DC Vs LSG: ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చాడు.. క‌ట్ చేస్తే! ఒంటి చేత్తో ఢిల్లీని గెలిపించాడు | IPL 2025 DC Vs LSG: Ashutosh Sharmas Heroics Give Delhi Capitals One-Wicket Win Over LSG, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

IPL 2025 DC Vs LSG: ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చాడు.. క‌ట్ చేస్తే! ఒంటి చేత్తో ఢిల్లీని గెలిపించాడు

Published Tue, Mar 25 2025 12:01 AM | Last Updated on Tue, Mar 25 2025 4:55 PM

IPL 2025: Ashutosh Sharmas Heroics Give Delhi Capitals One-Wicket Win Over LSG

ఐపీఎల్‌-2025లో వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించింది. ఆఖ‌రివ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్నచోట ఢిల్లీ క్యాపిట్స్ ఆట‌గాడు అశుతోష్ శ‌ర్మ‌ అద్బుతం చేశాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన అశుతోష్‌.. త‌న విరోచిత పోరాటంతో ఢిల్లీకి సంచ‌ల‌న విజ‌యాన్ని అందించాడు.

తొలుత 20 బంతుల్లో 20 ప‌రుగులు చేసిన అశుతోష్‌.. 15వ త‌ర్వాత ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మ‌రో ఎండ్‌లో ఉన్న విప్ర‌జ్ నిగ‌మ్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అయితే దూకుడుగా ఆడుతున్న విప్ర‌జ్ నిగ‌మ్,  వెంట‌నే మిచెల్ స్టార్క్ కూడా ఔట్ కావ‌డంతో ఢిల్లీకి ఓట‌మి త‌ప్ప‌దని అంతా అనుకున్నారు. కానీ క్రీజులో ఉన్న అశుతోష్ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్లు బ్యాటింగ్ చేశాడు. వ‌రుస‌గా బౌండ‌రీలు బాదుతూ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

త‌న‌దైన స్టైల్లో బ్యాటింగ్ చేసిన అశుతోష్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అశుతోష్ త‌న ఎదుర్కొన్న ఆఖ‌రి 11 బంతుల్లో ఏకంగా 44 ప‌రుగులు చేయ‌డం విశేషం. మొత్తంగా 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 66 ప‌రుగులు చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అత‌డి విధ్వంసం ఫ‌లితంగా ఢిల్లీ.. 210 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని  9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవ‌ర్ల‌లో అందుకుంది. 

ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అశుతోష్‌తో పాటు విప్ర‌జ్ నిగ‌మ్‌( 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 39), స్ట‌బ్స్‌(34) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో శార్ధూల్ ఠాకూర్‌, సిద్దార్ద్‌, బిష్ణోయ్‌, దిగ్వేష్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. 

ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌( 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 72), నికోల‌స్ పూర‌న్‌( 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 75 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు సాధించ‌గా.. విప్రాజ్ నిగ‌మ్‌, ముఖేష్ కుమార్ త‌లా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో విరోచిత ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ ఎక్స్‌లో ట్రెండింగ్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రీ అశుతోష్ అని నెటిజ‌న్లు తెగ‌వెతికేస్తున్నారు.

ఎవ‌రీ అశుతోష్‌?
26 ఏళ్ల అశుతోష్‌ రాంబాబు శ‌ర్మ‌.. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో రైల్వేస్ కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. 8 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 7 లిస్ట్‌-ఏ, 31 టీ20లు ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు చేసిన అశుతోష్‌.. టీ20ల్లో 47 అర్దసెంచరీలు నమోదు చేశాడు. ఇక అశుతోష్ ఐపీఎల్ అభిమానులకు సుప‌రిచిత‌డే. ఐపీఎల్‌-2024 సీజ‌న్‌తో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున అశుతోష్..  ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. 

మినీ వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ తన బేస్‌ ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. గ‌తేడాది సీజ‌న్‌లో ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ను గెలిపించాడు. అయిన‌ప్ప‌టికి పంజాబ్ మాత్రం ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వ‌చ్చిన ఈ ప‌వ‌ర్ హిట్ట‌ర్‌ను రూ.3.8 కోట్ల‌కు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఢిల్లీ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఈ మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్రికెట‌ర్ నిల‌బెట్టుకున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement