేక్షణలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించే వ్యాఖ్యాత చారుశర్మ ఈ వేలాన్ని నిర్వహించగా..కౌన్సిల్ చైర్మన్ మునీష్ సెహగల్ ప్రారంభించారు. లైనప్ను సరి చూసుకుంటూ ఫ్రాంచైజీలు మొత్తంగా రూ.1.8 కోట్లను వినియోగించుకున్నాయి. కాగా, గిరినాథ్రెడ్డిని రూ.6,10,000లకు రాయలసీమ కింగ్స్, కేఎస్ భరత్ను రూ.6,00,000లకు ఉత్తరాంధ్ర లయన్స్ నెలబెట్టుకున్నాయి. వైజాగ్ వారియర్స్ అశ్విన్ హెబ్బర్ను రూ.5,10,000కు, కోస్టల్ రైడర్స్ స్టీఫెన్, లేఖజ్లను రూ.4,50,000లకు నిలబెట్టుకున్నాయి. రూ.50,000 కనీస ధరతో బిడ్ ప్రారంభమైంది. -
తండ్రి అయిన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రీతి రాజ్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విహారి దంపతులు సోషల్ మీడియా వేదికగా నిన్న (జులై 17) రివీల్ చేశారు. మా కుటుంబంలో సరికొత్త ఆనందాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము అంటూ బిడ్డ పేరు (Ivaan Kiesh), డేట్ ఆఫ్ బర్త్ (07-07-2023) రివీల్ చేస్తూ విహారి దంపతులు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు, సహచర క్రికెటర్లు విహారి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) కాగా, హనుమ విహారి నేతృత్వంలో సౌత్ జోన్ జట్టు ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీ-2023ని గెలుచుకుంది. వెస్ట్ జోన్తో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌత్ జోన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విహారి కెప్టెన్స్ ఇన్నింగ్స్ (63, 42) ఆడగా.. విధ్వత్ కావేరప్ప 8 వికెట్లు (7/53, 1/51) పడగొట్టి సౌత్ జోన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన 29 ఏళ్ల హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్లో అతను రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. దేశవాలీ టోర్నీల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించే విహారి.. రాబోయే సీజన్లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అతని నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్ను త్వరగా పెవిలియన్కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో లభించిన 67 పరుగుల లీడ్తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్కుమార్ వైశాఖ్ (1) క్రీజ్లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్ను దెబ్బకొట్టారు. -
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి! ఫైనల్లో జట్టును..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి వన్డౌన్లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్వల్లా బౌలింగ్లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు. వాషింగ్టన్ సుందర్(9), విజయ్కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. విహారి 46వ ఫిఫ్టీ వెస్ట్ జోన్తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్క్లాస్ క్రికెట్లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్
Ind Vs WI Test Series 2023: ‘‘జట్టు నుంచి నన్నెందుకు తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంతగా నిరాశ చెందానో.. అందుకు గల కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నాను. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మొదట్లో చాలా బాధపడేవాడిని. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం’’ అని టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో లండన్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్లోనే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2022లో బర్మింగ్హాంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత హనుమ విహారికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ అతడికి అవకాశాలు కరువయ్యాయి. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఛాన్స్ వస్తుందని ఎదురుచూసిన 29 ఏళ్ల విహారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సౌత్ జోన్ కెప్టెన్గా ఇదిలా ఉంటే.. దులిప్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్ జోన్తో ఆరంభమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన హనుమ విహారి 839 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 111. చదవండి: అర్జున్ టెండూల్కర్కు గోల్డెన్ చాన్స్ -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్తో తొలి టెస్టు.. ఓపెనర్గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
35 ఏళ్ల వయసులో రహానే చేసినప్పుడు, నేను చేయలేనా..?
టీమిండియా టెస్ట్ క్రికెటర్, ఆంధ్ర స్టార్ ఆటగాడు హనుమ విహారి ఇటీవల స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే విషయమై విహారి మాట్లాడుతూ.. 35 ఏళ్ల వయసులో అజింక్య రహానే టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు, తాను చేయలేనా అని అన్నాడు. రహానే లాంటి వెటరన్ ఆటగాడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభపరిమాణమని, టాలెంట్ ఉన్న ఆటగాడికి వయసుతో సంబంధం లేదని రహానే నిరూపించాడని, టీమిండియాలో తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది స్పూర్తినిస్తుందని పేర్కొన్నాడు. తన వయసు 29 మాత్రమేనని, టీమిండియాకు ఆడేందుకు తనకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. కాగా, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్లో అతను రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. విహారి పార్ట్ టైమ్ బౌలర్గానూ పర్వాలేదనిపించాడు. 16 మ్యాచ్ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. 2021 సిడ్నీ టెస్ట్ మ్యాచ్ విహారికి మంచి గుర్తింపు తెచ్చింది. ఇక రహానే విషయానికొస్తే.. ఐపీఎల్ 2023లో ఇరగదీసిన ఈ ముంబైకర్.. ఆ ప్రదర్శన కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటి, ఇప్పుడు ఏకంగా టెస్ట్ల్లో టీమిండియా వైస్ కెప్టెన్ అయ్యాడు. ఇదే స్పూర్తితో విహారి సైతం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. -
హనుమ విహారి కీలక నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్బై!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే దేశవాళీ సీజన్లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాలని హనుమ విహారి నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. విహారితో పాటు ఢిల్లీ ఫస్ట్క్లాస్ క్రికెటర్ కుల్వంత్ ఖేజ్రోలియా కూడా వచ్చే డోమాస్టిక్ సీజన్లో మధ్యప్రదేశ్ తరపున ఆడనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో వెల్లడించింది. ఇప్పటికే వీరిద్దరూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్తో వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదే విధంగా సోమవారం (జూన్ 26) జరిగిన సమావేశంలో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా హెడ్కోచ్ చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ 2022 రంజీ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్కు ఇదే తొలి రంజీ ట్రోఫీ టైటిల్. ఇక 29 ఏళ్ల విహారి జూన్ 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. విహారి చివరగా టీమిండియా తరపున గతేడాది జూలైలో ఇంగ్లండ్పై ఆడాడు. ఇప్పటివరకు 16 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన విహారి 839 పరుగులు సాధించాడు. చదవండి: CWC Qualifiers 2023: చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా! -
డబ్ల్యూటీసీ ఫైనల్కు శ్రేయస్ అయ్యర్ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు
టీమిండియా వెటరన్ ఆటగాడు, ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ హనుమ విహారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ 2023-24 గాను ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో హనుమ విహారికి చోటు దక్కలేదు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు కష్టమని అంతా భావించారు. కానీ విహారి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసే ఇంకా దారులు మూసుకుపోలేదు. ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు భారత జట్టులో హనుమ విహారికి చోటు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్కు వెన్ను గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో విహారి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా విహారీ దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో విహారి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి మళ్లీ పిలుపునివ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా టీమిండియా తరుపున ఎన్నో విరోచిత ఇన్నింగ్స్లు ఈ ఆంధ్రా కెప్టెన్ ఆడాడు. లండన్ వంటి స్వింగ్ పిచ్లపై అద్భుతంగా ఆడే సత్తా హనుమ విహారికి ఉంది. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. "శ్రేయస్ అయ్యర్ మా జట్టులో చాలా కీలమైన ఆటగాడు. అతడు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం మాకు పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు చాలా అనుభవజ్ఞుడైన ఆటగాడు. గతంలో ఆస్ట్రేలియా వంటి పిచ్లపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్లో ఆడిన అనుభవం కూడా అయ్యర్కు ఉంది. అతడి స్థానాన్ని మరో అనుభవజ్ఞుడైన ఆటగాడితో భర్తీ చేయాలని భావిస్తున్నాము. మా సెలక్టర్లు హనుమ విహారి పేరును పరిశీలిస్తున్నారు. మే మొదటి వారంలో జరగనున్న సెలక్షన్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకుంటారని" పేర్కొన్నారు. కాగా విహారి చివరగా భారత్ తరపున గతేడాది ఇంగ్లండ్పై ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ -
విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైన ఆంధ్ర
Hanuma Vihari: ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ హనుమ విహారి ఒంటి చేతి పోరాటం వృధా అయ్యింది. మణకట్టు ఫ్రాక్చర్ను సైతం లెక్క చేయకుండా విహారి ఆడిన ఇన్నింగ్స్లు, చేసిన పరుగులకు విలువ లేకుండా పోయింది. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. విహారి విరోచితంగా ఒంటి చేత్తో, అది కూడా తన సహజ శైలికి భిన్నంగా ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసి అతి మూల్యమైన పరుగులు సమకూర్చినప్పటికీ ఆంధ్ర టీమ్ గెలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేని ఆంధ్ర జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకే కుప్పకూలి విహారి పోరాటానికి అర్ధం లేకుండా చేసింది. ప్రస్తుత సీజన్లో విహారి నేతృత్వంలో ఆంధ్ర జట్టు వరుస విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్ వరకు జైత్రయాత్ర కొనసాగించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో విహారి గాయపడి మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో ఆంధ్ర టీమ్ ఒక్కసారిగా తేలిపోయింది. @Hanumavihari 🧎💥🔥#HanumaVihari #RanjiTrophy2023 pic.twitter.com/O1reQglKMM — Teja Tanush (@Tejatanush1) February 2, 2023 తొలి ఇన్నింగ్స్లో రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) సెంచరీలతో కదం తొక్కినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా చేతులెత్తేశారు. గాయపడ్డప్పటికీ బరిలోకి దిగి విహారి చేసిన పరుగులు (27, 15) కూడా సహచరుల్లో స్పూర్తి నింపలేకపోయాయి. తొలి ఇన్నింగ్స్లో లభించిన 151 పరుగుల లీడ్ కలుపుకుని ఆంధ్ర నిర్ధేశించిన 245 పరుగుల టార్గెట్ను మధ్యప్రదేశ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. యశ్ దూబే (58), రజత్ పాటిదార్ (55) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్, పృథ్వీ రాజ్ తలో 2 వికెట్లు, నితీశ్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ 228 పరుగులకు ఆలౌటైంది. శుభమ్ శర్మ (51) టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కోర్ వివరాలు.. ఆంధ్రప్రదేశ్: 379 & 93 మధ్యప్రదేశ్: 228 & 245/5 (5 వికెట్ల తేడాతో విజయం) ఈ విజయంతో మధ్యప్రదేశ్ సెమీస్కు చేరుకోగా.. మరోవైపు జార్ఖండ్పై బెంగాల్ (9 వికెట్ల తేడాతో), ఉత్తరాఖండ్పై కర్ణాటక (ఇన్నింగ్స్ 281 పరుగుల తేడాతో) విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. సౌరాష్ట్ర-పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఫలితం తేలాల్సి ఉంది. -
విహారి నువ్వు సూపరయ్యా.. మరోసారి ఒంటి చేత్తో, ఈసారి కత్తి పట్టిన యోధుడిలా..!
Ranji Trophy 2022-23: టీమిండియా టెస్ట్ క్రికెటర్, ఆంధ్ర జట్టు కెప్టెన్ హనుమ విహారి ప్రస్తుతం మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-4 మ్యాచ్లో ఒంటిచేత్తో పోరాటం చేస్తున్న యోధుడిలా మారిపోయాడు. తొలి రోజు (జనవరి 31) ఆటలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో గాయపడి, మణికట్టు ఫ్రాక్చర్కు గురైన విహారి.. జట్టు కష్టాల్లో ఉండగా ఫ్రాక్చర్ను సైతం లెక్క చేయకుండా, నొప్పిని భరిస్తూ, ఒంటిచేత్తో అది కూడా తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా లెఫ్ట్ హ్యాండ్తో (రెండో రోజు) బ్యాటింగ్ చేశాడు. @Hanumavihari 🧎💥🔥#HanumaVihari #RanjiTrophy2023 pic.twitter.com/O1reQglKMM — Teja Tanush (@Tejatanush1) February 2, 2023 తొలి ఇన్నింగ్స్లో అతి కష్టం మీద బ్యాటింగ్ చేసి 27 పరుగులు చేసిన విహారి తన జట్టుకు కొన్ని ఉపయోగకరమైన పరుగులు సమకూర్చి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. అయితే ఆట మూడో రోజు కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్ర జట్టుకు మరోసారి విహారి అవసరం పడింది. ఆ జట్టు 76 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి బరిలోకి దిగిన విహారి.. ఈసారి కత్తి పట్టిన యోధుడిలా కనిపించాడు. లెఫ్ట్ హ్యాండ్తో, అది కూడా సింగిల్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తూ తన జట్టుకు ఎంతో ముఖ్యమైన 15 పరుగులు జోడించిన విహారి.. ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్లో 16 బంతులు ఎదుర్కొన్న ఆంధ్ర కెప్టెన్.. ఒంటి చేత్తో బ్యాట్ను కత్తిలా దూస్తూ 3 బౌండరీలు బాదడం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. కాగా, విహారికి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా యోధుడిలా పోరాటం చేయడం కొత్తేమీ కాదు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో (సిడ్నీ టెస్ట్) టీమిండియా కష్టాల్లో ఉండగా.. ఆసీస్ బౌలర్లు బాడీని టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తున్నప్పుడు దెబ్బలు భరిస్తూ ఇంచుమించూ ఇలాంటి పోరాటమే చేశాడు. తాజాగా తన జట్టును గెలిపించుకునేందుకు విహారి పడుతున్న తాపత్రయం చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. సాహో వీరుడా అంటూ కితాబునిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 379, రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులకే ఆలౌటైన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. -
శ్రేయస్ గోపాల్ సెంచరీ.. విహారి వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23 Quarter Finals Day 2 Stumps: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో గత రెండు రోజులుగా 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి క్వార్టర్స్లో జార్ఖండ్-బెంగాల్, రెండో మ్యాచ్లో సౌరాష్ట్ర-పంజాబ్, మూడో మ్యాచ్లో ఉత్తరాఖండ్-కర్ణాటక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి వీరోచిత పోరాటం (మణికట్టు ఫ్రాక్చర్ అయినా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్కు దిగాడు), కర్ణాటర ఆటగాడు శ్రేయస్ గోపాల్ సూపర్ సెంచరీ హైలైట్గా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తొలి క్వార్టర్ ఫైనల్ జార్ఖండ్ వర్సెస్ బెంగాల్.. 65 పరుగుల ఆధిక్యంలో బెంగాల్ జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ 173 ఆలౌట్ (కుమార్ సూరజ్ 89 నాటౌట్, ఆకాశదీప్ 4/46) బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 238/5 (అభిమన్యు ఈశ్వరన్ 77, సుప్రయో చక్రవర్తి 2/68) రెండో క్వార్టర్ ఫైనల్ సౌరాష్ట్ర-పంజాబ్.. 24 పరుగుల ఆధిక్యంలో పంజాబ్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 303 ఆలౌట్ (పార్థ భట్ 111 నాటౌట్, మార్కండే 4/84) పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 327/5 (ప్రభ్సిమ్రన్ సింగ్ 126, నమన్ ధీర్ 131, యువ్రాజ్ సింగ్ 2/63) మూడో క్వార్టర్ ఫైనల్ ఉత్తరాఖండ్-కర్ణాటక.. 358 పరుగుల లీడ్లో కర్ణాటక ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 116 ఆలౌట్ (కునాల్ చండీలా 31, ఎం వెంకటేశ్ 5/36) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 474/5 (శ్రేయస్ గోపాల్ 103 నాటౌట్, మయాంక్ మిశ్రా 3/98) నాలుగో క్వార్టర్ ఫైనల్ ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్.. 235 పరుగుల వెనుకంజలో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 379 ఆలౌట్ (రికీ భుయ్ 149, కరణ్ షిండే 110, అనుభవ్ అగర్వాల్ 4/72) మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 144/4 (శుభమ్ శర్మ 51, శశికాంత్ 2/37) -
శభాష్ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో హనుమ విహారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలు నమోదు చేస్తూ, నిన్న (జనవరి 31) మధ్యప్రదేశ్తో మొదలైన క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుంది. రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) అద్భుత శతకాలతో రెచ్చిపోగా.. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఆంధ్ర టీమ్ తొలి ఇన్నింగ్స్లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి, ఏపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 327 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్ దూబే (20), హిమాన్షు మంత్రి (22) ఔట్ కాగా.. శుభమ్ శర్మ (5), రజత్ పాటిదార్ క్రీజ్లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, పృథ్వీ రాజ్ యర్రాకు తలో వికెట్ పడింది. కాగా, రెండో రోజు ఆంధ్ర ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి (57 బంతుల్లో 27; 5 ఫోర్లు) కనబర్చిన వీరోచిత పోరాటం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. తొలి రోజు ఆటలో 16 పరుగుల వద్ద ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో గాయపడిన విహారి.. మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. అయితే రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల తర్వాత వెనువెంటనే ఔట్ అయ్యాక.. ఆంధ్ర ఆటగాళ్లు వరుసగా పెవిలియన్కు చేరారు. ఏపీ టీమ్.. 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ దశలో (353/9) మణికట్టు ఫ్రాక్చర్ను సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన విహారి.. గతంలో సిడ్నీ టెస్ట్లో చేసిన వీరోచిత పోరాటాన్ని మళ్లీ గుర్తు చేశాడు. Hanuma vihari batting with left hand due to the fracture of his wrist pic.twitter.com/qywEd31S5o — cric_mawa (@cric_mawa_twts) February 1, 2023 కుడి చేయికి ఫ్రాక్చర్ కావడంతో ఎడమ చేత్తో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన విహారి జట్టు స్కోర్కు అతిమూల్యమైన 26 పరుగులు జోడించి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి, జట్టు మనిషివి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నొప్పిని భరిస్తూ.. ఎడమ చేతిని కాపాడుకుంటూ విహారి చేసిన బ్యాటింగ్ విన్యాసం చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. గాయపడ్డాక బరిలోకి దిగిన విహారి రెండు బౌండరీలు బాదడం, అందులో ఒకటి ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో కావడం మరో విశేషం. -
రికీ భుయ్ సూపర్ సెంచరీ.. కొనసాగుతున్న ఆంధ్రపద్రేశ్ జోరు
Ranji Trophy 2022-23 4th Quarter Final: ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్కు చేరిన ఆంధ్ర టీమ్.. కీలకమైన మ్యాచ్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్ (115 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రికీ భుయ్కి జతగా కరణ్ షిండే (83 నాటౌట్) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (24), అభిషేక్ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ హనుమ విహారి (16) రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్ యాదవ్ ఖాతాలో చేరాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్లో ఉన్నారు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. -
రాణించిన విహారి, రాయుడు.. ఆంధ్ర ఖాతాలో మరో విజయం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో (ఎలైట్ గ్రూప్-బి) ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకుని, ప్రస్తుతానికి గ్రూప్లో అగ్రస్థానంలో ఉంది. గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్లో ఆంధ్ర టీమ్.. అస్సాంపై ఇన్నింగ్స్ 95 పరుగుల తేడాతో గెలుపొంది, క్వార్టర్స్ రేసులో ముందుంది. ఈ మ్యాచ్ను ఆంధ్ర టీమ్ కేవలం రెండున్నర రోజుల్లో ముగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. అభిషేక్ రెడ్డి (75), కెప్టెన్ హనుమ విహారీ (80), కరణ్ షిండే (90 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 361 పరుగులకు ఆలౌటైంది. అస్సాం బౌలర్లలో పుర్ఖాయస్తా 4, రియాన్ పరాగ్, సిద్దార్థ్ సర్మా తలో 2, ముఖ్తార్ హుస్సేన్, హ్రిదీప్ దేకా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం టీమ్.. మాధవ్ రాయుడు (4/12), శశికాంత్ (3/34), నితీశ్ రెడ్డి (1/29), మోహన్ (1/24) ధాటికి 113 పరుగులకే కుప్పకూలి, ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లోనూ అస్సాం ఆటతీరు ఏమాత్రం మారలేదు. లలిత్ మోహన్ (5/40), షోయబ్ ఖాన్ (2/30), మాధవ్ రాయుడు (2/34) దెబ్బకు అస్సాం రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలై, సీజన్ను ముగించింది. 6 వికెట్లతో సత్తా చాటిన మాధవ్ రాయుడుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, ప్రస్తుత సీజన్లో బెంగాల్, కర్ణాటక జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకోగా మిగిలిన 6 బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. -
ఢిల్లీ బ్యాటర్ల అద్భుత పోరాటం.. ఆంధ్ర జట్టుకు నిరాశ
న్యూఢిల్లీ: చివరి వికెట్ తీయడంలో విఫలమైన ఆంధ్ర జట్టు బౌలర్లు ఢిల్లీ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా 29 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఢిల్లీ జట్టుకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే చేరింది. ఓవర్నైట్ స్కోరు 300/4తో ఆట చివరిరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 488 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్లలో ధ్రువ్ షోరే మరో 43 పరుగులు జోడించి వ్యక్తిగత స్కోరు 185 వద్ద అవుటవ్వగా... హిమ్మత్ సింగ్ (104; 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిమ్మత్ సింగ్ అవుటైనపుడు ఢిల్లీ స్కోరు 423/9. చివరి వికెట్ తీసిఉంటే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోపాటు మూడు పాయింట్లు లభించేవి. కానీ ఢిల్లీ బ్యాటర్లు హర్షిత్ రాణా (46 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), దివిజ్ మెహ్రా (38 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి చివరి వికెట్కు అజేయంగా 65 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘బి’ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. -
రాణించిన హనుమ విహారి.. భారీ స్కోర్ దిశగా ఆంధ్రప్రదేశ్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఢిల్లీతో ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (81)తో పాటు కెప్టెన్ హనుమ విహారి (76 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (22), రికీ భుయ్ (9) నిరుత్సాహపరచగా విహారికి జతగా శ్రీకర్ భరత్ (7) క్రీజ్లో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్లలో దివిజ్ మెహ్రా, యోగేశ్ శర్మ, హృతిక్ షోకీన్ తలో వికెట్ పడగొట్టారు. ఇంతకుముందు మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు హైదరాబాద్పై 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ సౌరాష్ట్ర చేతిలో ఇన్నింగ్స్ 214 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. -
సూర్య కెరీర్పై గంభీర్ ట్వీట్.. ఏం మాట్లాడుతున్నావు భాయ్? ఫ్యాన్స్ ఫైర్
Suryakumar Yadav- Gautam Gambhir Tweet: టీ20 ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మైదానం నలువైపులా తనదైన షాట్లతో విరుచుకుపడే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ను.. పలువురు విశ్లేషకులు.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్తో పోలుస్తూ కొనియాడుతున్నారు. కాగా గతేడాది పొట్టి ఫార్మాట్లో అదరగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం పొందిన సూర్య.. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్లోనూ దుమ్ములేపాడు. దుమ్ములేపాడు మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లో నిరాశపరిచినా(7).. పుణెలో అర్ధ శతకం(51), రాజ్కోట్లో అద్భుత సెంచరీ బాదాడు. ముఖ్యంగా సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20లో సూర్య ప్రదర్శన అత్యద్భుతం. 51 బంతుల్లోనే 112 పరుగులు పూర్తి చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియా 228 పరుగుల భారీ స్కోరు చేసి.. సిరీస్ గెలుపొందడంలో ఈ వైస్ కెప్టెన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు. టెస్టు క్రికెట్ ఆడించే సమయం ‘‘అద్భుత ఇన్నింగ్స్ సూర్య! ఇతడిని టెస్టు క్రికెట్ ఆడించే సమయం ఆసన్నమైంది’’ అని గౌతీ అభిప్రాయపడ్డాడు. ఈ ముంబై బ్యాటర్ను టెస్టుల్లో అరంగేట్రం చేయించాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు. నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్ అయితే, గౌతీ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో అది కూడా టీ20లో సూర్య ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను గొప్ప టీ20 ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ.. నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్! తనను ఇప్పుడే టెస్టుల్లోకి ఎందుకు తీసుకోవాలి? రంజీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న వాళ్లు నీకు కనబడటం లేదా? ఉదాహరణకు.. సర్ఫరాజ్ ఖాన్ పేరునే తీసుకో భాయ్.. తను నిలకడగా ఆడుతూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రానికి సూర్య కంటే తనే ఎక్కువ అర్హుడు. కేవలం రెడ్ బాల్ క్రికెట్లో ప్రతిభ ఆధారంగా టెస్టుల్లో ఛాన్స్ ఇవ్వాలనడం సరైంది కాదు. వన్డే, టెస్టుల్లో ప్రస్తుతం అతడు వద్దే వద్దు. హనుమ విహారి లాంటి వాళ్లు కూడా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని ఓ నెటిజన్ గంభీర్కు బదులిస్తూ ట్వీట్ చేశాడు. మరికొంత మంది కూడా అతడికి మద్దతుగా నిలవడం విశేషం. కాగా సర్ఫరాజ్ ఖాన్ గత కొంతకాలంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022- 23 టోర్నీలో ఇప్పటికే రెండు శతకాలు బాదాడు. మరోవైపు.. సూర్య సైతం లంకతో సిరీస్ ఆరంభానికి ముందు సర్ఫరాజ్తో ముంబై తరఫున మైదానంలో దిగిన విషయం తెలిసిందే. చదవండి: Babar Azam: పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు ఘోర అవమానం Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ Expected better from you Gauti. Why does he make the team team? What about those who have been scoring runs in Ranji cricket. Sarfaraz for example? Not setting the right example if you pick someone based on white ball form for a completely different game — Arup Ghose (@arup_ghose) January 7, 2023 Why You Are Not Talking About Sarfaraz And other Ranji Players You Already Have Vihari Please Don't Want Him In Tests And Also Not In ODIs — Alfaz Dodiya (@alfaz_dodiya) January 7, 2023 -
చెలరేగిన శశికాంత్.. హైదరాబాద్పై ఆంధ్ర భారీ విజయం
Ranji Trophy 2022-23- Andhra vs Hyderabad: రంజీ ట్రోఫీ టోర్నీ 2022- 23లో భాగంగా ఆంధ్ర జట్టు హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. హనుమ విహారి బృందం 154 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. సెంచరీతో మెరిసిన రికీ భుయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఎలైట్ గ్రూప్ బిలో భాగమైన ఆంధ్ర- హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కడు తప్ప.. అంతా సింగిల్ డిజిట్ స్కోర్లే! ఓపెనర్ అభిషేక్ రెడ్డి (81 పరుగులు( మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఆంధ్ర బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 9 ,2, 6 ,5, 3, 4, 1, 13, 0, 1 నాటౌట్. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 5 వికెట్లతో చెలరేగగా.. రక్షణ్ రెడ్డి ఒకటి, కార్తికేయ మూడు వికెట్లు తీశారు. ఇక హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో 197 పరుగులకే ఆ జట్టు కథ ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీలతో మెరిసిన రికీ, కరణ్ ఓపెనర్ జ్ఞానేశ్వర్ 72, కెప్టెన్ హనుమ విహారి 33, రికీ భుయ్ 116, శ్రీకర్ భరత్ 89 పరుగులు సాధించగా.. కరణ్ షిండే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, హైదరాబాద్ ఆంధ్రకు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది. చెలరేగిన శశికాంత్ చందన్ సహాని అర్ధ శతకం(56) సాధించగా రోహిత్ రాయుడు 46 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆంధ్ర బౌలర్ కేవీ శశికాంత్ 5 వికెట్లు కూల్చి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో కొడవండ్ల సుదర్శన్ మూడు, నితీశ్ రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరంలో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభతో ఆంధ్ర 154 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు ఆంధ్ర- 135 & 462 హైదరాబాద్- 197 & 246 చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
శతక్కొట్టిన రికీ భుయ్, కరణ్ షిండే.. విజయంపై ఆంధ్ర గురి
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కీలక విజయంపై గురి పెట్టింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్లో ఆ జట్టు మూడో రోజు గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (21), ప్రజ్ఞయ్ రెడ్డి (0) అవుట్ కాగా...రోహిత్ రాయుడు (46 నాటౌట్), అలంకృత్ అగర్వాల్ (7 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. చివరి రోజు హైదరాబాద్ మరో 326 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 230/3తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. రికీ భుయ్ (150 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (70 బంతుల్లో 89; 15 ఫోర్లు, 2 సిక్స్లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. ఆపై కరణ్ షిండే (180 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. -
Irani Cup 2022: కెప్టెన్గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్ మాలిక్కు చోటు
Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్లోని రాజ్కోట్లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. కెప్టెన్గా విహారి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్కు కూడా జట్టులో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ సైతం ఇక ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్జోన్ జట్టులో భాగమైన ప్రియాంక్ పాంచల్, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్, యశ్ దుల్ తదితరులు రెస్టాఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను సైతం ఈ టీమ్కు ఎంపిక చేశారు. కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్లో గెలిచిన జట్టు ఇరానీ కప్ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్పరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిషోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వస్వల్లా. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో.. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్లో ఉన్నాడు. -
ఎంత పని చేశావు విహారి.. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే..!
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2లో సమమైంది. కాగా 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్, బ్యాటింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లోనూ భారత్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఇంగ్లండ్ విజయంలో హీరోగా నిలిచిన జానీ బెయిర్ స్టో ఇచ్చిన ఈజీ క్యాచ్ను.. సెకెండ్ స్లిప్లో హనుమా విహారి జారవిడిచాడు. ఈ తప్పిదానికి భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బతికిపోయిన బెయిర్ స్టో.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇక సులభమైన క్యాచ్ విడిచి పెట్టిన విహారిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "ఎంత పనిచేశావు విహారి.. క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs ENG 5th Test: భారత్పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం Hanuma vihari dropped catch of Jonny bairstow. #hanumavihari #Vihari dropped catch of #JonnyBairstow #INDvsENG #INDvENG pic.twitter.com/YVp40t0zNs — Shribabu Gupta (@ShribabuG) July 5, 2022 -
Ind Vs Eng: వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు!
India vs England 5th Test: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్కు ఓపెనర్గా అవకాశం వచ్చింది. అదే విధంగా చాలా కాలం తర్వాత తెలుగు క్రికెటర్ హనుమ విహారికి కూడా ఈ మ్యాచ్లో భాగంగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో గిల్ 17 పరుగులకు అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తరహాలో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన విహారి సైతం వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేశాడు. He is just so, so good 🥰 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/WlwQjxDxo6 — England Cricket (@englandcricket) July 3, 2022 ఇలా ఎడ్జ్బాస్టన్ టెస్టులో వీరిద్దరు విఫలం కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో పోటీకి వస్తున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని వీరిద్దరు ఉపయోగించుకోలేకపోయారని పెదవి విరిచాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘గిల్, విహారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చెప్పాలి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారు. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా తలుపులు తడుతున్నారు. 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం పోటీలో ఉన్నాడు. ఇలాంటపుడు వీరిద్దరు ఇలా నిరాశపరిచి జట్టులో పాతుకుపోయే అవకాశాన్ని కోల్పోయినట్లే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. జానీ బెయిర్ స్టో ఒక్కడిపైనే ఆధారపడితే కష్టమని.. జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా బ్యాట్ ఝులిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదో టెస్టులో భాగంగా టీమిండియా ఆదివారం(జూలై 3) మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కంటే 257 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 125/3 (45). చదవండి: ENG vs IND: కోహ్లి, బెయిర్ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్..! An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 -
'ఆ ఇద్దరిలో ఒకరిని టీమిండియా ఓపెనర్గా పంపండి'
జూలై1న ప్రారంభం కానున్న ఇంగ్లండ్తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా ఓపెనర్గా ఛతేశ్వర్ పుజారా లేదా హనుమ విహారీని పంపాలని భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. అయితే తాజాగా నిర్వహించిన టెస్ట్టులో కూడా రోహిత్కు పాజిటివ్ గానే తేలింది. దీంతో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యచ్కు రోహిత్ దూరమయ్యే అవకాశాలు సృష్టంగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో శుభ్మాన్ గిల్ జోడిగా భారత ఇన్నింగ్స్ను ఎవరు ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పుజరా, హునుమా విహారి, మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్ వంటి వారు ఓపెనింగ్ రేసులో ఉన్నారు. "వార్మప్ మ్యాచ్లో కేఎస్ భరత్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని మనకు తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం తక్కువ. ఇక రోహిత్కు బ్యాకప్గా జట్టులో చేరిన మయాంక్కు తగినంత ప్రాక్టీస్ చేసే అవకాశం లభించలేదు. కాబట్టి రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు అందుబాటులో లేకపోతే.. పుజారా లేదా విహారి లాంటి అనుభం ఉన్న ఆటగాళ్లు ఇన్నింగ్స్ను ఆరంభిస్తే బాగుటుంది. విహారి ఇప్పటికే రెండు సార్లు భారత్ తరపున ఇన్నింగ్స్ను ఆరంభించాడు. ముఖ్యంగా ఇది కీలక మ్యాచ్ కాబట్టి అనుభవం ఉన్న ఆటగాళ్లకి అవకాశం ఇస్తే మంచింది"అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs IND: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
India Vs Leicestershire: భారత జట్టులో విహారి, శ్రీకర్ భరత్.. మరి పంత్?
India Vs Leicestershire Warm Up Match: ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు లీసెస్టర్షైర్ కౌంటీతో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలైంది. లీసెస్టర్లోని గ్రేస్రోడ్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ లీసెస్టర్ఫైర్ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు రోహిత్ శర్మలో సారథ్యంలోని భారత జట్టులో తెలుగు క్రికెటర్లు హనుమ విహారి, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ భాగమయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. కాగా గతేడాది పర్యటన సందర్భంగా ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్టు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా తాజా పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టుతో పాటు మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. కాగా గత టూర్లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ రీషెడ్యూల్డ్ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇక భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభమైన వార్మప్ మ్యాచ్.. లీసెస్టర్షైర్ కౌంటీ అఫీషియల్ యూట్యూబ్ చానల్ ‘ఫాక్సెస్ టీవీ’లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. లీసెస్టర్షైర్ వర్సెస్ భారత్ వార్మప్ మ్యాచ్ జట్ల వివరాలు ఇలా: లీసెస్టర్షైర్ జట్టు: సామ్యూల్ ఈవన్స్(కెప్టెన్), లూయీస్ కింబర్, ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, రేహాన్ అహ్మద్, సామ్యూల్ బేట్స్(వికెట్ కీపర్), రోమన్ వాకర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, విల్ డేవిస్, నాథన్ బౌలే, అబిడినే సకాండే, జోయ్ ఎవిసన్. భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్. 📺 | 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌 Watch @Jaspritbumrah93 bowling to @imro45 and @ShubmanGill live on Foxes TV. ⤵️https://t.co/adbXpwig48@BCCI 14/0 after four overs. 🦊 #IndiaTourMatch | #LEIvIND — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 That is some welcome for a practice game. Leicester is buzzing. #TeamIndia pic.twitter.com/uI5R6mafFV — BCCI (@BCCI) June 23, 2022 -
రెచ్చిపోయిన హనుమ విహారీ.. సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 216 పరుగులు..!
Hanuma Vihari: 2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారీ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో రెచ్చిపోతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అబహాని లిమిటెడ్ తరఫున బరిలో ఉన్న విహారి.. ఈ వారం జరిగిన 3 మ్యాచ్ల్లో అజేయ సెంచరీ (43 బంతుల్లో 112 నాటౌట్), హాఫ్ సెంచరీ (23 బంతుల్లో 59) సహా 216 పరుగులు సాధించి, లీగ్ టాప్ స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. డీపీఎల్లో విహారి సంచలన ప్రదర్శన గురించి తెలిసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. ఇలాంటి ఆటగాడినా తాము నిర్లక్ష్యం చేసిందని తెగ బాధపడిపోతున్నాయి. మరోపక్క వరుస ఓటములతో నిరాశలో కూరుకుపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎలాగైనా విహారిని ఒప్పించి ఎస్ఆర్హెచ్ తరఫున ఆడేలా చేయాలని ఆ జట్టు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో 50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పేరు నమోదు చేసుకున్న విహారిని ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయాడు. దీంతో అతను ఐపీఎల్ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా చేయకుండా ఢాకా ప్రీమియర్ లీగ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విహారితో సహా ఏడుగురు భారత ఆటగాళ్లు (అభిమన్యు ఈశ్వరన్, పర్వేజ్ రసూల్, బాబా అపరాజిత్, అశోక్ మెనరియా, చిరాగ్ జానీ, గురిందర్ సింగ్) డీపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐపీఎల్లో 24 మ్యాచ్లు ఆడిన విహారీ 14 సగటుతో 284 పరుగులు చేశాడు. చదవండి: ఐపీఎల్లో అవమానం.. విదేశీ లీగ్లో ఆడనున్న టీమిండియా ప్లేయర్లు -
ఐపీఎల్లో అవమానం.. విదేశీ లీగ్లో ఆడనున్న టీమిండియా ప్లేయర్లు
2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోక భంగపడ్డ భారత క్రికెటర్లు, క్యాష్ రిచ్ లీగ్ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా కానీయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్లో కౌంటీలు ఆడేందుకు వెళ్లనుండగా.. మరో టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విహారితో సహా మొత్తం ఏడుగురు భారత ప్లేయర్లు (అభిమన్యు ఈశ్వరన్, పర్వేజ్ రసూల్, బాబా అపరాజిత్, అశోక్ మెనరియా, చిరాగ్ జానీ, గురిందర్ సింగ్) డీపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వాస్తవానికి భారత ప్లేయర్లకు విదేశీ లీగ్ల్లో పాల్గొనే అవకాశం లేదు. అయితే డీపీఎల్.. బంగ్లాదేశ్ లిస్ట్ ఏ క్రికెట్ టోర్నీ కావడంతో భారత క్రికెటర్లకు అనుమతి లభించింది. భారత క్రికెటర్లు డీపీఎల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. కోవిడ్కు ముందు కూడా విహారి, ఈశ్వరన్, అపరాజిత్, మెనరియా ఈ టోర్నీలో పాల్గొనగా అంతకుముందు దినేశ్ కార్తీక్, మనోజ్ తివారి, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా స్టార్లు వివిధ సీజన్లలో బంగ్లాదేశ్ లిస్ట్ ఏ టోర్నీలో పాల్గొన్నారు. ఈ సీజన్లో భారత ప్లేయర్లే కాకుండా పాక్, జింబాబ్వేలకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. వీరిలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి, పాక్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా సెంటర్ ఆప్ అట్రాక్షన్గా నిలువనున్నారు. ప్రస్తుత డీపీఎల్ సీజన్ మార్చి 15న ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ మెగా వేలం 2022లో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓ మోస్తరుగా రాణించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన విహారి.. 3 ఇన్నింగ్స్ల్లో ఓ అర్ధ సెంచరీ సాయంతో 41.33 సగటున 124 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. విహారి ఐపీఎల్లో చివరిసారి 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. చదవండి: హైదరాబాద్లో రవిశాస్త్రి.. సిరాజ్, విహారిలపై కీలక వ్యాఖ్యలు -
హైదరాబాద్లో రవిశాస్త్రి.. సిరాజ్, విహారిలపై కీలక వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం (మార్చి 3) హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత క్రికెట్లో నడుస్తున్న పలు అంశాలపై స్పందించాడు. బీసీసీఐ-విరాట్ కోహ్లి వివాదంపై ఆయన మాట్లాడుతూ.. సమస్య తలెత్తినప్పుడు కాయిన్కి ఒక వైపే చూడకూడదని, సమస్యను అలాగే చూస్తూ పోతే అద్భుతాలు సాధించలేమని కోహ్లికి పరోక్షంగా మద్దతు పలికాడు. విరాట్ చాలా గొప్ప ఆటగాడని, అతనితో సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు. కోహ్లి వందో టెస్ట్ కోసం యావత్ భారతంతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. 100 టెస్ట్లు ఆడటం ఆషామాషీ విషయం కాదని, కోహ్లికి మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉందని, ఈ క్రమంలో అతను మరిన్ని అద్భుతాలు చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టంగా ఉందని, వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి హనుమ విహారి, మహ్మద్ సిరాజ్లకు మంచి భవిష్యత్తు ఉందని, వారిరువురు ఇదివరకే వారి మార్కు ప్రభావం జట్టుపై చూపారని కొనియాడాడు. ఎంతటి ఆటగాడైనా టీమిండియాలో కొనసాగలంటే మంచి పర్ఫార్మెన్స్ చూపాల్సిందేనని, యువ క్రికెటర్లు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించాడు. చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..! -
విహారి అద్భుత శతకం.. ఆకట్టుకున్న తిలక్ వర్మ
భువనేశ్వర్: రంజీ ట్రోఫీ 2022 గ్రూప్ బి లో భాగంగా చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టెస్ట్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ స్టార్ ఆటగాడు హనుమ విహారి అద్భుత శతకంతో మెరిశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ (59)తో రాణించిన విహారి.. రెండో ఇన్నింగ్స్లో 149 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఐపీఎల్ వేలంలో భారీ ధర (1.70 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది).దక్కించుకున్న తిలక్ వర్మ (76 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విహారికి మరో ఎండ్లో ఉండి సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 400 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించింది. అంతకుముందు టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులకు ఆలౌట్ కాగా, మనన్ వోహ్రా సూపర్ శతకంతో మెరవడంతో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్లో 216 పరుగులు చేసి ఆలౌటైంది. చదవండి: Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7 -
Ranji Trophy 2022: హైదరాబాద్ 347 ఆలౌట్
Ranji Trophy 2022 Hyd Vs Chgrh: - భువనేశ్వర్: చండీగఢ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 108.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 270/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో 77 పరుగులు జోడిం చి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. తనయ్ త్యాగరాజన్ (38; 6 ఫోర్లు), సీవీ మిలింద్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇక మొదటి రోజు భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చండీగఢ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. మనన్ వొహ్రా (110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7
Ranji Trophy 2022- Hyderabad Vs Chandigarh:- భువనేశ్వర్: చండీగఢ్తో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ సారథ్యంలో ఆడుతున్న భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ (32; 5 ఫోర్లు), ప్రతీక్ రెడ్డి (36; 5 ఫోర్లు), రవితేజ (32; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. విహారి మూడో వికెట్కు తిలక్తో 51 పరుగులు... నాలుగో వికెట్కు హిమాలయ్ అగర్వాల్తో 51 పరుగులు జత చేశాడు. చండీగఢ్ బౌలర్లలో జగ్జీత్ (3/50), రాజ్ అంగద్ బావా (2/43), గౌరవ్ గంభీర్ (2/66) రాణించారు. చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా! Ranji Trophy 2022: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే -
ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు కనీస విలువ ఎంతంటే!
IPL 2022 Auction: Do You Know Ambati Rayudu And Hanuma Vihari Base Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ సందడి మొదలైంది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగే మెగా వేలం జరుగనున్న విషయం విదితమే. ఈ క్రమంలో జనవరి 22న మొత్తం 1,214 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీల సూచనల ప్రకారం దీనిని కుదించి మంగళవారం బీసీసీఐ తుది జాబితాను ప్రకటించింది. ఫలితంగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 590గా ఖరారైంది. ఇందులో భారత క్రికెటర్లు 370 మంది ఉండగా, విదేశీ ఆటగాళ్లు 220 మంది ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో గరిష్టంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది వేలం బరిలో నిలిచారు. 590 మందిలో 228 మంది ఆయా దేశాల తరఫున ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడగా... 355 మంది ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లు, మరో 7 మంది అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఐపీఎల్లో పాల్గొనే ఒక్కో జట్టులో గరిష్టంగా 25 మంది ఉంటారు. వేలానికి ముందు ఎనిమిది జట్లు 27 మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకోగా... రెండు కొత్త టీమ్లు మరో 6 మందిని ఎంచుకున్నాయి. మొత్తంగా ఈ 33 మంది ని తగ్గిస్తే... 217 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. భారీ డిమాండ్ ఖాయం... రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది ఐపీఎల్ వేలంలోకి అడుగు పెడుతుండగా, రూ. 1.5 కోట్ల జాబితాలో 20 మంది, రూ. 1 కోటి కనీస ధరతో 34 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న ‘మెగా వేలం’ కావడం, రెండు కొత్త జట్లు రావడంతో స్టార్ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఖాయం. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, కమిన్స్ (ఆస్ట్రేలియా), డి కాక్, రబడ, డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), శ్రేయస్ అయ్యర్, అశ్విన్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, షమీ (భారత్), బెయిర్స్టో (ఇంగ్లండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) వంటి ప్లేయర్లను అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. వేలంలో వీరికి రికార్డు ధర పలకవచ్చు. ఫ్రాంచైజీలు వద్దనుకున్న భారత ఆటగాళ్లు భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, రహానే, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, శార్దుల్ ఠాకూర్ లపై కూడా అందరి కన్నూ ఉంది. అంబటి రాయుడు రూ. 2 కోట్ల కనీస విలువతో ఆసక్తికరంగా తన పేరును వికెట్ కీపర్ జాబితాలో నమోదు చేసుకోవడం విశేషం! హనుమ విహారి రూ. 50 లక్షల కనీస విలువతో బరిలో ఉన్నాడు. చదవండి: IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
IPLAuction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్.. ఇంకా..
IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలం-2022 తుది జాబితా ఖరారైంది. 217 స్థానాలకు 590 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ వేలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నుంచి 8 మంది (అంబటి రాయుడు, అశ్విన్ హెబర్, రికీ భుయ్, హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి) పాల్గొనబోతున్నారు. అదే విధంగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నుంచి 15 మంది (హనుమ విహారి, తిలక్ వర్మ, బి.సందీప్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, యుధ్వీర్, కార్తికేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వాల్, మొహమ్మద్ అఫ్రిది) ఈ మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చదవండి: ICC U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్కు అవకాశం... సిరాజ్ స్థానంలో ఎవరంటే..
Ind Vs Sa 3rd Test: దక్షిణాఫ్రికాలో సరికొత్త చరిత్ర సృష్టించాలంటే మూడో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే ఇన్నాళ్లుగా భారత జట్టుకు సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయం సొంతమవుతుంది. అయితే, గాయాల బెడద కోహ్లి సేనకు పెద్ద తలనొప్పిగా మారింది. వెన్ను నొప్పి కారణంగా దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నా ఆఖరి నిమిషం వరకు ఎటూ చెప్పలేని పరిస్థితి. ఇక కీలక ఫాస్ట్బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వీటికి తోడు మిడిలార్డర్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాడు అనవసరపు షాట్లతో వికెట్ పారేసుకోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాత్రం.. ఈ వికెట్ కీపర్ను జట్టులో కొనసాగించాలని అంటున్నాడు. ఇన్సైడ్ స్పోర్ట్తో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ లాంటి ఆటగాడిని మేనేజ్మెంట్ పక్కన పెడుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే టీమిండియాకు తనే ఎక్స్ ఫ్యాక్టర్. మ్యాచ్ విన్నర్. షాట్ సెలక్షన్ గురించి కెప్టెన్ విరాట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడితో మాట్లాడితే సరిపోతుంది. కేవలం కీపింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే వృద్ధిమాన్ సాహా పంత్ స్థానాన్ని భర్తీ చేయగలడు. కానీ... బ్యాటింగ్లో పంత్ ఎన్నో మెట్లు పైనే ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక కాస్త కఠిన నిర్ణయమే అయినా... హనుమ విహారిని తుది జట్టు నుంచి తప్పించడం ఖాయమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో అతడు బాగానే ఆడినా.. పుజారా, రహానే అర్ధ సెంచరీలతో రాణించడంతో వాళ్లు కచ్చితంగా మూడో టెస్టు తుది జట్టులో ఉంటారని పేర్కొన్నాడు. విరాట్ వస్తున్నాడు కాబట్టి... విహారిపై వేటు తప్పదన్నాడు. పేస్కు అనుకూలించే పిచ్పై సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు వసీం జాఫర్ ఎంచుకున్న తుదిజట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్! Ind Vs Sa 3rd Test: టీమిండియాకు ప్రొటిస్ కెప్టెన్ హెచ్చరికలు.. కచ్చితంగా గెలిచి తీరతాం! -
నాడు అశ్విన్-విహారి.. ఏడాది తర్వాత బ్రాడ్-అండర్సన్..
Ashes 4th Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్(35 బంతుల్లో 8 నాటౌట్)-ఆండర్సన్(6 బంతుల్లో 0 నాటౌట్)లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చడంతో ఆతిధ్య ఆసీస్ డ్రాతో సరిపెట్టుకుంది. 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ మరో పది ఓవర్లలో ముగుస్తుందన్న సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల పాటు పోరాడి మరో మూడు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న తరుణంలో జాక్ లీచ్(26) ఔటవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్లు తమ అనుభవాన్నంతా రంగరించి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, సరిగ్గా ఏడాది కిందట ఇదే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్-హనుమ విహారి సైతం ఇదే తరహాలో పోరాడి ఆసీస్కు విజయాన్ని దక్కనీయకుండా అడ్డుపడ్డారు. 2021 జనవరిలో సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన మూడో టెస్ట్లో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్), విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)లు భీకరమైన ఆసీస్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లు అలసిపోయారే కానీ ఈ ఇద్దరు క్రీజ్ను వీడలేదు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్ను డ్రాగా ముగించింది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
హైదరాబాద్ క్రికెటర్పై ద్రవిడ్ కీలక వాఖ్యలు..
హైదరాబాద్ బ్యాటర్ హనుమ విహారి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కోహ్లి గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో అనూహ్యంగా ఎగసిన బంతికి అతను అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో కీలక పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విషయాన్ని భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అయినా సరే విహారికి తుది జట్టులో చోటు ఖాయం కాదని అతను పరోక్షంగా చెప్పాడు. కోహ్లి కోలుకొని టీమ్లోకి వస్తే విహారిని పక్కన పెట్టడం ఖాయమని సంకేతమిచ్చాడు. విహారితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా రెగ్యులర్గా అవకాశాలు దక్కించుకునేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘విహారి రెండు ఇన్నింగ్స్లలో చక్కగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో దురదృష్టకర రీతిలో అవుటైన అతను రెండో ఇన్నింగ్స్లో తన ఆటతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అయ్యర్ కూడా ఆడిన రెండు టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తాము ఎప్పుడు బరిలోకి దిగినా బాగా ఆడగలమని వారు నిరూ పించారు. అయితే ఇప్పటికిప్పు డే కాకుండా మున్ముందు వారికి తగిన అవకాశాలు లభిస్తాయి’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. చదవండి: MS Dhoni: పాక్ పేసర్కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
దక్షిణాఫ్రికా ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
జోహన్నెస్బర్గ్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా ఫీల్డర్ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన రబాడా బౌలింగ్లో.. హనుమా విహారి డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. కాగా షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ డుస్సెన్ జంప్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విహారి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్(50) అశ్విన్ (46) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. . తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. చదవండి: SA vs IND: ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్..లేదంటే What a superb close-in catch that was from Rassie van der Dussen to dismiss Hanuma Vihari! #SAvIND pic.twitter.com/SB0DURelNO — Cric Trend (@crictrend_) January 3, 2022 -
ఫామ్లో ఉన్న శ్రేయస్ను కాదని విహారి ఎందుకు..?
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్నునొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో తాత్కాలిక సారధిగా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జట్టు యాజమాన్యం కోహ్లి స్థానాన్ని ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్తో కాకుండా హనుమ విహారితో భర్తీ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తున్న వేళ బీసీసీఐ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు రోజు అయ్యర్.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే రెండో టెస్ట్ సెలక్షన్కి అతను అందుబాటులో లేడని వివరించింది. దీంతో విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్న విహారి.. కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడని పేర్కొంది. కాగా, విహారి.. సరిగ్గా ఏడాది తర్వాత అనూహ్యంగా తిరిగి జట్టులోకి రావడం విశేషం. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో(జనవరిలో జరిగిన సిడ్నీ టెస్ట్లో) విహారి చివరిసారి టీమిండియా తరఫున ఆడాడు. మరోవైపు అరంగేట్రం టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అయ్యర్.. మరో అవకాశం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. మయాంక్(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్లో రాహుల్(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్ 2, జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: రానున్న దశాబ్ద కాలం రాహుల్దే.. కెప్టెన్గా అతనికి తిరుగుండదు..! -
కోహ్లి అవుట్... కెప్టెన్గా రాహుల్.. తుది జట్టులో హనుమ విహారి
Ind Vs Sa 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో రెండో టెస్టు నుంచి వైదొలిగాడు. ఇక కోహ్లి స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చాడు. ఇక కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా రెండు మార్పులతో బరిలోకి దిగింది. క్వింటన్ డికాక్ స్థానంలో వెరెనె జట్టులోకి రాగా... డువానే ఒలివర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా సెంచూరియన్ టెస్టులో విజయం సాధించి టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Rahul Dravid - Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్కోచ్! -
Ind Vs Sa 2nd Test: తొలి రోజు సఫారీలదే..
Updates: తొలి రోజు సఫారీలదే దక్షిణాఫ్రికా సీమర్ల ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి సఫారీలకు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చినప్పటికీ.. ఎల్గర్(11), పీటర్సన్(14) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి తొలి రోజు ఆటను ముగించారు. టీ విరామం తర్వాత బరిలోకి దిగి 18 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా.. వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. మార్క్రమ్(12 బంతుల్లో 7) షమీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా టీమిండియాను 202 పరుగులకే కట్టడి చేసి బరిలోకి దిగిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఓపెనర్ మార్క్రమ్(12 బంతుల్లో 7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షమీ సఫారీలను తొలి దెబ్బ తీశాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 14/1. క్రీజ్లో ఎల్గర్(5), పీటర్సన్ ఉన్నారు. 7:33 PM: భీకరమైన సఫారీ పేసర్లను ఎదుర్కొన్న భారత జట్టు అతికష్టం మీద 200 పరుగుల మైలరాయిని క్రాస్ చేసింది. రబాడ బౌలింగ్లో సిరాజ్(1) వెనుదిరగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 202 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, ఒలీవియర్, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు. 7:22 PM: ధాటిగా ఆడుతున్న అశ్విన్(50 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఎట్టకేలకు జన్సెన్ బౌలింగ్లో పీటర్సన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 187 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా, సిరాజ్ క్రీజ్లో ఉన్నారు. 7:13 PM: రబాడ బౌలింగ్లో స్ట్రయిట్ షాట్ ఆడబోయిన షమీ(12 బంతుల్లో 9; ఫోర్).. రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 185 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్(45 బంతుల్లో 44), బుమ్రా క్రీజ్లో ఉన్నారు. 6:50 PM: సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. ఒలీవియర్ బౌలింగ్లో కీగన్ పీటర్సన్కు క్యాచ్ ఇచ్చి శార్ధూల్ ఠాకూర్(0) ఏడో వికెట్గా వెనుదిరిగాడు. 55 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 157/7. క్రీజ్లో అశ్విన్(27), షమీ ఉన్నారు. 6:42 PM: టీ విరామం తర్వాత టీమిండియాకు మరో షాక్ తగిలింది. జన్సెన్ బౌలింగ్లో రిషబ్ పంత్(43 బంతుల్లో 17; ఫోర్) ఔటయ్యాడు. వెర్రిన్ అద్భుతమైన క్యాచ్ పట్టి పంత్ను పెవిలియన్కు పంపాడు. 54 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 156/6. క్రీజ్లో అశ్విన్(22), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. 6:13 PM: టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 146/5. రాహుల్ వెనుదిరిగిన అనంతరం క్రీజ్లోకి వచ్చిన అశ్విన్(21 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. పంత్(32 బంతుల్లో 13; ఫోర్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నాడు. 5:47 PM: 116 పరుగుల వద్ద టీమిండియాకు మరో షాక్ తగిలింది. నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్(133 బంతుల్లో 50; 9 ఫోర్లు) మార్కో జన్సెన్ బౌలింగ్లో రబాడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 117/5. క్రీజ్లో పంత్(12), అశ్విన్(1) ఉన్నారు. 5: 28 PM:హనుమ విహారి రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 4: 58 PM: టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, హనుమ విహారి ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ప్రొటిస్ బౌలర్లలో మార్కోకు ఒకటి, సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఒలివర్కు రెండు వికెట్లు దక్కాయి. 4: 45 PM: కేఎల్ రాహుల్ 24 పరుగులు, హనుమ విహారి 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 67/3. 3: 50 PM:లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 53/3 3:29 PM: ప్రొటిస్ బౌలర్ ఒలివర్ టీమిండియాను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. వరుసగా రెండు వికెట్లు కూల్చి తడాఖా చూపించాడు. పుజారాను పెవిలియన్కు పంపిన ఒలివర్.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన రహానేను సైతం వెంటనే అవుట్ చేశాడు. దీంతో రహానే డకౌట్గా వెనుదిరిగాడు. 3: 19 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా మరో కీలక వికెట్ కోల్పోయింది. ఒలివర్ బౌలింగ్లో ఛతేశ్వర్ పుజారా అవుట్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. భారత్ స్కోరు: 49/2. 2: 37 PM తొలి వికెట్ కోల్పోయిన భారత్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్లో వికెట్ కీపర్ వెరెనెకు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్(26) పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. 2:30 PM: 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 36/0. కేఎల్ రాహుల్(9), మయాంక్ అగర్వాల్(26) క్రీజులో ఉన్నారు. 1:51 PM ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 15/0. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు. 1: 03 PM: సఫారీల కంచుకోట సెంచూరియన్ను బద్దలు కొట్టి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. సీమర్ల బలంతో తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ.. అనూహ్య రీతిలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా కోహ్లి స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Rahul Dravid- Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్కోచ్! -
Ind Vs Sa 1st Test: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా!
Ind Vs Sa 1st Test: Trolls As Ajinkya Rahane Placed Ahead Vihari And Iyer: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా తెలుగు ప్లేయర్ హనుమ విహారి, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఫామ్లేకపోయినప్పటికీ మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకే విరాట్ కోహ్లి అవకాశం ఇచ్చాడు. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టెస్టులు ఆడిన రహానే 411 పరుగులు చేశాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో అతడిపై వేటు పడటం ఖాయమని భావించారంతా. కానీ, అనూహ్యంగా సిరీస్కు ఎంపికకావడంతో పాటు డిసెంబరు 26న ఆరంభమైన తొలి టెస్టు తుదిజట్టులో రహానే చోటు దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో క్రీడా విశ్లేషకులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అయ్యర్ లేడు.. విహారీ లేడు.. ఐదుగురు బ్యాటర్లతో టీమిండియా ఆడుతోంది. నిజంగా సాహసోపేతమైన నిర్ణయం’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇక.. ‘‘పాపం విహారి. మరీ ఇంతదారుణమా. ఎన్నిసార్లు నిరూపించుకున్నా అవకాశం రావట్లేదు. పాపం తనకే ఎందుకిలా?. అయ్యర్ను కూడా పక్కనపెట్టేశారు. అజింక్య రహానేకు మాత్రం ఛాన్స్ ఇచ్చారు. బహుశా ఇదే అతడికి ఇదే చివరి అవకాశం కావొచ్చు’’అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంతవరకు సఫారీ గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ లోటు తీర్చుకుని సత్తా చాటాలని కోహ్లి సేన భావిస్తోంది. చదవండి: Vijay Hazare Trophy Final HP Vs TN: వారెవ్వా.. డీకే సెంచరీ... షారుక్ 21 బంతుల్లో 42! హిమాచల్కు గట్టి సవాల్ No Iyer. No Vihari. India going in with 5 batters. Brave brave call. 🤞 #SAvIND — Aakash Chopra (@cricketaakash) December 26, 2021 Should really feel bad for vihari & for Rahane feel this will be his last chance. 4 pace bowlers & with Ashwin, looking good on paper & all depends on how well India bats. Go well boys 💙. #INDvSA pic.twitter.com/wbF3nOBbKb — Thana (@Pitstop387) December 26, 2021 Vihari. easily. Rahane more technically equipped tho. But Vihari also scored good in A games I think. So, yeah, Vihari. — table fan of boya (@fastgoogly) December 26, 2021 -
ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికి నో ఛాన్స్!
Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకి భారత్ తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగతున్నాయి. డిసెంబరు 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇక బ్యాక్సింగ్డే టెస్టులో విజయం సాధించి సిరీస్ను శుభారంభం చేయాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సవాల్గా మారింది. మిడిలార్డర్లో రెండు స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి రేసులో ఉన్నారు. కాగా ప్రస్తుతం అజింక్య రహానె టెస్టుల్లో ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి విదేశాల్లో ఉన్న రికార్డుల దృష్ట్యా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు ఆరంగ్రేట్ర మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్కు మిడిలార్డర్లో చోటు దక్కచ్చు. ఇక మరోసారి హనుమ విహారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తుది జట్టులో ఎవరకి చోటుదక్కుతుందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో క్రికెట్ నిపుణలు, మాజీలు దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్కు భారత ప్లేయింగ్ ఎలెవన్ను అంచనా వేస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా చేరాడు. తొలి టెస్ట్కు భారత ప్లేయింగ్ ఎలెవన్ను జాఫర్ ఎంచుకున్నాడు. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ను ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక ఫామ్లో లేకపోయిన ఛెతేశ్వర్ పుజారాకు తన జట్టులో మూడో స్ధానంలో చోటు కల్పించాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ కోహ్లికు చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో అతడు అజింక్యా రహానె వైపే మెగ్గుచూపాడు. ఆరో స్ధానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేశాడు. ఇక జట్టు వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు ఇచ్చాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్ను ఎంచుకున్నాడు. ఇక బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్కు వసీం చోటు ఇచ్చాడు. కాగా జాఫర్ ప్రకటించిన జట్టులో హనుమ విహారి చోటు దక్కలేదు. వసీం జాఫర్ ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
ఎవరికి అవకాశం ఇద్దాం!.. తల పట్టుకుంటున్న కోహ్లి, ద్రవిడ్
సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. 2018లో చివరిసారి దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీమిండియా ఆ టెస్టు సిరీస్ను డ్రా చేసుకుంది. తాజాగా కోహ్లి సారధ్యంలోని టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడడానికి మరోసారి సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే రోజున తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: టీమిండియా మాజీ కోచ్పై రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లి- కోచ్ రాహుల్ ద్రవిడ్లకు జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. తుది జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీయాలనేదానిపై వారిద్దరికి సమస్యగా మారనుంది. ఫామ్లో లేకపోయినప్పటికి రహానేకు బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. అయితే ఇదే రహానే 2018లో సౌతాఫ్రికా పర్యటనలో విశేషంగా రాణించాడు. జోహెన్నెస్బర్గ్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రహానే కీలకపాత్ర పోషించాడు. అయితే స్వదేశంలో న్యూజిలాండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో రహానే మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో వైస్కెప్టెన్సీ పదవి కూడా పోగొట్టుకున్న రహానే సౌతాఫ్రికా టూర్కు ఎంపికవ్వడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఇక రహానే గత 12 టెస్టుల్లో 411 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సమయంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా అయ్యర్ కివీస్తో సిరీస్లో సెంచరీ, అర్థసెంచరీతో రాణించి సౌతాఫ్రికా టూర్కు ఎంపికయ్యాడు. ఇక ఇటీవలే ఇండియా- ఏ తరపున సౌతాఫ్రికా గడ్డపై ఆడిన హనుమ విహారి ఐదు ఇన్నింగ్స్ల్లో మూడు అర్థసెంచరీలు సాధించి తుది జట్టు ఎంపికలో తాను ఉన్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: Ashes 2021: 'ఆస్ట్రేలియన్ కామెంటేటర్లకు పిచ్చి పట్టింది' -
"శ్రేయాస్ అయ్యర్ స్ధానంలో అతడికి అవకాశం ఇవ్వండి"
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు టీమిండియా అన్ని విధాల సన్నద్దం అవుతుంది. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక జట్టులో 5వ స్ధానంపై సందిగ్ధత నెలకొంది. గత కొన్నేళ్లుగా అజింక్య రహానే ఆ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే రహానే ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తుండంతో అతడి స్ధానంలో శ్రేయాస్ అయ్యర్కు అవకాశం ఇవ్వాలని చాలా మంది భావిస్తున్నారు. అయితే అయ్యర్కు కాకుండా హనుమ విహారీని జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ సూచించాడు. “శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలో ఎవరని ఎంపిక చేయాలని నన్ను అడిగితే, నేను మాత్రం హనుమ విహారి వైపు మొగ్గు చూపుతాను. ఎందుకంటే చాలా కాలంగా అతడు భారత టెస్ట్ జట్టులో ఉన్నాడు. విదేశీ పిచ్లపై అతడికి చాలా అనుభవం ఉంది. అందుకే శ్రేయాస్ అయ్యర్ కంటే విహారి ఎంపిక చేస్తే బెటర్. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ను విహారి తన పోరాట ఇన్నింగ్స్తో భారత్ను ఎలా గట్టుక్కించాడో మనందరికీ తెలుసు. అదే విధంగా అతడు వెస్టిండీస్లో కూడా సెంచరీ సాధించాడు అని బంగర్ పేర్కొన్నాడు. 2018లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన విహారి 12 మ్యాచ్ల్లో 11 మ్యాచ్లు విదేశాల్లో ఆడాడు. అంతే కాకుండా 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. చదవండి: Hardik Pandya: "హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడు" -
IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి
IND-A vs South Africa-A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో బ్లోమ్ఫోంటీన్లో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ప్లేయర్లు హనుమ విహారి (63; 6 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (86 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 115 పరుగులు జోడించారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 268 పరుగులకు ఆలౌటైంది. చదవండి: Hardik Pandya: టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పనున్న హార్దిక్ పాండ్యా! -
దక్షిణాఫ్రికాపై రాణించిన హనుమ విహారి..
Hanuma Vihari shines as India A South Africa A play out another draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య బ్లోమ్ఫోంటెన్లో రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఆట చివరిరోజు శుక్రవారం దక్షిణాఫ్రికా నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి (116 బంతుల్లో 72 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ! -
హనుమ విహారి అర్థ సెంచరీ.. భారత్ ‘ఎ’ 276 ఆలౌట్
బ్లూమ్ఫోంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. సారెల్ ఎర్వీ (41), పీటర్ మలాన్ (31), రేనార్డ్ (33) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ పోరెల్ 2, సౌరభ్, అపరాజిత్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్కు నేడు ఆఖరి రోజు. -
Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ!
Ind Vs Nz Test Series- Why Hanuma Vihari Not Selected: న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ చిత్రంగా సంప్రదాయ ఫార్మాట్లో ఇంటాబయటా రాణిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసింది. మొత్తం టెస్టు సిరీస్ నుంచే అతన్ని తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే మరో తెలుగు ప్లేయర్, కొంతకాలంగా భారత్ ‘ఎ’ జట్లకు ఆడుతున్న ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు కట్టబెట్టారు. ఇతనితో పాటు బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్, బౌలర్ ప్రసిధ్ కృష్ణలకూ తొలి సారి టెస్టు జట్టులో స్థానం లభించింది. అయితే వీరిద్దరు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇది వరకే టీమిండియా జెర్సీ వేసుకున్నారు. దీంతో పూర్తిగా కొత్త ముఖమైతే శ్రీకర్ భరత్దే! నాలుగేళ్ల తర్వాత ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరు కానున్న మొదటి మ్యాచ్కు రహానే సారథ్యం వహించనున్నాడు. తిరిగి రెండో టెస్టుకు కోహ్లినే పగ్గాలు చేపడతాడు. రోహిత్, పంత్, బుమ్రా, షమీలకు విశ్రాంతి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్టార్ ఆటగాళ్లపై క్రికెట్ భారం తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగానే టి20 కొత్త సారథి రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్, పేసర్లు బుమ్రా, షమీలకు ఐదు రోజుల ఫార్మాట్లో సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ నెల 17 నుంచి జరిగే మూడు టి20ల సిరీస్ నుంచి కోహ్లికి కూడా ఇది వరకే రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే భారత్లో పర్యటించే న్యూజిలాండ్తో కోహ్లి కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడతాడు. టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు హిట్టింగ్ చేసే రిషభ్ పంత్కు విశ్రాంతి ఇవ్వడంతో రెండో కీపర్గానే భరత్ను తీసుకున్నట్లు తెలిసింది. భారత టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. దెబ్బకు దిగొచ్చారు.. ట్వీట్తో సరిపెట్టారు... టెస్టుల్లో అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్లపై రాణించిన ఘనత మన విహారిది. తొడ కండరాల గాయం బాధిస్తున్నా... జట్టు అవసరాల కోసం గాయాన్ని పంటిబిగువన భరించి మరీ ఓ టెయిలెండర్ (అశ్విన్)తో కలిసి ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో భారత్ను ‘డ్రా’తో గట్టెక్కించాడు. అందరి నుంచీ ప్రశంసలందుకున్నాడు. తర్వాత ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ఎంపిక చేసినా తుది జట్టులో ఆడించలేదు. ఫైనల్లో భారత ఓటమికి విహారిలాంటి నిలబడే బ్యాట్స్మన్ లేకపోవడం కూడా ఒక కారణం. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ విహారిని పక్కన బెట్టారు. ఈసారి సెలెక్షన్ కమిటీ ఏకంగా జట్టు నుంచే తప్పించింది. దీనికి సరైన కారణం కూడా సెలక్షన్ కమిటీ, బోర్డు దగ్గర లేదు. దీనిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకు విహారిని భారత్ ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు పంపిస్తున్నామని శుక్రవారం సాయంత్రం బీసీసీఐ ఒక ట్వీట్ చేసింది. వాస్తవానికి ఈనెల 9న భారత ‘ఎ’ జట్టును ప్రకటించినపుడు అందులో విహారి పేరు లేకపోవడం గమనార్హం. విహారి తన కెరీర్లో 12 టెస్టులు ఆడి 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Virat Kohli: మిగిలిన ఫార్మాట్స్లోనూ కెప్టెన్గా గుడ్బై చెప్పే అవకాశం! 🚨 UPDATE: @Hanumavihari has been added to the India 'A' squad for the South Africa tour. https://t.co/ISYgtlw1S1 pic.twitter.com/uy3UD1pCN5 — BCCI (@BCCI) November 12, 2021 -
కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు
Fans Troll BCCI Not Selecting Hanuma Vihari NZ Test Series.. న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్కు 16 మందితో కూడిన టీమిండియాను శుక్రవారం బీసీసీఐ ఎంపికచేసిన సంగతి తెలిసిందే. కోహ్లి, రోహిత్తో పాటు బుమ్రా, షమీ, రిషబ్ పంత్ ఈ సిరీస్కు దూరంగా ఉండనున్నారు. కాగా కోహ్లి రెండో టెస్టు ఆడే అవకాశం ఉన్నందున ఇప్పటికైతే తొలి టెస్టుకు రహానే సారధ్యం వహించనున్నాడు. సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ పేరుతో విశ్రాంతి ఇవ్వడంతో కేఎస్ భరత్, జయంత్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్లు ఎంపికయ్యారు. ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో గాయపడిన శుబ్మన్ గిల్ కూడా తుది జట్టులోకి వచ్చాడు. ఇలా కొత్త ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వడంతో జట్టు కొత్తగా కనిపిస్తున్నప్పటికీ హనుమ విహారిని ఎంపిక చేయకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. చదవండి: Ind Vs Nz Test Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఇదే గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో హనుమ విహారి తన ఇన్నింగ్స్తో టీమిండియాను పరాజయం నుంచి తప్పించాడు. అలాంటి క్లాస్ బ్యాట్స్మన్కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న విహారికి చాన్స్లు ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నారని.. వాస్తవానికి రహానే కెప్టెన్ కాకపోయుంటే అతన్ని పక్కన పెట్టేసి విహారి చాన్స్ ఇచ్చినా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా కరుణ్ నాయర్ విషయంలో జరిగిన వివక్ష హనుమ విహారికి జరుతుందని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే విహారి కనుమరుగవుతాడని పేర్కొన్నారు. దీంతోపాటు విహారికి అవకాశం ఇవ్వకపోవడంపై బీసీసీఐని విమర్శిస్తూ టీమిండియా ఫ్యాన్స్ వివిధ రకాలుగా ట్రోల్ చేశారు. చదవండి: Team India Coaching Staff: ద్రవిడ్ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..! న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు: అజింక్య రహానే(కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, విరాట్ కోహ్లి(రెండో టెస్టు నుంచి అందుబాటులోకి). ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్: ►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్. ►రెండో టీ20- నవంబరు 19, రాంచి. ►మూడో టీ20- నవంబరు 21, కోల్కతా. ►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్. ►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై. If Hanuma Vihari is indeed not injured then perhaps the selectors’ memories of his selfless heroics in the last Test he played for the country are as blurred as these rather poorly taken live pictures at the SCG in January #IndvNZ pic.twitter.com/YxRio3MB4t — Bharat Sundaresan (@beastieboy07) November 12, 2021 -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న టీమిండియా క్రికెటర్
Hanuma Vihari Takes Part In Green India Challenge: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి పాల్గొన్నాడు. ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చాడు. కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, టీమిండియా దిగ్గజ క్రికెటర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్, కృష్ణ ప్రియలకు ఆయన ఛాలెంజ్ విసిరాడు. చదవండి: గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన -
అది నా కల.. కానీ సెలక్షన్ మన చేతిలో ఉండదు కదా: సిరాజ్
Mohammed Siraj About T20 World Cup Dream: టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది తన కల అని టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. అయితే, జట్టులో స్థానం పొందలేకపోవడం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు. ఏదేమైనా టీమిండియా తరఫున ఆడటం గొప్ప విషయమని, జట్టును గెలిపించడంలో తన పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. కాగా అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్నకు బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఈ హైదరాబాదీకి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అనుభవజ్ఞులైన పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్కే సెలక్షన్ కమిటీ ఓటు వేసింది. దీంతో సిరాజ్కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో స్టార్స్పోర్ట్స్తో మాట్లాడిన సిరాజ్.. జట్టులో స్థానం దక్కకపోవడం బాధించిందన్నాడు. ‘‘ టీ20 వరల్డ్ కప్ ఆడాలనేది నా కల. కానీ, సెలక్షన్ అనేది మన చేతిలో ఉండదు కదా. ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదు. చదవండి: T20 World Cup: అశ్విన్కు అది కన్సోలేషన్ ప్రైజ్ లాంటిది.. తుదిజట్టులో ఉంటాడా నా ముందు పెద్ద లక్ష్యం ఉంది. టీమిండియా విజయాల్లో నాదైన పాత్ర పోషించాలని భావిస్తున్నా. విధిరాతను నేను నమ్ముతాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నేపథ్యంలో హైదరాబాద్ తరఫున ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సిరాజ్ ఈ సందర్భంగా చెప్పాడు. ‘‘దేశవాళీ క్రికెట్లోనూ నా జట్టు తరఫున కీలక పాత్ర పోషించాలనేది నా కల. అయితే, ఎలైట్ గ్రూప్ ఆఫ్ రంజీ ట్రోఫీలో మా జట్టు లేకపోవడం నిరాశకు గురిచేసింది. టీ20 టోర్నీకి మాత్రం అందుబాటులో ఉంటాను’’ అని స్పష్టం చేశాడు. ఇక హనుమ విహారి హైదరాబాద్ జట్టుకు తిరిగి ఆడనుండటం శుభ పరిణామమని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా... ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 27 ఏళ్ల సిరాజ్.. ఇప్పటి వరకు తొమ్మిది టెస్టులాడి 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. చదవండి: Irfan Pathan: ఇది ఊహించలేదు.. కోహ్లి నిర్ణయం షాక్కు గురిచేసింది టీ20 ప్రపంచకప్ భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్కీపర్), ఇషాన్ కిషన్(వికెట్కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్. -
మళ్లీ హైదరాబాద్ జట్టు తరఫున ఆడనున్న విహారి
హైదరాబాద్ : టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. అనంతరం ఆంధ్రాకు తరలి వెళ్లాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్ బెంచ్కే పరిమితమ్యాడు. కాగా కరోనా కారణంగా ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో విహారి స్వదేశానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచులాడిన విహారి 624 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో విహారి సభ్యుడుగా ఉన్నాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్.. -
ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ గెలిచింది ఒలింపిక్స్లో కాదు లంబూజీ..
డర్హమ్: విశ్వక్రీడా సంబురం(టోక్యో ఒలింపిక్స్) జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ మెడల్ వార్త కనిపించినా అది ఒలింపిక్స్లోనే అనుకుని చాలా మంది ప్రముఖులు పొరబడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లు కూడా ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్తో పాటు హంగేరీలోని బుడాపెస్ట్లో వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం భారత రెజ్లర్ ప్రియా మాలిక్ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఆమె ఒలింపిక్స్లోనే ఆ మెడల్ గెలిచిందనుకొని టీమిండియా క్రికెటర్లు ఇషాంత్ శర్మ, హనుమ విహారిలు.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. వీరిలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ప్రియా మాలిక్ ఒలింపిక్స్లోనే మెడల్ గెలిచిందనుకొని శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. దీంతో ట్విటర్లో #NotOlympics ట్రెండింగ్ అయ్యింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు.. వెంటనే తమతమ ట్వీట్లు డిలీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్లో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇషాంత్.. చానుకు శుభాకాంక్షలు తెలిపాడు. -
Hanuma vihari: ఫౌండేషన్ లోగో చూశారా!
సాక్షి,న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ టీమిండియా టెస్టు బ్యాట్స్మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి పలువురి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్లో హనుమ విహారి అనేక మంది బాధితులకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. ఈ క్రమంలో హనుమ విహారి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఫౌండేషన్ లోగోను ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ లోగోను పరిచయం చేస్తూ "మనం అందరికీ సాయం చేయలేకపోవచ్చు.కానీ ప్రతీవాళ్లు కొందరికి సాయం చేయొచ్చు’’ రోనాల్డ్ రీగన్ మాటలను కోట్ చేశారు. ‘అందరం ఐక్యమవుదాం. కలిసికట్టుగా సాయపడదాం’ అని విహారి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా తన ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ, రక్తదానం లాంటి విశేష సేవలను అందిస్తున్నారు హనుమ విహారి. ఇంకా కేన్సర్ పీడితులు, అనేక మంది చిన్నారులకు సాయం అందిస్తూ భరోసానిస్తున్నారు. 24 గంటలూ బాధితులకు అండగా ఉంటూ ఆయన అందిస్తున్న సేవలు ఆయన ట్విటర్ టైం లైన్ పరిశీలిస్తే అర్థమవుతాయి. అంతేకాదు తనతోపాటు సాయం చేసేలా పదిమందిని ప్రోత్సహిస్తుండటం విశేషం. Hi All- "We can't help everyone, but everyone can help someone" by Ronald Reagan.🙂 On this note happy to introduce our logo. Let us unite together and reach our help and efforts to needy people. Team Hv 🤝🏻@Hanumavihari pic.twitter.com/cblAvHLFAy — Hanuma Vihari Foundation (@HanumaVihariFdn) June 11, 2021 చదవండి: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి హనమ విహరి ఆర్ధిక సాయం పద్మ అవార్డు: ట్రెండింగ్లో సోనూసూద్ -
శభాష్ విహారి.. నువ్వు నిజంగా చాలా గ్రేట్ గురూ
లండన్: టీమిండియా టెస్టు బ్యాట్స్మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్న విహారి.. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో వైద్యానికి అవసరమైన డబ్బును అందించడంతో ప్రియాంక అనే ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటుంది. As promised yesterday to Priyanka’s family. They’ll be receiving funds from me today n get her surgery started asap. She deserves to have a better life and it’s all of our responsibility to give it to her.thank you everyone who has come forward@Hidderkaran special mention to you — Hanuma vihari (@Hanumavihari) June 7, 2021 వివారాల్లోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో బాధితురాలు ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓ రోజు ప్రియాంకకు ప్రపోస్ చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంకపై దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. ఘటనా స్థలంలో నిర్జీవంగా పడివున్న ప్రియాంకను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా దాతలను అభ్యర్ధించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే స్పందించి ఆ అమ్మయి వైద్యానికి అవసరమయ్యే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సహాయానికి ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంట కనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, 27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును గట్టెక్కించి విషయం తెలిసిందే. చదవండి: ఆసీస్ వికెట్ కీపర్కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు -
Hanuma Vihari: ఇలాంటి షాట్ భారత్లో ఆడితే అవుట్ కాకపోయేవాడిని!
ఇంగ్లండ్లో అడుగు పెట్టిన భారత క్రికెట్ జట్టు సభ్యులకు ఈ టూర్కు ముందు సరైన ప్రాక్టీస్ లభించలేదు కానీ జట్టులోని ఒక ఆటగాడు మాత్రం ఇదే సిరీస్ కోసం చాలా రోజులుగా సన్నద్ధమవుతున్నాడు. ఎక్కడో కాకుండా అదే ఇంగ్లండ్ గడ్డపై ఆడుతూ తన ఆటకు అతను పదును పెట్టుకున్నాడు. అతనే గాదె హనుమ విహారి. కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆంధ్ర బ్యాట్స్మన్ మూడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి టెస్టు సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇక్కడే అరంగేట్రం చేసిన విహారి ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. లండన్: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయంలో భాగంగా ఉన్న హనుమ విహారి సిడ్నీ టెస్టులో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకున్న అనంతరం మరోసారి టీమిండియా సభ్యుడిగా జట్టులో భాగమయ్యాడు. 2018 సిరీస్లో ఓవల్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన విహారి అదే మ్యాచ్లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నేళ్లలో తన ఆటతీరు మారిందని చెబుతున్న విహారి ‘క్రిక్ఇన్ఫో’ వెబ్సైట్కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో పలు అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించాడు. విశేషాలు అతని మాటల్లోనే... ఇంగ్లండ్లో బ్యాటింగ్ పరిస్థితులపై... నిజంగా ఇక్కడ బ్యాటింగ్ పెద్ద సవాల్ వంటిదే. ఎండ కాసినప్పుడు బ్యాటింగ్ కొంత సులువవుతుంది కానీ ఆకాశం మబ్బు పట్టి ఉంటే చాలు ఒక్కసారిగా కష్టంగా మారిపోతుంది. దాదాపు రోజంతా బంతి స్వింగ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూక్ బంతులు బాగా ప్రభావం చూపిస్తాయి. బౌలర్లకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రీజ్లో నిలదొక్కుకున్నామని అనిపించిన సమయంలో కూడా అనూహ్య స్వింగ్ ఇబ్బంది పెడుతుంది. డ్యూక్ బంతులపై సీమ్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. కౌంటీల్లో అనుభవంపై... నేను ఇంగ్లండ్కు వచ్చిన సమయంలో బాగా చలిగా ఉంది. ఆ వాతావరణంలో బంతి మరింత ప్రభావం చూపించింది. అందుకే నా తొలి కౌంటీ మ్యాచ్లో చాలా ఇబ్బంది పడ్డాను. బ్రాడ్ బౌలింగ్ను సరిగా ఎదుర్కోలేక డకౌట్ అయ్యాను. ఇక్కడ డ్రైవ్ చేయడం కూడా అంత సులువు కాదు. ఇదే తరహా షాట్ నేను భారత్ లో ఆడి ఉంటే అవుట్ కాకపోయేవాడిని. ఇంగ్లండ్లో ఆడుతున్నప్పుడు షాట్ సెలక్షన్ చాలా ముఖ్యం. అయితే మెల్లగా అన్నీ చక్కదిద్దుకొని తర్వాతి మ్యాచ్లో అర్ధసెంచరీ చేశాను. స్టాన్స్ కూడా మార్చుకున్నాను. ఇప్పుడు ఈ అనుభవమే నాకు పెద్ద బలం. టీమిండియా తరఫున బాగా ఆడేందుకు ఇదంతా అక్కరకొస్తుంది. 2018తో పోలిస్తే ఈ సిరీస్పై... అప్పుడు నా మొదటి టెస్టు ఆడాను. అనుభవం లేని కుర్రాడిని. బ్యాటింగ్ చేసేటప్పుడు కాళ్ల కదలికలు కూడా భిన్నంగా ఉండేవి. అందుకే అండర్సన్, బ్రాడ్ ఇన్స్వింగర్లను ఎలా ఆడాడో కోహ్లి సూచించాల్సి వచ్చింది. వాటిని నేను అమలు చేశాను కూడా. అయితే ఇప్పుడు నా ఆట చాలా మెరుగైంది. స్వింగర్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. నా బ్యాటింగ్పై నియంత్రణ పెరిగింది. క్రీజ్లో కదలికలు ఎలా ఉండాలో బాగా తెలుసు. అదనంగా కౌంటీ అనుభవం కూడా వచ్చింది కాబట్టి ఈ సిరీస్లో మంచి స్కోర్లు సాధిస్తాననే నమ్మకం ఉంది. చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉండేది -
'సిగ్గుచేటు.. దేశం ఇలా ఉందంటే నీలాంటి వారి వల్లే'
లండన్: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిపై కలత చెందిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి తనవంతు చేయూతను అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇతర క్రికెటర్ల లాగా విరాళంతో సరిపెట్టకుండా కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్వర్క్ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. విహారి చేస్తున్న పనిపై అందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఒక నెటిజన్ మాత్రం విహారిపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. విషయంలోకి వెళితే.. విహారి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక అమ్మాయి అవసరం గురించి రాసుకొచ్చాడు.''ఆ అమ్మాయి తండ్రి, సోదరుడు కరోనాతో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటూ చావుబతుకులు మధ్య ఉన్నారు. వారిని కాపాడుకోవడానికి అమ్మాయికి డబ్బు అవసరం చాలా ఉంది. అందరం కలిసి తలా ఒక చేయి వేసి వారి ప్రాణాలను కాపాడుదాం'' అంటూ చెప్పుకొచ్చాడు. విహారి కామెంట్స్పై అందరు పాజిటివ్గా స్పందించారు. అయితే ఒక వ్యక్తి మాత్రం..'' ఆ డబ్బు మీరే ఇవ్వొచ్చు కదా.. ఎంతైనా మీరు గొప్ప అథ్లెట్.. డబ్బులు కూడా చాలానే ఉంటాయి.. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు'' అంటూ కామెంట్ చేశాడు. దీనిపై విహారి ఆ వ్యక్తికి ధీటుగా బదులిచ్చాడు. ''ఇది నిజంగా సిగ్గుచేటు.. ఇండియా ఈరోజు ఇలా ఉందంటే నీలాంటి వాళ్లు దేశంలో నివసించడం వల్లే.. రియల్లీ షేమ్ ఆన్ యూ.. వీలైతే సాయం చేయాలి. అంతేకానీ ఇలాంటి మాటలొద్దు.. నా దగ్గర డబ్బు ఉండొచ్చు.. కానీ నేను ఏదో ఆశించి స్వార్థం కోసం చేయడం లేదు.. దేశం కోసం చేస్తున్నా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది. చదవండి: Hanuma Vihari: విహారి వలంటీర్స్... -
Hanuma Vihari: దాతృత్వం.. కోవిడ్ బాధితులకు అండగా
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్వర్క్ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో 27 ఏళ్ల విహారి మాట్లాడుతూ ‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు! అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. సామాజిక మాధ్యమాల్లో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది. జట్టుకోసం ఏదైతే అది... ఇంగ్లండ్ పర్యటనపై మాట్లాడుతూ జట్టు కోసం ఏ స్థానంలో పంపించినా బ్యాటింగ్కు సిద్ధమేనని చెప్పాడు. ‘నా కెరీర్లో ఎన్నోసార్లు టాపార్డర్లో బ్యాటింగ్ చేశాను. జట్టు మేనేజ్మెంట్ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్ అయినా ఓకే’ అని విహారి అన్నాడు. ముందుగా కివీస్తో ఇంగ్లండ్లో డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇంగ్లండ్తో సిరీస్కు చాలా ముందుగా ఇక్కడికి రావడం తనకు కలిసివస్తుందని చెప్పాడు. పిచ్, స్థానిక వాతావరణం అలవాటైందని చెప్పుకొచ్చాడు. ఇది భారత జట్టు తరఫున మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు. -
విహారికి ఎప్పటికీ గుర్తుండిపోయే కౌంటీ అరంగేట్రం!
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ల్లో భాగంగా అక్కడ జరిగే కౌంటీ క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడు హనుమ విహారి చెత్త రికార్డు నమోదు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్న విహారికి తొలి మ్యాచ్లోనే నిరాశ ఎదురైంది. 40 నిమిషాల పాటు క్రీజ్లో ఉండి 23 బంతుల్ని ఎదుర్కొన్న విహారి డకౌట్ అయ్యాడు. బ్రాడ్ బౌలింగ్లో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హసీబ్ హమీద్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది విహారికి మరచిపోలేని కౌంటీ అరంగేట్రంగా ఎప్పటికీ గుర్తుండి పోవడం ఖాయం. కాగా, ఫీల్డింగ్లో మాత్రం ఆకట్టుకున్నాడు విహారి. నాటింగ్హామ్షైర్ ఇన్నింగ్స్ చేస్తున్నప్పుడు వన్ హ్యాండెడ్ డైవింగ్ క్యాచ్తో అలరించాడు. విల్ రోడ్స్ బౌలింగ్లో స్టీవన్ ములానే(31) ఇచ్చిన క్యాచ్ను అద్భుతంగా అందుకున్నాడు. ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్లో ఇంగ్లండ్కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. -
ఐపీఎల్లో నో చాన్స్.. అందుకే కౌంటీ క్రికెట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్లో ఇంగ్లండ్కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్ల్లో వార్విక్షైర్ క్లబ్ తరఫున విహారి బరిలోకి దిగనున్నాడు. వార్విక్షైర్ తరఫున అతను కనీసం మూడు మ్యాచ్లు ఆడతాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్కు వెళ్లిన విహారి 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. చదవండి: ధోని బాయ్ జట్టుతో తొలి మ్యాచ్.. అది కెప్టెన్గా -
'అతన్ని చూస్తే బాధేస్తోంది.. ఐపీఎల్ ఆడితే బాగుండేది'
ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఎప్పుడెప్పుడు ఐపీఎల్లో ఆడాలా అని ఎదురుచూస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడనున్న పుజారాను ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 50 లక్షలకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రాక్టీస్ సమయంలోనూ పుజారా సిక్సర్ల వర్షం కురిపించి తనలో ఎంత కసి దాగుందో చూపించాడు. అయితే అతనికి సీఎస్కే అవకాశాలు ఇస్తుందా అన్న అనుమానం ఉన్నా.. పుజారాకు చాన్స్ ఇస్తే మాత్రం తన విలువేంటో చూపించేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పుజారా తన సహచర ఆటగాడు హనుమ విహారి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమ విహారిని ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ''మనం టీమిండియా తరపున ఏదైనా సాధించినప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడడం సాధారణం.. ఆ విలువ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్లో ఆడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో.. నా సహచరులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. గత కొన్నేళ్లలో టీమింయాలో ఉన్న సహచరుల్లో ఐపీఎల్ మిస్సయ్యింది నేను మాత్రమే అనుకుంటా. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నా. తాజాగా హనుమ విహారి ఆ బాధను అనుభవిస్తున్నాడు. 2018 తర్వాత అతన్ని ఏ జట్టు వేలంలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ అతను ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి ఉంటే బాగుండేది. గతంలో విహారి ఐపీఎల్లో ఆడాడు.. ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది..'' అని చెప్పుకొచ్చాడు. కాగా హనుమ విహారి గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఎస్ఆర్హెచ్ హనుమ విహారిని రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఎవరు అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఇక ఐపీఎల్లో 30 మ్యాచ్లు ఆడిన పుజారా 390 పరుగులు సాధించాడు. గతంలో కేకేఆర్, ఆర్సీబీలకు ఆడిన పుజారా తాజాగా సీఎస్కే తరపున ఆడనున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్కు కరోనా సెగ పట్టుకుంది. వరుసగా ఆటగాళ్లంతా కరోనా బారిన పడుతుండడంతో ఫ్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది. చదవండి: 'మేం సీఎస్కేకు ఆడలేం'.. కారణం అదేనట నేను కెప్టెన్ అవుతానని అస్సలు ఊహించలేదు: సంజూ -
ఏం జరిగినా ఆడాలనుకున్నా: హనుమ విహారి
సాక్షి, హైదరాబాద్: 161 బంతుల్లో 23 పరుగులు... ఈ స్కోరు చూస్తే ఇంతేనా అనిపిస్తుంది! కానీ ఇదే ఇన్నింగ్స్ విలువ మాటల్లో చెప్పలేనంత అమూల్యం! గాయంతో బాధపడుతూనే ఒక్కో బంతిని ఎదుర్కొంటూ భారత్ను ఓటమి నుంచి రక్షించిన ఈ ప్రదర్శన హనుమ విహారిని ఒక్కసారిగా హీరోను చేసింది. అప్పటి వరకు ఆడిన 11 టెస్టుల ప్రదర్శనతో పోలిస్తే సిడ్నీలో పోరాటం విహారి స్థాయిని పెంచింది. అశ్విన్తో కలిసి విహారి ఆడిన ఆటతో మూడో టెస్టును కాపాడుకున్న భారత్ చివరి టెస్టులో విజయంతో సిరీస్ను సొంతం చేసుకుంది. వరుసగా రెండో పర్యటనలోనూ గెలుపు బృం దంలో భాగంగా ఉన్న విహారి తాజా సిరీస్ విజయం పట్ల అమితానందంగా కనిపించాడు. ప్రస్తుతం అతను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్తో గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన కెరీర్లో సిడ్నీ ప్రదర్శన ఎప్పటికీ మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోతుం దన్న విహారి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... బ్రిస్బేన్లో గెలుపు, సిరీస్ సొంతం కావడంపై... చాలా చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల క్రితం మేం ఉన్న స్థితి నుంచి సిరీస్ గెలుపు వరకు చూస్తే అంతా అద్భుతంలా కనిపించింది. చరిత్రలో అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో నేనూ ఉండటం చాలా గర్వంగా అనిపిస్తోంది. ముఖ్యంగా చివరి టెస్టులో మా వాళ్లంతా చాలా బాగా ఆడారు. వారిని అక్కడ చూస్తుంటే నేనూ ఉంటే బాగుండేదనిపించింది. విజయపు వేడుకల్లో భాగం కాలేకపోవడం సహజంగానే నిరాశ కలిగించింది. అశ్విన్లాగా కాకుండా నేను తర్వాతి మ్యాచ్ ఆడలేనని సిడ్నీలోనే తేలిపోయింది. ఎన్సీఏకి వెళ్లి గాయం నుంచి కోలుకునేం దుకు సాధ్యమైనంత త్వరగా రీహాబిలిటేషన్ ప్రారంభించా లని చెప్పడంతో సిడ్నీ నుంచి రావాల్సి వచ్చింది. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు ఎంపిక కాలేదు కానీ మూడో టెస్టులోగా కోలుకొని జట్టులోకి వస్తానని నమ్మకముంది. చదవండి: (ఆసీస్ అడ్డాలో టీమిండియా కొత్త చరిత్ర) రెండేళ్ల క్రితం గెలుపుతో పోలిస్తే... ఆసీస్ గడ్డపై అప్పటి వరకు భారత్ ఒక్కసారీ సిరీస్ నెగ్గలేదు. కాబట్టి నాడు అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తాజా విజయం మరింత మధురంగా అనిపిస్తోంది. నా వరకు చూస్తే రెండు సిరీస్ లలోనూ నేను జట్టులో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా ఆనందం రెట్టింపైంది. దీనిని మాటల్లో చెప్పలేను. ఇంత కంటే ఇంకేం ఆశించగలను! నిజానికి క్వారంటైన్, బయో బబుల్ చాలా కఠినంగా అనిపించాయి. అయితే ఇంత ప్రతిష్టాత్మక సిరీస్ ఆడుతున్న సమయంలో ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని మేమందరం గట్టిగా అనుకున్నాం కాబట్టి అది ఇబ్బంది కాలేదు. ఈ రెండు పర్యటనల మధ్య బ్యాట్స్మన్గా కూడా నేను ఎంతో మెరుగయ్యాను. వైఫల్యాల తర్వాత జట్టులో స్థానంపై... సహజంగానే కొంత అనిశ్చితి ఉంటుంది. అడిలైడ్, మెల్బోర్న్లలో నేను తక్కువ స్కోర్లు చేయడం వాస్తవమే అయినా ఎక్కడా తడబడలేదు. క్రీజ్లో ఉన్నంత సేపు మంచి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాను. అయితే అవి భారీ స్కోర్లుగా మారలేదు. అయినా తుది జట్టు ఎంపిక గురించి ఊహించలేం. అవకాశం రాకపోతే ఏమీ చేయలేం. అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం వంద శాతం కష్టపడి బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇక నేను ఒకటి మినహా (వైజాగ్లో దక్షిణాఫ్రికాపై) మిగిలిన 11 టెస్టులు విదేశాల్లోనే ఆడాను. టీమ్ మేనేజ్మెంట్ నన్ను బయటి టెస్టుల్లోనే పరిగణనలోకి తీసుకుంటోందా అనేది కూడా చెప్పలేను. అయితే అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. సిడ్నీ అద్భుతం గురించి... ఆ రోజు గురించి నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా భావోద్వేగానికి లోనవుతా! నేను బ్యాటింగ్ మొదలు పెట్టిన కొద్ది సేపటికే (27 బంతులకు) కండరాలు పట్టేశాయి. ఇక పరుగు తీయడం కష్టమని అర్థమైపోయింది. తర్వాతి ఓవర్లోనే పుజారా వెనుదిరిగాడు. అంతే... ఇక మ్యాచ్ను కాపాడుకోవాలని నేను, అశ్విన్ నిర్ణయించుకున్నాం. వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా నిలబడ్డాం. ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం సులువు కాదు. ఆ సమయంలో అది మరీ కష్టంగా అనిపించింది. నొప్పి పెరిగిపోవడంతో నివారణ ఇంజక్షన్ తీసుకున్నాను. బలవంతంగా ఆటలో కొనసాగితే గాయం తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే విషయం గురించి ఆలోచించలేదు. రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత కూడా నన్ను నమ్మి మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇచ్చింది. దానిని నిలబెట్టుకునేందుకు ఏం జరిగినా ఆడాలనుకున్నా. ఇద్దరం ఒకే తరహా స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రోత్సహించుకుంటూ కదిలాం. అశ్విన్కు కొంత తెలుగు పరిజ్ఞానం ఉండగా... చెన్నైలో ఆడిన అనుభవంతో నాకు తమిళం వచ్చు. అవే భాషల్లో మా సంభాషణ సాగింది. ఆట ముగిశాక నాకు కలిగిన సంతృప్తిని మాటల్లో చెప్పలేను. సిరాజ్ ప్రదర్శనపై... సిరాజ్ తొలి రంజీ మ్యాచ్కు (2015లో సర్వీసెస్తో) నేనే హైదరాబాద్ కెప్టెన్గా ఉండి క్యాప్ అందించా. అప్పటి నుంచి అతనితో సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు కలిసి టెస్టులు ఆడాం. అంతులేని ఆత్మవిశ్వాసమే అతని బలం. మైదానంలో ఉన్నప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు ఆ జోష్, పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లోనూ సిరాజ్ చాలా బాగా ఆడాడు. వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి అతను ఆడిన ఆటను ప్రశంసించకుండా ఉండలేం.