Delhi Capitals
-
భళా బెంగళూరు...
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకుపోతోంది. టోర్నీ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్ను అలవోకగా ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ముందుగా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆర్సీబీ... ఆ తర్వాత స్మృతి, వ్యాట్ దూకుడైన బ్యాటింగ్తో మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపు పూర్తి చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, సారా బ్రైస్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు) కాస్త పోరాడింది. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుకా సింగ్ (3/23), జార్జియా వేర్హామ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...గార్త్, బిష్త్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్లు), డానీ వ్యాట్ (33 బంతుల్లో 42; 7 ఫోర్లు) తొలి వికెట్కు 65 బంతుల్లోనే 107 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సునాయాసం చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెరీ (బి) గార్త్ 17; షఫాలీ (సి) స్మృతి (బి) రేణుక 0; జెమీమా (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 34; నెదర్లాండ్ (సి) స్మృతి (బి) రేణుక 19; కాప్ (సి) వ్యాట్ (బి) బిష్త్ 12; జొనాసెన్ (సి) కనిక (బి) బిష్త్ 1; బ్రైస్ (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 23; శిఖా (సి) బిష్త్ (బి) రేణుక 14; రాధ (సి అండ్ బి) వేర్హామ్ 0; అరుంధతి రెడ్డి (సి) పెరీ (బి) గార్త్ 4; మిన్ను మణి (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–1, 2–60, 3–62, 4–84, 5–87, 6–105, 7–130, 8–130, 9–132, 10–141. బౌలింగ్: రేణుక 4–0–23–3, కిమ్ గార్త్ 3.3–0–19–2, ఏక్తా బిష్త్ 4–0–35–2, జోషిత 2–0–21–0, వేర్హామ్ 4–0–25–3, కనిక 2–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) శిఖా 81; డానీ వ్యాట్ (సి) జెమీమా (బి) అరుంధతి 42; ఎలీస్ పెరీ (నాటౌట్) 7; రిచా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–107, 2–133. బౌలింగ్: కాప్ 2–0–27–0, శిఖా 4–0– 27–1, మిన్ను 1–0– 10–0, అరుంధతి 3.2–0–25–1, జొనాసెన్ 4–0–37–0, సదర్లాండ్ 2–0–18–0. -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 141 పరుగులకు ఢిల్లీ ఆలౌట్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది.రేణుకా సింగ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫామ్లో ఉన్న షఫాలీ వర్మను ఔట్ చేసి ఢిల్లీకి షాకిచ్చింది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్, రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ లానింగ్(17), రోడ్రిగ్స్ ఔటయ్యాక ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది.ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్, జార్జియా వేర్హామ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, ఏక్తా బిస్త్ తలా రెండు వికెట్లు సాధించారు. ఢిల్లీ బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34) టాప్ స్కోరర్గా నిలవగా.. సారా బ్రైస్(23), అన్నాబెల్ సదర్లాండ్(19) రాణించారు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన(కెప్టెన్), డానియెల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ బిస్ట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత VJ, రేణుకా ఠాకూర్ -
'రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే'
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ పండగ రాబోతుంది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్లో కోల్కతా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ తలపడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ క్యాష్ రిచ్ లీగ్లో మొత్తం 10 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల రిటెన్షన్తో పాటు ఐపీఎల్ మెగా వేలంతో తమకు అవసరమైన ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అయితే పది జట్లలో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీలు ఇంకా తమ కెప్టెన్ల వివరాలను వెల్లడించలేదు.ఈ రెండు ఫ్రాంచైజీలు తమ జట్లకు కెప్టెన్లగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ను వేలంలోకి విడిచిపెట్టాయి. దీంతో కొత్త కెప్టెన్ల ఎంపిక అనివార్యమైంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(AxarPatel)ను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులోఅనువజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఉన్నప్పటికి ఢిల్లీ యాజమాన్యం అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు."ఢిల్లీ కెప్టెన్సీ రేసులో అక్షర్ పటేల్, రాహుల్, డుప్లెసిస్ ఉన్నారు. అయితే అక్షర్ పటేల్ను మాత్రం భారీ ధర(రూ. 16.50) వెచ్చించి మరి సొంతం చేసుకుంది. కెప్టెన్సీ రేసులో అక్షర్ అగ్రస్ధానంలో ఉన్నాడని అప్పుడే మనం ఆర్ధం చేసుకోవచ్చు. బాపు(అక్షర్) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడనున్నాడు. భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.అతడు చాలా తెలివైనవాడు. ఆట స్థితిగతులను బాగా ఆర్ధం చేసుకున్నాడు. అక్షర్కు జట్టును నడిపించే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అతడిని ఢిల్లీ తమ కెప్టెన్గా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్కు గాయం -
ఆఖరి బంతికి ఢిల్లీ గెలిచింది
వడోదర: లక్ష్యఛేదనలో ఢిల్లీకి చివరి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి...అయితే 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. సమీకరణం 7 బంతుల్లో 16 పరుగులకు మారడంతో ముంబైకే విజయావకాశాలు ఉన్నాయి. కానీ ఆపై డ్రామా సాగింది... ఆఖరి బంతి దాకా సాగిన రనౌట్/నాటౌట్ హంగామా ఢిల్లీనే గట్టెక్కించింది. కలిత వేసిన 20వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులు రాగా, ఐదో బంతికి నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన తరుణంలో హైదరాబాదీ ఆల్రౌండర్ తొలి పరుగు పూర్తి చేసింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్కు నివేదించగా... రీప్లేలో ఆమె పడిన డైవ్తో బ్యాట్ క్రీజ్ను దాటినట్లు తేలడంతో రెండో పరుగొచ్చింది. దీంతో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్ జట్టు 2 వికెట్ల తేడాతో ఓడింది. డబ్ల్యూపీఎల్లో శనివారం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ గెలిచేందుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. సీవర్, హర్మన్ దంచేసినా... ముంబై ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (0), యస్తిక (11) సహా ఆఖరి వరుస బ్యాటర్లు షబ్నమ్ (0), సైకా ఇషాక్ (0) వరకు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. వన్డౌన్లో నాట్ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరే ముంబైని ఆదుకున్నారు. వాళ్లిదరు మెరిపించడంతో ఒకానొక దశలో ముంబై 10.3 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. మూడో వికెట్కు 73 పరుగులు జోడించాక ధాటిగా ఆడుతున్న కెపె్టన్ హర్మన్ అవుటైంది. తర్వాత వచ్చినవారెవరూ బాధ్యత కనబర్చలేదు. కానీ సీవర్ బ్రంట్ 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి ఆఖరిదాకా అజేయంగా పోరాడింది. అదరగొట్టిన షఫాలీ ఓపెనర్ షఫాలీ వర్మ పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్తో కెపె్టన్ మెగ్ లానింగ్ (15)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభమిచ్చింది. ఆరో ఓవర్ ఐదో బంతికి షఫాలీ జోరుకు హేలీ కళ్లెం వేయగా, మరుసటి ఓవర్లో లానింగ్ను షబ్నమ్ అవుట్ చేసింది. తర్వాత జెమీమా (2), అనాబెల్ సదర్లాండ్ (13), అలైస్ క్యాప్సి (16)లు విఫలమవడంతో ఢిల్లీ ఆట పడుతూలేస్తూ సాగింది. ఈ దశలో నికీ ప్రసాద్, సారా బ్రైస్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) జోడీ ఆరో వికెట్కు వేగంగా 31 పరుగులు జతచేయడంతో ఢిల్లీ గెలుపుదారిలో పడింది. స్వల్పవ్యవధిలో సారా, శిఖాపాండే (2) నిష్క్రమించినా ఆఖరి బంతి దాకా పోరాడిన ఢిల్లీ టెయిలెండర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) శిఖాపాండే 11; హేలీ (సి) లానింగ్ (బి) శిఖాపాండే 0; సీవర్ బ్రంట్ నాటౌట్ 80; హర్మన్ప్రీత్ (సి) నికీ (బి) అనాబెల్ 42; అమెలియా రనౌట్ 9; సజన (సి) బ్రైస్ (బి) అనాబెల్ 1; అమన్జ్యోత్ (బి) క్యాప్సి 7; సంస్కృతి (సి) లానింగ్ (బి) మిన్నుమణి 2; కలిత రనౌట్ 1; షబ్నిమ్ రనౌట్ 0; సైకా ఇషాక్ (బి) అనాబెల్ 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–105, 4–129, 5–133, 6–146, 7–156, 8–159, 9–160, 10–164. బౌలింగ్: శిఖా పాండే 4–0–14–2, అలైస్ క్యాప్సి 2–0– 25–1, అరుంధతి 4–0– 40–0, మిన్నుమణి 4–0–23–1, అనాబెల్ 3.1–0–34–3, రాధా యాదవ్ 2–0–26–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) షబ్నమ్ 15; షఫాలీ (సి) అమన్జ్యోత్ (బి) హేలీ 43; జెమీమా (సి) హర్మన్ప్రీత్ (బి) అమెలియా 2; అనాబెల్ (బి) సీవర్ బ్రంట్ 13; క్యాప్సి (సి) షబ్నమ్ (బి) అమెలియా 16; నికీ ప్రసాద్ (సి) అమెలియా (బి) కలిత 35; సారా బ్రైస్ (సి) కలిత (బి) హేలీ 21; శిఖా పాండే రనౌట్ 2; రాధా యాదవ్ నాటౌట్ 9; అరుంధతీ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–66, 4–76, 5–109, 6–140, 7–147, 8–163. బౌలింగ్: షబ్నమ్ 4–0–18–1, సైకా 3–0–43–0, సీవర్ బ్రంట్ 4–0–38–1, హేలీ మాథ్యూస్ 4–0–31–2, అమెలియా కెర్ 4–0–22–2, కలిత 1–0–10–1. శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణా బెంగళూరు: డబ్ల్యూపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీ నుంచి తప్పుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో కూడా ఆమె బరిలోకి దిగలేదు. శ్రేయ స్థానంలో స్నేహ్ రాణాను ఆర్సీబీ జట్టులోకి తీసుకున్నారు. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్లో నేడుగుజరాత్ X యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్చార్జర్స్ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
IPL 2025: కేఎల్ రాహుల్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే..!
భారత మాజీ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తాడని జోస్యం చెప్పాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం కేఎల్ రాహుల్ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నా, అక్షర్ పటేల్కే ఢిల్లీ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. క్రిక్బజ్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డీకే ఈ విషయాలను పంచుకున్నాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ను టీమిండియా వైస్ కెప్టెన్గా నియమించడంపై డీకే స్పందిస్తూ.. హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం కూడా కనిపించడం లేదు. హార్దిక్ వైస్ కెప్టెన్గా ఉండగా టీమిండియా బాగా రాణించింది. హార్దిక్, సూర్యకుమార్ ఆథ్వర్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్లో (సౌతాఫ్రికా) గెలిచింది. అక్షర్ పటేల్ విషయానికొస్తే.. అతనికి ఇదో మంచి అవకాశం. మరి ముఖ్యంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కూడా ఉండబోతున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్ అక్షర్కు బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్ కెప్టెన్గా కూడా అక్షర్కు అనుభవం ఉంది. అక్షర్కు నా శుభాకాంక్షలు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.డీకే ఏ ఆధారంగా అక్షర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అన్నాడో తెలీదు కానీ, అక్షర్కు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. అక్షర్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో అక్షర్ ఓ మ్యాచ్లో డీసీ కెప్టెన్గా సేవలందించాడు. మెగా వేలానికి ముందు డీసీ యాజమాన్యం అక్షర్ను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది. 30 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన అక్షర్.. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్లో భాగమై ఉన్నాడు. కాగా, అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని తేల్చి చెప్పిన దినేశ్ కార్తీక్ గతంలో ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్గా వ్యవహరించాడు.సాధారణ ఆటగాడిగా రాహుల్..?అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్గా ఎంపికైతే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2020 సీజన్ తర్వాత తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. 2020, 2021 సీజన్లలో పంజాబ్ కెప్టెన్గా.. 2022-24 వరకు లక్నో కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ను ఇటీవల ముగిసిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాహుల్ డీసీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతాడో లేక మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ను మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
కరుణ్ నాయర్ ఐపీఎల్ ఆడుతున్నాడా..?
దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో పరుగుల వరద పారిస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. ఏ ఇద్దరు భారత క్రికెట్ అభిమానులు కలిసినా కరుణ్ నాయర్ గురించిన చర్చే నడుస్తుంది. 2022 డిసెంబర్లో డియర్ క్రికెట్.. మరో ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయ పడిన కరుణ్, ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ గణాంకాలు చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టోర్నీలో కరుణ్ ఏడు ఇన్నింగ్స్ల్లో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు ఇతని గురించి లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతటి విధ్వంసకర బ్యాటర్ అయిన కరుణ్ అసలు ఐపీఎల్ ఆడుతున్నాడా లేదా అని గూగుల్ చేస్తున్నారు. ఆసక్తికరంగా కరుణ్ను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో డీసీ కరుణ్ను 50 లక్షలకు సొంతం చేసుకుంది. కరుణ్ గతంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాడు. కరుణ్కు 2013-22 వరకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 76 మ్యాచ్లు ఆడి 10 అర్ద సెంచరీల సాయంతో 1496 పరుగులు చేశాడు.వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ అయిన కరుణ్ కేవలం కొంతకాలం మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగాడు. తన మూడో మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తిరిగి ఏడేళ్ల తర్వాత కరుణ్ లైమ్లైట్లోకి వచ్చాడు. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్కు అవకాశాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కరుణ్ ఉన్న ఫామ్ను ఐపీఎల్లోనూ కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో భారత జట్టులో పాగా వేయడం ఖాయం. కరుణ్ 2016-17 మధ్యలో భారత్ తరఫున 6 టెస్ట్లు, రెండు వన్డేలు ఆడాడు. టెస్ట్ల్లో ట్రిపుల్ సెంచరీ మినహాయించి కరుణ్కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.కాగా, విజయ్ హజారే ట్రోఫీలో ఇవాళ (జనవరి 16) జరుగుతున్న మ్యాచ్లో కరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.మహారాష్ట్రతో మ్యాచ్లో కరుణ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. విదర్భ ఓపెనర్లు దృవ్ షోరే (120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు), యశ్ రాథోడ్ (101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు) సెంచరీలు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. తదనంతరం కరుణ్ నాయర్తో పాటు జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. -
యర్రంపల్లి నుంచి దిల్లీకి, ఎవరీ శ్రీచరణి?
‘అనుకోలేదని ఆగవు కొన్ని!’ నిజమే... ఇంటర్ వరకు తాను క్రికెట్లోకి అడుగు పెడతానని శ్రీచరణి అనుకోలేదు. ఖోఖో, లాంగ్జంప్లలో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయిలో పతకాలు గెలుచుకున్న శ్రీచరణి ఇంటర్ చదివే రోజుల్లో క్రికెట్పై ఆసక్తి పెంచుకుంది. క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టింది. ఆటలో తనను తాను మెరుగుపరుచుకుంటూ ఆల్రౌండర్ అనిపించుకుంది. తాజా విషయానికి వస్తే... మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలంలో శ్రీచరణిని ఎంపిక చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ‘దిల్లీ క్యాపిటల్స్’ రూ.55 లక్షలతో శ్రీచరణిని ఎంపిక చేసుకుంది.కడప జిల్లా యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి అందరిలాగే ఎంతోమంది స్టార్ క్రికెటర్ల అద్భుతాలు చూస్తూ, వింటూ వస్తోంది. ఇప్పుడు ఆమె ఒక అద్భుతంగా, మోడల్గా నిలిచింది. ‘శ్రీచరణి మా ఊరు అమ్మాయే’ అని గ్రామస్థులు గర్వంగా చెప్పుకునేలా చేసింది.యర్రంపల్లి గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె శ్రీచరణి. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మెన్. ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది శ్రీచరణి. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని లేపాక్షి జూనియర్ కళాశాలలో పూర్తిచేసింది. ప్రస్తుతం వీరపునాయునిపల్లెలోని వీఆర్ఎస్ డిగ్రీ కళా శాలలో బీఎస్సీ, కంప్యూటర్స్చదువుతూ మరోవైపు క్రికెట్లో రాణిస్తోంది.2017–18లో క్రికెట్లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇక వెనక్కి తిరిగిచూసే అవసరం రాలేదు. అదేఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. 2020లో సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. జిల్లాకు చెందిన శిక్షకులు ఖాజామైనుద్దీన్, మధుసూదన్రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకుంది. మెరుగైన శిక్షణ కోసం కడపకు చెందిన మాజీ రంజీ క్రీడాకారుడు ఎం. సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ‘సురేష్ క్రికెట్ అకాడమీ’లో శిక్షణ పొందుతూ ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం కోల్కతాలో నిర్వహిస్తున్న బీసీసీఐ మహిళల సీనియర్ క్రికెట్ మ్యాచ్లలో ఆంధ్రా జట్టుకు ఆడుతుంది.పెద్ద పట్టణాల్లో ఉండే అమ్మాయిలు మాత్రమే క్రికెట్లో రాణిస్తారని, జాతీయస్థాయిలో ఆడతారనే అపోహను బ్రేక్ చేసింది. ‘నీ ఇష్టానికి కష్టం తోడైతే... అదే విజయం’ అంటున్న శ్రీ చరణి ఎంతోమంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తోంది. – నాగరాజు, కడప ఫోటోలు: వల్లెపు శ్రీనివాసులుఆ నమ్మకం ఉందిచిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. అమ్మానాన్నలు ఎంతో ్రపోత్సహించేవారు. అథ్లెటిక్స్లో రాణిస్తున్న నేను క్రికెట్పై ఆసక్తి చూపినప్పుడు అమ్మానాన్నలు మొదట సందేహించారు. అయితే మామ కిశోర్ కుమార్ మాత్రం ్రపోత్సహించేవారు. నేను క్రికెట్లో కూడా రాణిస్తుండడంతో అమ్మానాన్నలకు నాపై నమ్మకం వచ్చి సంతోషంగా ఉన్నారు. మనలో పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి దారి చూపుతాయి. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు నాకు సర్వస్వం అయింది. రానున్న కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. – శ్రీచరణిసత్తా చాటేలా...2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత ఏడాది నిర్వహించిన బీసీసీఐ సీనియర్ అంతర్ రాష్ట్ర మహిళల క్రికెట్ మ్యాచ్లలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించి కర్నాటక జట్టుపై 7 వికెట్లు, అండర్–23 మ్యాచ్లలో రాజస్థాన్ జట్టుపై 5 వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన కనబరిచింది.లెఫ్ట్ఆర్మ్ బౌలర్గా, లెఫ్ట్హ్యాండ్ బ్యాట్స్ ఉమన్గా నిలకడగా రాణిస్తుండటంతో ఇటీవల నిర్వహించిన ఉమెన్ టీ–20 పోటీల్లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. తన బౌలింగ్ తీరుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. గత నెలలో ముంబై ఇండియన్స్ జట్టు ఎంపికలకు వెళ్లిన సమయంలో శ్రీచరణి ఆటలోని నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు దిల్లీ క్యాపిటల్స్కు రూ.55లక్షలతో ఎంపిక చేసుకున్నారు. -
మినీ వేలం: యువ క్రికెటర్కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్రౌండర్ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్రౌండర్ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నదినె డి క్లర్క్ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్తో పోటీపడీ మరీ డాటిన్ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం.. ఒక్కసారిగా డబ్బు రాగానే..
క్రికెట్ వర్గాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పృథ్వీ షా. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ వారసుడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబైకర్.. ఇప్పుడు కెరీర్లో చాలా వెనుకబడిపోయాడు. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చినా.. ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిని పట్టించుకోలేదు.ఫలితంగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు పృథ్వీ. ఇందుకు ప్రధాన కారణం ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణా రాహిత్యమనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు పృథ్వీ షాకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని.. కెరీర్పై దృష్టి పెట్టాలని ఘాటుగానే విమర్శిస్తున్నారు.తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం..ఈ నేపథ్యంలో పృథ్వీ షా చిన్ననాటి కోచ్ రాజు పాఠక్.. ఈ బ్యాటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు బయటపెట్టాడు. ‘‘వాళ్ల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏం ఉండేది కాదు. అతడి తండ్రి వ్యాపారం మొదలుపెట్టి నష్టాలపాలయ్యారు. అందువల్ల షా చిన్నప్పటి నుంచి ఇతరుల సాయంపై ఆధారపడేవాడు.అలా ప్రతిదానికి ఇతరుల వద్ద చేయి చాచినట్లుగా ఉండటం మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక అతడికి తల్లి కూడా లేదు. అతడు అంతగా పరిణతి చెందక ముందే ఆమె కన్నుమూసింది. ఎవరికైనా తల్లి ఉంటేనే కదా.. తప్పొప్పుల గురించి సరిగ్గా తెలుస్తుంది. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానేఎన్ని కష్టాలు ఉన్నా.. ఆటపై దృష్టి పెట్టి చిన్న వయసులోనే విజయవంతమైన క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. చిన్నపుడు డబ్బుల్లేక పేదరికంలో మగ్గిన ఓ కుర్రాడు.. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానే మారిపోవడం సహజం.అతడు కూడా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు. దాదాపుగా అందరూ ఇదే పని చేస్తారు. తమకు నచ్చినట్లుగా జీవించాలని భావిస్తారు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు కారణంగా కొంతమంది విలాసాలకు అలవాటు పడతారు. పృథ్వీ షా 25 ఏళ్ల కుర్రాడుఅయినా పృథ్వీ షా కేవలం 25 ఏళ్ల కుర్రాడు. అతడిని 40 ఏళ్ల, పరిణతి చెందిన మనిషిగా ఉండాలని కోరుకోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి’’ అని రాజు పాఠక్ పృథ్వీ షాను విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో చోటు కరువుకాగా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పృథ్వీ షా తొలి టెస్టులోనే శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో ఓపెనర్గా జట్టులో పాతుకుపోతాడని భావించగా.. శుభ్మన్ గిల్తో పోటీలో వెనుకబడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున పృథ్వీ షా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు.. ఆయా ఫార్మాట్లలో 339, 189 పరుగులు చేశాడు.ఒకే ఒక్క టీ20 ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక గత వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీని ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో ఈసారి వేలానికి ముందే రిలీజ్ చేసింది. ఇక ఐపీఎల్ కెరీర్లో పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్లు ఆడి 1892 రన్స్ సాధించాడు.చదవండి: ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా! కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. -
‘అతడిని లారా, సచిన్ అన్నారు.. ఒక్కరు కన్నెత్తి చూడలేదు.. తగిన శాస్తే’
‘‘అతడొక అద్భుతమైన పిల్లాడు. కానీ తనని అందరూ అపార్థం చేసుకునేందుకు అన్ని విధాలా ఆస్కారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి కుదుపు ఒకటి అవసరం. షాక్ తగలాల్సిందే. అతడు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్ అని కితాబులు అందుకుంటూ పెరిగాడు.ప్రపంచంలో సచిన్, కోహ్లి తర్వాత ఎంఆర్ఎఫ్ బ్యాట్ను సొంతం చేసుకున్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. కొంతమంది అతడిని లారా అన్నారు. మరికొందరేమో మరో సచిన్ అని కీర్తించారు. ముంబై క్రికెట్ మొత్తం అతడి గురించే మాట్లాడేది. సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలను ముంబై అందించింది.అతడు కూడా వారి స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఇలా జరగాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో అతడికి కాంట్రాక్టు ఉండేది. కానీ ఇప్పుడు అసలు తన పేరే ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలిఇప్పటికైనా పృథ్వీ కఠినంగా శ్రమించి.. మునుపటి కంటే గొప్పగా తిరిగి రావాలని పార్థ్ జిందాల్ ఆకాంక్షించాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని అతడిని ఉద్దేశించి ఇండియా టుడేతో స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అయితే, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా క్రమక్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ల రాకతో ఓపెనర్గా మళ్లీ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. ఐపీఎల్లోనూ మంచి ఆరంభమే అందుకున్నా.. ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోని దుస్థితికి చేరుకున్నాడు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షా రూ. 75 లక్షలకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ఆరంభం నుంచి అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ కూడా పృథ్వీని మొత్తానికే వదిలించుకుంది.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమిముంబై క్రికెట్ జట్టులోనూ పృథ్వీ షాకు సుస్థిర స్థానం లేదు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తుండగా.. పార్థ్ జిందాల్ పైవిధంగా స్పందించాడు. కాగా 2018లో ఐపీఎల్లో ఢిల్లీ తరఫున అడుగుపెట్టిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్లు ఆడి 1892 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2024లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడి సేవల కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. కానీ పూర్తిగా నిరాశపరచడంతో వేలానికి ముందు విడిచిపెట్టింది.చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో అత్యంత చెత్త రికార్డుతో శార్దూల్!.. రహానే దంచికొట్టినా.. -
'ఏమి తప్పుచేశానో అర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది'
టీమిండియా తరుపున అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకరు. తొలుత అతడి ఆట తీరును చూసి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పోల్చారు. కానీ ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యం, ఫిట్నెస్ ఫామ్ లేమి కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు. క్రమంగా తన ఫిట్నెస్ను కూడా కోల్పోయిన పృథ్వీ షా ముంబై రంజీ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఈ ముంబై ప్లేయర్ కోల్పోయాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ పృథ్వీ షాను ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన షా.. అప్పటి నుంచి గత సీజన్ వరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో పృథ్వీ షాను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోల్స్పై పృథ్వీ షా మాట్లాడిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియా ఒకటి వైరలవుతోంది. తన కెరీర్ ఆసాంతం ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు షా చెప్పుకొచ్చాడు.ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఫాలో కాకపోతే.. నన్ను మీరేలా ఎలా ట్రోల్ చేస్తారు? అంటే అతడి కళ్లన్నీ నా మీదే ఉన్నాయని ఆర్దం. ట్రోలింగ్ చేయడం మంచిది కాదు, కానీ అది అంత చెడ్డ విషయం కూడా కాదు. అయితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి వారిని టార్గెట్ చేయడం మంచిది కాదు. క్రికెటర్లతో పాటు ఇతర వ్యక్తులను ట్రోల్ చేయడం నేను చాలా సందర్బాల్లో చూశాను. నాపై చేస్తున్న ట్రోలింగ్లు, మీమ్లు అన్నీ చూస్తున్నాను. అటువంటి చూసి నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి.నేను బయట కన్పిస్తే చాలు ప్రాక్టీస్ చేయకుండా తిరుగుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. నా పుట్టిన రోజున కూడా నేను బయటకు వెళ్లకూడదా? నేను ఏమి తప్పుచేశానో కూడా నాకే అర్ధం కావడం లేదు. కానీ మనం ఏమి చేసినా తప్పుబట్టేవాళ్లు ఉంటారని మాత్రం ఆర్ధం చేసుకున్నా అని ఆ వీడియోలో పృథ్వీ షా పేర్కొన్నాడు.చదవండి: ICC Rankings: సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్కు ఒక్క అడుగు దూరంలో -
'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు'
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షాకు తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి అడుగుపెట్టిన పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ముంబై ఓపెనర్.. అప్పటి నుంచి ఆ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. కానీ ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు షాను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని కనీసం వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందని భావించారు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.అందుకు కారణాలు లేకపోలేవు. పృథ్వీ షా ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా అతడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ కారణాల చేతనే షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదని జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కనీస ధరకు కూడా వేలంలో అమ్ముడుపోనుందన పృథ్వీ సిగ్గుపడాలంటూ కైఫ్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.పృథ్వీ సిగ్గు పడాలి: కైఫ్"ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పృథ్వీ షాకు చాలా సపోర్ట్ చేసింది. అతడు పవర్ ప్లేలో అద్బుతంగా ఆడుతాడని, ఒకే ఓవర్లో 6 బౌండరీలు కొట్టగలిగే సత్తా ఉందని ఢిల్లీ నమ్మింది. కొన్ని సీజన్లలో ఢిల్లీ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.ఢిల్లీ ఫ్రాంచైజీ ఆశించినట్టే ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టి చూపించాడు. అతడికి చాలా అతడు బాగా ఆడితేనే మేము గెలుస్తామని భావించేవాళ్లం. కాబట్టి అతడికి ప్రతీ మ్యాచ్లోనూ అవకాశం ఇచ్చాము. కొన్ని సార్లు వరుసగా విఫలమైనా కూడా మేము సపోర్ట్ చేస్తూనే వచ్చాం. మ్యాచ్కు ముందు రోజు రాత్రి అతడికి జట్టులో అవకాశమివ్వకూడదని చాలా సందర్భాల్లో నిర్ణయించుకున్నాం.కానీ ఆ తర్వాత మ్యాచ్ రోజున మా మా నిర్ణయాన్ని మార్చుకుని అతడికి ఛాన్స్ ఇచ్చేవాళ్లం. ఎందుకంటే అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడితే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉండేది. కానీ అతడు మాత్రం తనకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు.దీంతో అతడిని ఢిల్లీ కూడా విడిచిపెట్టింది. కనీస ధర 75 లక్షలతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడుపోకపోవడం నిజంగా సిగ్గుచేటు. పృథ్వీ షా తిరిగి వెనక్కి వెళ్లి బేసిక్స్ నేర్చుకోవాలి అంటూ జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్గా అతడే!? -
IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్
‘‘ఢిల్లీ క్యాపిటల్స్తో నా ప్రయాణం ఒక అద్భుతం. మైదానంలో ఎన్నెన్నో ఉత్కంఠభరిత క్షణాలు.. మరెన్నో మధుర జ్ఞాపకాలు. ఓ టీనేజర్గా ఇక్కడికి వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్తో కలిసి ఈ తొమ్మిదేళ్లలో నేనూ ఎంతో ఎత్తుకు ఎదిగాను. నేనిది ఎన్నడూ ఊహించలేదు.నా ప్రయాణం ఇంత ప్రత్యేకంగా మారడానికి ప్రధాన కారణం అభిమానులు. నన్ను అక్కున చేర్చుకున్నారు. నా జీవితంలోని కఠిన సమయంలో నాకు అండగా నిలబడ్డారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను.అయితే, నాపై మీకున్న ప్రేమాభిమానాలను బరువైన హృదయంతో మోసుకెళ్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నా ఆటతో మీకు వినోదం అందిస్తాను. నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు.. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మలిచినందుకు ధన్యవాదాలు.. ఏదేమైనా వీడ్కోలు చెప్పడం అంత సులువేమీ కాదు’’ అంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.వీడలేక వీడిపోతున్నట్లు..ఢిల్లీ క్యాపిటల్స్ను వీడలేక వీడిపోతున్నట్లు తన మనసులో ఉన్న మాటలను లేఖ రూపంలో వెల్లడించాడు. కాగా ఐపీఎల్- 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ పంత్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఆది నుంచి ఆసక్తి చూపింది.అయితే, పంత్ ధర రూ. 20 కోట్లకు చేరుకున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవాలని చూసింది. కానీ లక్నో మాత్రం వెనక్కి తగ్గలేదు. అమాంతం ఏడు కోట్లు పెంచి మొత్తంగా రూ. 27 కోట్లకు రిషబ్ పంత్ను తమ సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు.ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధంకాగా పంత్కు ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2016లో ఢిల్లీ జట్టుతో తన ఐపీఎల్ జర్నీ ఆరంభించిన పంత్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. 2017లో 366 పరుగులు మాత్రమే చేసిన అతడు.. 2018లో మాత్రం దుమ్ములేపాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 684 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు ఫిప్టీలు ఉండటం విశేషం.ఇక 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు. ఆ సమయంలోనూ అభిమానులతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ అతడికి అండగా ఉంది. అయితే, వేలానికి ముందు అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీతో పంత్ బంధం ముగిసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చి పంత్ 13 ఇన్నింగ్స్లో కలిపి 446 పరుగులు చేశాడు. కెప్టెన్గా జట్టును ఆరో స్థానంలో నిలపగలిగాడు.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి! -
పదమూడు కాదు.. పదిహేను!.. రూ. 1.10 కోట్లు.. మాకేం భయం లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అమ్ముడుపోయిన క్రికెటర్గా రికార్డుకెక్కాడు వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు అతడి పేరే హాట్ టాపిక్. అయితే, కొంతమంది వైభవ్ నైపుణ్యాలను ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం వయసు విషయంలో అతడు అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డవైభవ్ సూర్యవంశీ పదమూడేళ్ల పిల్లాడు కాదని.. అతడి వయసు పదిహేనేళ్లు అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు చిన్ననాటి నుంచే ఎంతో కఠిన శ్రమకోరుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన విజయం వల్ల బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డ అయిపోయాడు.ఎనిమిదేళ్ల వయసులోనే అతడు అండర్-16 డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో పాల్గొన్నాడు. క్రికెట్ కోచింగ్ కోసం నేను తనని రోజూ సమస్తిపూర్ వరకు తీసుకువెళ్లి.. తిరిగి తీసుకువచ్చేవాడిని. వైభవ్ను క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు మేమెంతగా కష్టపడ్డామో ఎవరికీ తెలియదు.మాకు ఏ భయమూ లేదుఆర్థిక ఇబ్బందుల వల్ల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నా కుమారుడు ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్ టెస్టు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే అతడు ఇండియా అండర్-19 జట్టుకు ఆడుతున్నాడు. మాకు ఏ భయమూ లేదు. కావాలంటే మరోసారి వైభవ్ ఏజ్ టెస్టుకు వెళ్తాడు’’ అని ఆరోపణలు చేస్తున్న వారికి సంజీవ్ సూర్యవంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు.కాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల 243 రోజులు. ఇక రూ. 30 లక్షల కనీస ధరతో అతడు తన పేరును ఐపీఎల్-2025 మెగా వేలంలో నమోదు చేసుకున్నాడు. ఆక్షన్లో వైభవ్ కోసం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా.. రాజస్తాన్ ఏకంగా రూ. కోటీ పది లక్షల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది.ఒకే ఓవర్లో 17 పరుగులు ఈ విషయం గురించి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ‘‘నాగపూర్లో ట్రయల్స్ సమయంలో వైభవ్ను రమ్మని రాజస్తాన్ రాయల్స్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ సర్ నా కుమారుడిని టెస్టు చేశారు. ఒకే ఓవర్లో అతడు 17 పరుగులు చేశాడు. ట్రయల్స్లో మొత్తంగా ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు’’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: Gautam Gambhir: ఆసీస్తో రెండో టెస్ట్కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్ Vaibhav Suryavanshi, all of 13 years old, entering the IPL! 💗😂 pic.twitter.com/ffkH73LUeG— Rajasthan Royals (@rajasthanroyals) November 25, 2024 View this post on Instagram A post shared by Vaibhav Suryavanshi (@vaibhav.suryavanshi_25) -
IPL 2025: కేఎల్ రాహుల్కు భారీ షాక్..
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు షాక్ తగిలింది. భారీ ధరకు అమ్ముడుపోతాడనుకున్న రాహుల్ను నామమాత్రపు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ. 14 కోట్లకు రాహుల్ను ఢిల్లీ సొంతం చేసుకుంది.రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వచ్చిన రాహుల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్, కోల్కతా నైట్రైడర్స్ పోటీ పడ్డాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆర్సీబీ, కేకేఆర్ వెనక్కి తగ్గాయి. అయితే ఆఖరికి సీఎస్కే కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ ఢిల్లీ సొంతమయ్యాడు. అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పగ్గాలను అప్పగించే అవకాశముంది. కాగా ఈ వేలంలో ఆర్సీబీ రాహుల్ను కొనుగోలు చేస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ వేలంలో మాత్రం అతడికి కోసం ఆర్సీబీ ప్రయత్నించలేదు.కాగా ఐపీఎల్-2022 నుంచి 2024 వరకు రాహుల్ లక్నో కెప్టెన్గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్చేర్చాడు. కానీ అతడిని ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు లక్నో రిటైన్ చేసుకోలేదు. అందుకు జట్టు యాజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాలే కారణమని వార్తలు వినిపించాయి.కాగా ఐపీఎల్లో రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 132 మ్యాచ్లు ఆడిన రాహుల్.. 45.47 సగటుతో 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Yuzvendra Chahal: వేలంలో చహల్కు కళ్లు చెదిరే ధర.. జాక్పాట్ కొట్టేశాడు -
నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.క్లారిటీ ఇచ్చిన పంత్..అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్బుతంగా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఢిల్లీ మేనెజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్లో రిషబ్ పోస్ట్ చేశాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాప్లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్కోచ్గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్దే పైచేయి.. ఆసీస్కు మరోసారి సవాల్? The curious case of Rishabh Pant & Delhi! 🧐🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96— Star Sports (@StarSportsIndia) November 19, 2024 -
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్పై నిషేధం.. -
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. మునాఫ్ వచ్చే సీజన్ నుంచి హెడ్ కోచ్ హేమంగ్ బదాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేస్తాడు. మునాఫ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా జేమ్స్ హోప్స్ పని చేశాడు. ఢిల్లీ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించింది. పాంటింగ్తో పాటు హోప్స్ తదితరులు తమ పదవులు కోల్పోయారు. పాంటింగ్, సౌరవ్ గంగూలీ స్థానాల్లో హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా బాధ్యతలు చేపట్టారు. సపోర్టింగ్ స్టాఫ్కు ఎంపిక చేసుకునే బాధ్యతను ఢిల్లీ యాజమాన్యం హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్కే వదిలేసింది. ఈ క్రమంలో బదాని, వేణు మునాఫ్ను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసుకున్నారు.41 ఏళ్ల మునాఫ్ పటేల్ 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మునాఫ్ 2008-17 మధ్యలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీల తరఫున 63 మ్యాచ్లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ టీమిండియా తరఫున 2006-2011 మధ్యలో మూడు ఫార్మాట్లలో కలిపి 86 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 125 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
WPL 2025: రిటైన్ చేసుకున్న భారత్ ప్లేయర్లు వీరే
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలానికి ముందు ఐదు జట్లు కూడా తమ ప్రధాన ప్లేయర్లను అట్టి పెట్టుకున్నాయి. భారత స్టార్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్లతో పాటు మెగ్ లానింగ్, మరిజాన్ కాప్, అమెలియా కెర్, అనాబెల్ సదర్లాండ్లను కూడా ఆయా టీమ్లు అట్టి పెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ వేలం డిసెంబర్ నెల మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ప్లేయర్లను తీసుకోవడం కోసం లీగ్ టీమ్లకు గత సీజన్లో గరిష్టంగా రూ.13 కోట్ల 50 లక్షల పరిధి విధించగా... ఇప్పుడు మరో కోటిన్నర పెంచి దానిని రూ. 15 కోట్లు చేశారు. ఒక్కో టీమ్లో 18 మంది చొప్పున మొత్తం 90 మందికి డబ్ల్యూపీఎల్లో అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం 71 మందిని టీమ్లు రీటెయిన్ చేసుకున్నాయి. దాంతో 19 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. టీమ్లు వదిలేసుకున్న ఆటగాళ్లలో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, తహుహు, క్యాథరీన్ బ్రైస్, వేద కృష్ణమూర్తి, హీతర్ నైట్, ఇసీ వాంగ్, హైదరాబాద్ ప్లేయర్ చొప్పదండి యషశ్రీ ఉన్నారు. రీటెయిన్ చేసుకున్న భారత ప్లేయర్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా, షఫాలీ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి (హైదరాబాద్), శిఖా పాండే, తానియా భాటియా, మిన్ను మణి, స్నేహ దీప్తి (ఆంధ్రప్రదేశ్), టిటాస్ సాధు. గుజరాత్ జెయింట్స్: హేమలత, తనూజ, షబ్నమ్ షకీల్ (ఆంధ్రప్రదేశ్), ప్రియా మిశ్రా, త్రిష పూజిత, మన్నత్, మేఘనా సింగ్. ముంబై ఇండియన్స్: హర్మన్ప్రీత్, అమన్దీప్, అమన్జోత్, జింతిమణి, కీర్తన, పూజ వస్త్రకర్, సజన, సైకా ఇషాఖ్, యస్తిక భాటియా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్), శ్రేయాంక పాటిల్, ఆశ శోభన, రేణుకా సింగ్, ఏక్తా బిస్త్, కనిక. యూపీ వారియర్స్: కిరణ్ నవ్గిరే, శ్వేత సెహ్రావత్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), గౌహర్ సుల్తానా (హైదరాబాద్), ఉమా ఛెత్రి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ ఖెమ్నార్, వృంద దినేశ్. -
ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్కు రూ. 50 కోట్లు!?
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైన విషయం విధితమే. అయితే ఈ మ్యాచ్లో భారత ఓటమి చవిచూసినప్పటకి.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన విరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న విలవిల్లాడిన చోట రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారత్ డగౌట్లో ఆశలు రేకెత్తించాడు. కానీ అనూహ్యంగా పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్లో 57 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 1 సిక్సర్తో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ సిరీస్ అసాంతం పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 89.38 స్ట్రైక్ రేటుతో పంత్ 261 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్ను బాసిత్ అలీ మెచ్చుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోతాడని అలీ జోస్యం చెప్పాడు.రూ. 50 కోట్లు ఇవ్వాలి.."రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్పై మిగితా ప్లేయర్లంతా ఇబ్బంది పడితే పంత్ ఒక్కడే ప్రత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేశాడు. అతడు ప్లాట్ పిచ్పై ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడి షాట్ సెలక్షన్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే.అతడు ఎటువైపు ఆడాలనుకుంటే ఆటువైపు ఈజీగా షాట్లు ఆడాడు. మిగితా ఆటగాళ్లు పంత్లా ఆడలేకపోయారు. రిషబ్ తొలి ఇన్నింగ్స్లో 60, రెండో ఇన్నింగ్స్లో 64 పరుగులు చేశాడు. అతడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు. పంత్ రూ.25 కోట్లకు అమ్ముడుపోతాడని అంతా అనుకుంటున్నారు.కానీ నావరకు అయితే పంత్కు రూ. 50 కోట్లు ఇచ్చి తీసుకున్నా తప్పులేదు అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్కు ముందు రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్లను మాత్రమే ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అయితే పంత్ను వేలంలోకి విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు తమ కొత్త కెప్టెన్ను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్కతా నైట్రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అయ్యర్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని జీఎంఆర్( (GMR) గ్రూప్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.మళ్లీ సొంతగూటికి?కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయ్యర్ 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్డేవిల్స్ అతడిని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్-2021 వరకు ఢిల్లీ ఆధారిత ఫ్రాంచైజీకే అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్గా కూడా శ్రేయస్ వ్యవహరించాడు. ఐపీఎల్-2020లో అయ్యర్ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్కు చేరింది. ఆ తర్వాత అయ్యర్ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్-2022 సీజన్ ముందు విడిచిపెట్టింది. ఈ క్రమంలో అయ్యర్ స్ధానంలోనే తమ రెగ్యూలర్ కెప్టెన్గా రిషబ్ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు మళ్లీ రివర్స్గా రిషబ్ను విడిచిపెట్టి అయ్యర్ను తమ సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఢిల్లీ పర్స్లో ప్రస్తుతం రూ.73 కోట్లు ఉన్నాయి. వేలంలో ఈ భారీ మొత్తాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ఖర్చుచేయనుంది.చదవండి: IND vs NZ: నా బౌలింగ్లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో -
IPL 2025: రిషభ్ పంత్ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ రిటెన్షన్కు సంబంధించి సంచలన మార్పు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి వచ్చింది. భారత వికెట్ కీపర్, హిట్టర్ రిషభ్ పంత్ను క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఐపీఎల్-2025లో క్యాపిటల్స్ యాజమాన్య ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్ గ్రూప్ టీమ్ నిర్వహణా బాధ్యతలు చూస్తుంది. జీఎంఆర్ ప్రతినిధులతో పలు అంశాల్లో పంత్ విభేదించడమే అందుకు కారణమని తెలిసింది. కోచ్ ఎంపికతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కూడా పంత్ పట్టుబట్టినట్లు... గత నెల రోజులుగా దీనిపై తీవ్ర చర్చలు జరిగిన తర్వాత పంత్ డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. ఆ నలుగురు జట్టుతోనేదాంతో తమ స్టార్ ఆటగాడినే వదులుకునేందుకు క్యాపిటల్స్ యాజమాన్యం సిద్ధమైంది. 2016 నుంచి 2024 సీజన్ వరకు ఢిల్లీ జట్టుతో ఉన్న పంత్... 111 మ్యాచ్లలో 148.93 స్ట్రయిక్ రేట్తో 3,284 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సారథిగా వ్యవహరించి జట్టును పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిపాడు. కాగా ఢిల్లీ ఈసారి నలుగురు ఆటగాళ్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్లను ఢిల్లీ అట్టి పెట్టుకుంది. ఏదేమైనా.. వేలంలో పంత్కు భారీ డిమాండ్ ఉండటం మాత్రం ఖాయం. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్గా రాణించాడు. వికెట్ కీపర్గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
దాదా స్థానంలోకి అతడు.. గంగూలీకి ‘కొత్త’ బాధ్యతలు!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జేఎస్డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమితుడయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), వుమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో పాటు దక్షిణాఫ్రికా లీగ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ‘దాదా’ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కొనసాగనున్నాడు.ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు జేఎస్డబ్ల్యూతో పాటు జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండగా... దక్షిణాఫ్రికా లీగ్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంతంగానే జట్టును కొనుగోలు చేసుకుంది. కాగా జేఎస్డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ ఆపరేషన్స్ జీఎంఆర్ పర్యవేక్షించనుండగా.. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ డబ్ల్యూపీఎల్ వ్యవహారాలు చూసుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి గురువారమే మరో కీలక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్ర మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఎంపిక చేసింది.గత సీజన్ వరకు సౌరవ్ గంగూలీ ఈ బాధ్యతలు నిర్వర్తించగా... ‘దాదా’ స్థానంలో ఇప్పుడు జట్టు యాజమాన్యం వేణుగోపాల రావును నియమించింది. ఏడేళ్లుగా ఢిల్లీ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన పాంటింగ్ను ఇటీవల తొలగించిన క్యాపిటల్స్ ... అతడి స్థానంలో భారత మాజీ ప్లేయర్ హేమంగ్ బదానీని కొత్త కోచ్గా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తోంది.ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు జాతీయ జట్టు తరఫున 16 వన్డేలు ఆడాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో సభ్యుడైన వేణుగోపాలరావు... గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున మూడు సీజన్లు ఆడాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్గానూ వ్యవహరించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చాన్నాళ్లుగా కొనసాగుతున్నా. నా మీద నమ్మకంతో డైరెక్టర్ ఆప్ క్రికెట్ బాధ్యతలు అప్పగించింనందుకు ధన్యవాదాలు. కొత్త సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని వేణు పేర్కొన్నాడు.మరోవైపు 47 ఏళ్ల బదానీ జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. అతడికి కోచింగ్లో అపార అనుభవం ఉంది. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన బదానీ, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో జాఫ్నా కింగ్స్ జట్టుకు కోచ్గా రెండు టైటిల్స్ అందించాడు. దక్షిణాఫ్రికా లీగ్లో సన్రైజర్స్ ఈ్రస్టెన్ కేప్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గానూ వ్యవహరించాడు. ఇటీవల ఐఎల్టి20లో దుబాయ్ క్యాపిటల్స్కు శిక్షకుడిగా పనిచేశాడు.‘ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్గా ఎంపికవడం ఆనందంగా ఉంది. నాపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజు్ఞడిని. మేగా వేలానికి ముందు కోచింగ్ బృందాన్ని సమన్వయ పరుచుకొని అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తా. క్యాపిటల్స్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని బదానీ అన్నాడు. ‘ఆటపై అపార అనుభవం ఉన్న బదానీ, వేణుగోపాలరావు ఢిల్లీ జట్టుతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కొత్త పాత్రలను వారు సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకముంది’అని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ బ్యాటింగ్ కోచ్గానూ నియమితుడు కావడం గమనార్హం.పాంటింగ్, గంగూలీకి బైబైహెడ్కోచ్గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
రిషబ్ పంత్కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి పంత్ను తప్పించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు తమ జట్టు పగ్గాల అప్పగించాలని సదరు ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్షర్ గత కొన్ని సీజన్లగా ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ప్రతీ సీజన్లోనూ అక్షర్ తన మార్క్ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లోనూ అక్షర్ పటేల్ అదరగొట్టాడు.14 మ్యాచ్లు ఆడి 11 వికెట్లతో పాటు 235 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ కెప్టెన్గా నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ ఫిక్స్ అయినట్లు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ను మాత్రం తమ టాప్ రిటెన్షన్ ప్లేయర్గా అంటిపెట్టుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడిని రూ. 18 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ సిద్దంగా ఉందంట. పంత్తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ను ఢిల్లీ రిటైన్ చేసుకున్నట్లు వినికిడి.ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ న్యూ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. పంత్ను ఢిల్లీ టాప్ రిటెన్షన్గా అంటిపెట్టుకోనుంది. అతడి కెప్టెన్సీ ఒత్తడి లేకుండా పూర్తిగా తన ఆటపై దృష్టిపెడతాడని మెనెజ్మెంట్ భావిస్తోంది అని ఐపీఎల్ మూలాలు వెల్లడించాయి.చదవండి: IPL 2025: డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం.. ఎస్ఆర్హెచ్కు గుడ్ బై -
రిషబ్ పంత్కు ఢిల్లీ షాక్ ఇవ్వనుందా? ట్వీట్ వైరల్
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ను విడిచిపెట్టనుందా? చెన్నైసూపర్ కింగ్స్కు పంత్ వెళ్లనున్నాడా? అంటే అవుననే సమాధనామే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా రిషబ్ పంత్ చేసిన ట్వీట్ కూడా ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధరకు అమ్ముడు పోతాను? అంటూ రిషబ్ ఎక్స్లోక్రిప్టిక్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఈ క్రమంలో కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడనున్నాడని అభిప్రాయపడుతుంటే, మరి కొంత మంది అతడు ఏదో ఫన్నీగా పోస్ట్ చేసి ఉంటాడని చెప్పుకొస్తున్నారు.ఢిల్లీ విడిచిపెట్టనుందా?కాగా ఢిల్లీ క్యాపిటల్స్కు కీలకమైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఇటువంటి అద్భుత ఆటగాడిని ఢిల్లీ విడిచిపెట్టే సాహాసోపేత నిర్ణయం తీసకుంటుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే భారీ ధర పలకడం ఖాయం. -
IPL 2025: పంత్ ఏ జట్టుకు ఆడనున్నాడో తెలిసిపోయింది!
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఏ జట్టుకు ఆడనున్నాడో తెలిసిపోయింది. వచ్చే ఏడాది కూడా అతడు ఢిల్లీ క్యాపిటల్స్కే ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తమ జట్టులోని ఇతర ఆటగాళ్ల గురించి కూడా ప్రస్తావించాడు.త్వరలోనే ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే రిటెన్షన్ పాలసీకి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసింది. ఫ్రాంఛైజీల పర్సు వాల్యూను 120 కోట్ల రూపాయలకు పెంచడంతో పాటు రైట్ టు మ్యాచ్ ఆప్షన్ను తిరిగి ప్రవేశపెట్టింది.రిషభ్ పంత్ను కచ్చితంగా రిటైన్ చేసుకుంటాంఈసారి.. ఒక ఫ్రాంఛైజీ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్థ్ జిందాల్ తాజాగా హర్యానాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిబంధనలకు అనుగుణంగా మేము ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలి. సహ యజమాని జీఎంఆర్ గ్రూపుతో పాటు మా క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.మా జట్టులో చాలా మంది అద్భుతంగా ఆడతారు. రిషభ్ పంత్ను మాత్రం కచ్చితంగా రిటైన్ చేసుకుంటాం. అక్షర్ పటేల్ కూడా గొప్ప నైపుణ్యాలున్న క్రికెటర్. అలాగే ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.. అంతా బాగా ఆడతారు. అయితే, వేలం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వీలుంది. అందరితో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నాడు. కాగా 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్.. ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టాడు.వికెట్ కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకోవడంతో పాటు.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ సీజన్లో 446 పరుగులు సాధించాడు. అయితే, జట్టును టాప్-4లో నిలపలేకపోయాడు. దీంతో సారథిగా మాత్రం విఫలమయ్యాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు. కాగా ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగింట ఏడు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కాగా పంత్ వచ్చే సీజన్లో ఆర్సీబీ లేదంటే సీఎస్కేకు ఆడతాడనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ -
ఇంగ్లండ్ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసుకుంది. కౌంటీ జట్టు హాంప్షైర్ క్లబ్లో 53 శాతం వాటా కొనుగోలు చేసినట్లు సోమవారం జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుదీంతో కౌంటీ జట్లలో విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుగా హాంప్షైర్ నిలిచింది. ప్రస్తుతానికి సగానికి పైగా వాటా కొనుగోలు చేసుకున్న జీఎంఆర్ గ్రూప్... వచ్చే రెండేళ్లలో హాంప్షైర్ జట్టును పూర్తిగా హస్తగతం చేసుకోనుంది. ప్రస్తుతం హాంప్షైర్ క్లబ్కు జీఎంఆర్ గ్రూప్ రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం.వచ్చే 24 నెలల్లో పూర్తి యాజమాన్య హక్కులు‘హాంప్షైర్ క్లబ్ యజమాని, జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే 24 నెలల్లో క్లబ్ పూర్తి యాజమాన్య హక్కులు జీఎంఆర్ గ్రూప్కు బదిలీ అవుతాయి’ అని సోమవారం హాంప్షైర్ క్లబ్ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యువతరంతో సంబంధాలు కొనసాగిస్తూ... నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు హాంప్షైర్ జట్టును కొనుగోలు చేసినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ తెలిపారు.మా లక్ష్యం అదే‘భారత్తో పాటు దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. యువతరం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. యువతను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. క్రీడలను సంస్కృతిలో భాగం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్ ప్రపంచ చాంపియన్లను సృష్టించడంపై దృష్టి పెడతాం’ అని కిరణ్ కుమార్ అన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్లో 50 శాతా వాటా ఉన్న జీఎంఆర్ గ్రూప్నకు ఐఎల్టి20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్, ఎస్ఎ20లో ప్రిటోరియా క్యాపిటల్స్లో కూడా వాటా ఉంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లోనూ జీఎంఆర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? -
మీ ఇంగితానికే వదిలేస్తున్నా: రిషభ్ పంత్ ఆగ్రహం
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్కు కోపమొచ్చింది. తన గురించి అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలని.. మరీ ఇంత చెత్తగా ఎలా తయ్యారంటూ గాసిప్ రాయుళ్లకు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడం దుర్మార్గమని పేర్కొన్నాడు.ఆర్సీబీని అడిగితే నో చెప్పిందిఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పంత్ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టాడు. ‘‘రిషభ్ పంత్ తన మేనేజర్ ద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని సంప్రదించాడు.అక్కడ కెప్టెన్సీ పదవి ఖాళీగా ఉంటే.. తనకు ఇవ్వమని కోరాడు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అతడి అభ్యర్థనను తిరస్కరించింది. విరాట్కు పంత్ అక్కడికి రావడం ఇష్టం లేదు.ఎందుకంటే.. భారత క్రికెట్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్లో మాదిరి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తాడని విరాట్ భయపడ్డాడు. ఆర్సీబీ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది’’ అని సదరు యూజర్ పేర్కొన్నారు. ఇందుకు పంత్ ఘాటుగా స్పందించాడు.మీ ఇంగితానికే అంతా వదిలేస్తా..‘‘నకిలీ వార్తలు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు. కాస్త పద్ధతిగా ప్రవర్తించండి గయ్స్. కారణం లేకుండా ఇలాంటివి రాసి.. ఎందుకు ప్రశాంతంగా ఉండేవాళ్ల మనసులను చెడగొడతారు.అయినా... ఇలాంటి వదంతులు ఇదే మొదటిసారి కాదు.. ఇదే ఆఖరూ కాదు. కానీ పరిస్థితి రోజురోజుకీ మరింత చెత్తగా మారుతోంది. ఇక మీ ఇంగితానికే అంతా వదిలేస్తా. ఇది కేవలం మీ ఒక్కరికే కాదు.. మీలా అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లందరికీ వర్తిస్తుంది’’ అని రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా చురకలు అంటించాడు.కాగా ఐపీఎల్లో పంత్ చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. రోడ్డు ప్రమాదం అనంతరం.. ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చిన.. ఈ లెఫ్టాండర్ 446 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన.. టెస్టులకు గుడ్బై Fake news . Why do you guys spread so much fake news on social media. Be sensible guys so bad . Don’t create untrustworthy environment for no reason. It’s not the first time and won’t be last but I had to put this out .please always re check with your so called sources. Everyday…— Rishabh Pant (@RishabhPant17) September 26, 2024 -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్గానూ రాణించాడు.పాంటింగ్తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్లో చేరాడు. దీంతో పాంటింగ్తో పాటు పంత్ కూడా పంజాబ్తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్తో కలిసి పంజాబ్ కింగ్స్లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
IPL 2025: కొత్త హెడ్కోచ్.. ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ను తమ జట్టు ప్రధాన కోచ్గా నియమించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది పాంటింగ్ పంజాబ్ కింగ్స్తో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల పాటు తమ జట్టుతో అతడు కొనసాగనున్నట్లు పేర్కొంది. అభిమానులకు ఇదే నా ప్రామిస్ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘హెడ్కోచ్గా నాకు అవకాశం ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జట్టు యజమానులతో చర్చలు ఫలవంతంగా ముగిశాయి. టీమ్ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. సుదీర్ఘకాలంగా జట్టుకు మద్దతుగా ఉన్న అభిమానులకు విజయంతో రుణం చెల్లించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇకపై సరికొత్త పంజాబ్ కింగ్స్ను చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా రిక్కీ పాంటింగ్ ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్గా పనిచేశాడు. 2018 నుంచి ఏడేళ్లపాటు ఢిల్లీ జట్టుకు సేవలు అందించాడు. ఢిల్లీతో తెగిన బంధం.. ఇకపై పంజాబ్తో ప్రయాణంఅయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా పాంటింగ్ మార్గదర్శనంలో ఢిల్లీకి పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్.. 2024 తర్వాత ఎట్టకేలకు పాంటింగ్తో బంధాన్ని తెంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ పాంటింగ్తో చర్చలు జరిపి తమ ప్రధాన కోచ్గా నియమించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. మరో ఆసీస్ మాజీ క్రికెటర్ ట్రెవర్ బైలిస్ స్థానాన్ని రిక్కీ పాంటింగ్తో భర్తీ చేసింది. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు మ్యాచ్లకు కేవలం ఐదు గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగింట ఏడు గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
గుజరాత్ కాదు.. ఆ జట్టు హెడ్ కోచ్గా యవరాజ్!?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఫ్రాంచైజీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఆటగాళ్లతో పాటు తమ కోచింగ్ స్టాప్లో కూడా మార్పులు దిశగా ఆయా ఫ్రాంచైజీలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్కోచ్ రికీ పాంటింగ్పై వేటు వేయగా.. గుజరాత్ టైటాన్స్ సైతం తమ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాను తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం.మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కూడా తమ హెడ్కోచ్గా ఉన్న కుమార సంగర్కరను తప్పించి రాహుల్ ద్రవిడ్కు కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్రవిడ్తో రాజస్తాన్ ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు వినికిడి.ఢిల్లీ హెడ్కోచ్గా యువరాజ్ సింగ్..?కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్గా భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ బాధ్యతలు చేపట్టున్నట్లు తెలుస్తోంది. రికీ పాంటింగ్ స్ధానంలో యువరాజ్ను నియమించాలని ఢిల్లీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యువీతో ఢిల్లీ క్యాపిటల్స్ చర్చలు మొదలు పెట్టినట్లు స్పోర్ట్స్టార్ తమ కథనంలో పేర్కొంది. అయితే యువీ నుంచి కానీ, ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. మొదటిలో గుజరాత్ టైటాన్స్గా ప్రధాన కోచ్గా యువరాజ్ సింగ్ వెళ్లనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ కూడా అతడిని తమ హెడ్కోచ్గా నియమించుకునేందుకు ఆసక్తిగా ఉందంట.కాగా యువీ ఇప్పటివరకు హెడ్కోచ్గా పనిచేయనప్పటకి.. చాలా మంది పంజాబ్ యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో యువరాజ్ది కీలకపాత్ర. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు యువరాజ్ గైడన్స్లో రాటుదేలిన వారే. -
IPL 2025: రోహిత్ శర్మకు రూ.50 కోట్లు..!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎవరని రీటైన్ చేసుకోవాలి, ఎవరని వేలంలో విడిచిపెట్టాలన్న అన్న అంశాలపై ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలు పెట్టాయి. అయితే ఈసారి మెగా వేలంలో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మపై కాసుల వర్షం కురువనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ విడిచిపెట్టనున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.అప్పటి నుంచి ముంబై ఫ్రాంచైజీ మెనెజ్మెంట్ రోహిత్ ఆసంతృప్తితో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ నుంచి బయటకు రావాలని హిట్మ్యాన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి.రూ. 50 కోట్లు అయినా ఓకే!ఇక రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఎలాగైనా అతడిని దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కాచుకొని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెవ్ స్పోర్ట్స్కు చెందిన రోహిత్ జుగ్లన్ విశ్లేషణ ప్రకారం.. వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ హిట్మ్యాన్ ఏకంగా రూ.50 కోట్లు దాచి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అతడికి తమ జట్టు పగ్గాలను అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు లక్నో ఫ్రాంచైజీ కూడా రోహిత్ కోసం రూ. 50 కోట్లు వెచ్చించడానికి సిద్దంగా ఉందంట. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో అతన్ని రూ. 24.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025 మెగా వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఛాన్స్ ఉంది. -
అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: సౌరవ్ గంగూలీ
ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భవితవ్యంపై అనేక ఊహగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో పంత్ను ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.వచ్చే ఏడాది సీజన్లో సీఎస్కే పంత్ ఆడనున్నాడని కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరక్టర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పంత్పై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని దాదా కొట్టి పారేశాడు. వచ్చే ఏడాది సీజన్లో పంత్ తమ జట్టులో ఉంటాడని, అతడే తమ కెప్టెన్గా కొనసాగుతాడని ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన దాదా స్పష్టం చేశాడు. కాగా దాదాపు 16 నెలల పాటు రోడ్డు ప్రమాదం కారణంగా క్రికెట్కు దూరమైన పంత్.. ఐపీఎల్ 2024తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన పంత్.. 446 పరుగులతో ఢిల్లీ తరపున టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ హెడ్కోచ్ రికీ పాంటింగ్పై వేటు వేసింది. క్రికెట్ డైరక్టర్గా ఉన్న గంగూలీనే హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. -
IPL 2025: రిషబ్ పంత్కు ఊహించని ఎదురు దెబ్బ.. !?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్కోచ్ రికీ పాంటింగ్పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు పంత్ను రిటైన్ చేసుకోడదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతడిని విడిచి పెట్టే అవకాశముందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లు పేర్కొంది.అదేవిధంగా పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే.. అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశముందని సదరు పత్రిక పేర్కొంది.సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని వచ్చే ఏడాది సీజన్లో ఆడుతాడాలేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని సీఎస్కే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ కెప్టెన్సీపై కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్కు రోడ్డు ప్రమాదం కారణంగా దూరంగా ఉన్న రిషబ్. . ఈ ఏడాది సీజన్తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రిషబ్.. ఐపీఎల్లో ఢిల్లీ తరపున లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
సౌరవ్ గంగూలీకి ఆశాభంగం..!
ఢిల్లీ క్యాపిటల్స్కు హెడ్ కోచ్ కావాలని ఆశపడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆశాభంగం ఎదురైంది. దాదాను హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్పకనే చెప్పింది. డీసీ.. గౌతమ్ గంభీర్ లాంటి ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తిని హెడ్ కోచ్గా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం ఇద్దరు ముగ్గురు వరల్డ్కప్ విన్నర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్నాడు. అలాగే అతను ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీలైన దుబాయ్ క్యాపిటల్స్ (ILT20), ప్రిటోరియా క్యాపిటల్స్ (SA20) మంచి చెడ్డలు కూడా చూస్తున్నాడు. ఇన్ని బాధ్యతలు మోస్తుండటంతో డీసీ యాజమాన్యం గంగూలీని హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఏడు సీజన్ల పాటు హెడ్ కోచ్గా వ్యవహరించిన పాంటింగ్ డీసీని ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలబెట్టలేకపోయాడు. ఇదే కారణంగా డీసీ మేనేజ్మెంట్ అతనిపై వేటు వేసింది. పాంటింగ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాక గంగూలీ ఈ పదవిపై ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. ఓ బెంగాలీ పేపర్ను ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.ఇదిలా ఉంటే, పాంటింగ్ ఆథ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒకే ఒక్కసారి (2020) ఫైనల్కు చేరింది. 2018 ఎడిషన్లో తొలిసారి పాంటింగ్ ఆథ్వర్యంలో బరిలోకి దిగిన డీసీ.. ఆ సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆతర్వాతి సీజన్లో (2019) మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. 2021 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. గడిచిన మూడు సీజన్లలో ఢిల్లీ 5, 9, 6 స్థానాల్లో నిలిచింది. -
రిక్కీ పాంటింగ్పై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటన! కొత్త కోచ్గా దాదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్తో తమ అనుబంధాన్ని తెంచుకుంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఏడేళ్లపాటు కొనసాగిన బంధానికి ఇక తెరపడిందంటూ.. రిక్కీ పాంటింగ్కు కృతజ్ఞతలు తెలియజేసింది. వేటు వేయడానికి కారణం అదే?కాగా 2018లో రిక్కీ పాంటింగ్ ఢిల్లీ క్యాంపులో చేరాడు. ప్యాటీ ఉప్టన్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఢిల్లీ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఏడేళ్లపాటు ప్రధాన కోచ్గా కొనసాగాడు. అయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా అతడి మార్గదర్శనంలో ఢిల్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. అయినప్పటికీ యాజమాన్యం పాంటింగ్పై నమ్మకం ఉంచింది.అయితే, వేలంలో పాల్గొనడం మినహా జట్టు కూర్పు తదితర అంశాలపై మరింతగా దృష్టి సారించాలని మేనేజ్మెంట్ కోరగా.. పాంటింగ్ నుంచి స్పందన కరువైందని సమాధానం. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి కేవలం రెండు వారాలు ముందే జట్టుతో చేరడం పట్ల యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అతడిని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక రిక్కీ పాంటింగ్ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించేందుకు ఢిల్లీ మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.కొత్త కోచ్గా దాదా?ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్గా ఉన్న దాదాను ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించాలని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీసీ సహ యజమానులైన జేఎస్డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపు పెద్దలు ఈ విషయమై వచ్చే నెలలో భేటీ అయి.. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అదే విధంగా.. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిషభ్ పంత్తో పాటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లను కొనసాగించేందుకు మేనేజ్మెంట్ సుముఖంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్After 7 seasons, Delhi Capitals has decided to part ways with Ricky Ponting. It's been a great journey, Coach! Thank you for everything 💙❤️ pic.twitter.com/dnIE5QY6ac— Delhi Capitals (@DelhiCapitals) July 13, 2024 -
బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
టీమిండియా హెడ్కోచ్ పదవిపై తనకు ఆసక్తి లేదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. తాను ఈ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా లేనని తెలిపాడు.ప్రధాన కోచ్గా ఉండాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి తనకు ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను సున్నితంగా తిరస్కరించినట్లు పాంటింగ్ వెల్లడించాడు. కాగా టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగియనున్న విషయం తెలిసిందే.వన్డే వరల్డ్కప్-2023 తర్వాతే ద్రవిడ్ పదవీకాలం ముగియగా.. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే వరకు జట్టుతో ఉండాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్.. మెగా ఈవెంట్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ ఇప్పటికే కొత్త హెడ్ కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. ఇందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్తో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై రిక్కీ పాంటింగ్ తాజాగా స్పందించాడు. ఐసీసీ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా హెడ్కోచ్ నియామకం గురించి చాలా వార్తలు చూస్తున్నా. నిజానికి మన కంటే ముందు మన గురించి సోషల్ మీడియా యూజర్లకే అన్ని వివరాలు తెలిసిపోతాయి(నవ్వుతూ)!అది ఎలాగో మనకైతే అర్థం కాదు. నాక్కూడా జాతీయ జట్టుకు సీనియర్ కోచ్గా ఉండాలనే ఉంది. అయితే, అంతకంటే ఎక్కువగా నా కుటుంబంతో సమయం గడపాలని ఉంది.టీమిండియా కోచ్గా ఉండాలంటే ఐపీఎల్ జట్లతో సంబంధాలు తెంచుకోవాలన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. హెడ్ కోచ్ అంటే ఏడాదిలో దాదాపు 10 -11 నెలల పాటు బిజీగా ఉంటాం.నా ప్రస్తుత జీవనశైలి అందుకు ఏమాత్రం సరితూగదు. ఇప్పుడు నేను నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నా. ఐపీఎల్ సమయంలో చర్చలు జరిగిన మాట వాస్తవమే.నాతో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్.. గౌతం గంభీర్.. ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, నేను మాత్రం ప్రస్తుతం ఈ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేను’’ అని రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసిన రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా ఉన్నాడు. -
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించి తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఢిల్లీకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించింది.ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖారారు చేసుకోవడంతో ఢిల్లీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఒక ఈ మ్యాచ్ జరిగి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలై ఉంటే మాథ్యమేటికల్గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో పంత్ సేన ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ ఏడింట విజయాలు, ఏడింట ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 5వ స్ధానంతో సరిపెట్టుకుంది. -
కేఎల్ రాహుల్ అవుటైనా సరే.. సంజీవ్ గోయెంక రియాక్షన్ వైరల్!
రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టాప్-4కు అర్హత సాధించి సత్తా చాటింది. కానీ ఐపీఎల్-2024లో మాత్రం ఈ ఫీట్ పునరావృతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో లక్నో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లక్నో.. మిగిలిన మ్యాచ్లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్ గోయెంక ఇచ్చిన రియాక్షన్స్ వైరల్గా మారాయి. కాగా గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లో కెప్టెన్గా, వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంక మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా కోపంతో ఊగిపోయాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విరివిగా చక్కర్లు కొట్టగా సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా స్టార్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు హితవు పలికారు.ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన సంజీవ్ గోయెంక ఢిల్లీతో మ్యాచ్కు ముందు రాహుల్ను తన ఇంటికి డిన్నర్కు పిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను బయటకు వదిలారు. తమ మధ్య అంతా బాగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు. Goenka smiling after KL Rahul's wicket pic.twitter.com/R0K4BVteSN— Div🦁 (@div_yumm) May 14, 2024 ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా కెమెరాలన్నీ సంజీవ్ గోయెంక వైపే దృష్టి సారించాయి. కేఎల్ రాహుల్ ఐదు పరుగులకే అవుటైనా గోయెంక చిన్నగా నవ్వులు చిందించాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. Sanjeev Goenka appreciating KL Rahul's catch. pic.twitter.com/pAeTqjcnTB— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024 అదే విధంగా.. షాయీ హోప్ ఇచ్చిన క్యాచ్ను రాహుల్ పట్టగానే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు. ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మైదానంలో కేఎల్ రాహుల్తో నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకురాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంతలో ఎంత మార్పు సార్.. మీరు సూపర్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ Ishant Sharma x Mukesh Kumar ⚡️⚡️The duo combine to dismiss the #LSG openers 👏👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/nuFD7AlK28— IndianPremierLeague (@IPL) May 14, 2024A clinical win at home to finish off their home season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/DroMjvb9bU— IndianPremierLeague (@IPL) May 15, 2024KL Rahul with Sanjiv Goenka at the special Dinner in Sanjiv Goenka's home last night in Delhi. [LSG] - All is well at LSG Camp. 🌟 pic.twitter.com/W5BtE0Qmff— Johns. (@CricCrazyJohns) May 14, 2024 -
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంటోంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ కూడా టాప్-4కు అర్హత సాధించింది.సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోను ఓడించడంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా ఎడిషన్లో 64వ మ్యాచ్ అయిన ఢిల్లీ- లక్నో పోరు తర్వాత సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.ఈసారి ఏకంగాక్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్గా 2024 నిలిచింది. ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు మొత్తంగా 1125 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 4, షాయీ హోప్ రెండు, ట్రిస్టన్ స్టబ్స్ 4 సిక్సర్లు బాదగా.. లక్నో ఆటగాళ్లలో నికోలసన్ పూరన్ 4, అర్షద్ ఖాన్ 5, యుద్వీర్ సింగ్ చరక్ ఒక సిక్సర్ కొట్టారు.కాగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారిన సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా సిక్స్ల వర్షం కురిపించింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు నమోదు చేసిన తొలి రెండు జట్లుగా సన్రైజర్స్, ఆర్సీబీ నిలవగా.. అనూహ్య రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానం ఆక్రమించింది.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు👉1125 సిక్సర్లు - 2024👉1124 సిక్సర్లు - 2023👉1062 సిక్సర్లు - 2022👉872 సిక్సర్లు- 2018👉784 సిక్సర్లు- 20192024లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు నమోదు చేసిన జట్లు👉సన్రైజర్స్ హైదరాబాద్- 12 మ్యాచ్లలో 146 సిక్స్లు👉ఆర్సీబీ- 13 మ్యాచ్లలో 141 సిక్స్లు👉ఢిల్లీ క్యాపిటల్స్- 14 మ్యాచ్లలో 135 సిక్స్లు👉కోల్కతా నైట్ రైడర్స్- 12 మ్యాచ్లలో 125 సిక్స్లు👉ముంబై ఇండియన్స్- 13 మ్యాచ్లలో 122 సిక్స్లు👉పంజాబ్ కింగ్స్- 12 మ్యాచ్లలో 102 సిక్స్లు👉రాజస్తాన్ రాయల్స్- 12 మ్యాచ్లలో 100 సిక్స్లు. Fearless striking from Arshad Khan 🔥He's not given up yet in this chase 💪Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/JxfdwBnG0t— IndianPremierLeague (@IPL) May 14, 2024 -
సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్గా ఈ సీజన్లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారుఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.సీజన్ మొత్తం మాకు అదే సమస్యనిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.స్టొయినిస్, పూరన్లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు👉వేదిక: అరుణ్జైట్లీ స్టేడియం.. ఢిల్లీ👉టాస్: లక్నో.. బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)👉లక్నో స్కోరు: 189/9 (20)👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK— IndianPremierLeague (@IPL) May 15, 2024 -
ఢిల్లీ ఆశలు పదిలం!
న్యూఢిల్లీ: సొంతగడ్డపై సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ లీగ్ దశను విజయంతో ముగించింది. ఈ గెలుపుతో సాంకేతికంగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నా... ఆ జట్టు ముందంజ వేయడం చాలా రకమైన ఇతర సమీకరణాలపై ఆధారపడి ఉంది. మరోవైపు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో మెరుగైన స్థితికి చేరే అవకాశం ఉన్నా కూడా లక్నో సూపర్ జెయింట్స్ దానిని చేజార్చుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 19 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిõÙక్ పొరేల్ (33 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా... షై హోప్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రిషభ్ పంత్ (23 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసి ఓడిపోయింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్లు), అర్షద్ ఖాన్ (33 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడుగా ఆడగా మిగతా వారంతా పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ–లక్నో మ్యాచ్ ఫలితంతో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే రాజస్తాన్ రాయల్స్ 16 పాయింట్లతో ‘ప్లే ఆఫ్స్’కు బెర్త్ను ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. కీలక భాగస్వామ్యం... తొలి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్ (0)ను అవుట్ చేసిన లక్నో ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పొరేల్, హోప్ కలిసి దూకుడుగా ఆడారు. అర్షద్ ఓవర్లో పొరేల్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టగా, యు«ద్వీర్ ఓవర్లో హోప్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్ప్లేలో ఢిల్లీ 73 పరుగులు చేసింది.21 బంతుల్లోనే పొరేల్ అర్ధసెంచరీ పూర్తి కాగా, ఈ జోడీ రెండో వికెట్కు 92 పరుగులు (49 బంతుల్లో) జోడించింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, పంత్ కొన్ని కీలక పరుగులు సాధించాడు. అయితే స్టబ్స్ ధాటైన బ్యాటింగ్ ఢిల్లీ స్కోరును 200 దాటించింది. అర్షద్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను, నవీన్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాది 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. పూరన్ మినహా... భారీ ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. పూరన్ మెరుపు బ్యాటింగ్ తప్ప ఇన్నింగ్స్లో ప్రధాన బ్యాటర్ ఒక్కరు కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయారు. పవర్ప్లే ముగిసేలోపే కేఎల్ రాహుల్ (5), డికాక్ (12), స్టొయినిస్ (5), హుడా (0) వెనుదిరగడం జట్టును బాగా దెబ్బ తీసింది. మరోవైపు అక్షర్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టిన పూరన్... ఇతర బౌలర్లపై కూడా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే లక్నోను విజయం దిశగా తీసుకెళ్లేందుకు ఇది సరిపోలేదు. విజయానికి 9 ఓవర్లలో 108 పరుగులు చేయాల్సిన స్థితిలో పూరన్ అవుట్ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది. చివర్లో అర్షద్ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి) నవీన్ (బి) అర్షద్ 0; పొరేల్ (సి) పూరన్ (బి) నవీన్ 58; హోప్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 38; పంత్ (సి) హుడా (బి) నవీన్ 33; స్టబ్స్ (నాటౌట్) 57; అక్షర్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–2, 2–94, 3–111, 4–158. బౌలింగ్: అర్షద్ 3–0–45–1, మొహసిన్ 4–0–29–0, యుధ్వీర్ 2–0–28–0, నవీన్ 4–0–51–2, బిష్ణోయ్ 4–0–26–1, కృనాల్ 2–0–20–0, హుడా 1–0–9–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ముకేశ్ (బి) ఇషాంత్ 12; రాహుల్ (సి) ముకేశ్ (బి) ఇషాంత్ 5; స్టొయినిస్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 5; హుడా (ఎల్బీ) (బి) ఇషాంత్ 0; పూరన్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 61; బదోని (సి) గుల్బదిన్ (బి) స్టబ్స్ 6; కృనాల్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీబ్ 18; అర్షద్ (నాటౌట్) 58; యుధ్వీర్ (సి) హోప్ (బి) ఖలీల్ 14; బిష్ణోయ్ (రనౌట్) 2; నవీన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–7, 2–24, 3–24, 4–44, 5–71, 6–101, 7–134, 8–167, 9–183. బౌలింగ్: ఇషాంత్ 4–0–34–3, ఖలీల్ 2–0–22–1, అక్షర్ 1–0–20–1, ముకేశ్ 4–0–33–1, కుల్దీప్ 4–0–33–1, స్టబ్స్ 1–0–4–1, గుల్బదిన్ 1–0–12–0, సలామ్ 3–0–30–0. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X పంజాబ్ వేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తాచాటింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్(38), కెప్టెన్ రిషబ్ పంత్(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చెలరేగిన ఇషాంత్..అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. లక్నో టెయిలాండర్ అర్షద్ ఖాన్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 7వ స్ధానంలో బ్యాటింగ్లో వచ్చిన అర్షద్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్ష్య చేధనలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్.. గెలుపు అంచుల దాకా తీసుకువచ్చాడు. 33 బంతులు ఎదుర్కొన్న అర్షద్.. 3 ఫోర్లు, 5 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(61) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు, ఖాలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, స్టబ్స్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. -
DC Vs LSG: చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్(38), కెప్టెన్ రిషబ్ పంత్(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. -
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ తొలిసారి నిరాశపరిచాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మెక్గుర్క్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్.. డైమండ్ డక్గా వెనుదిరిగాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్తో మెక్గుర్క్ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్షద్ ఖాన్ రెండో బంతిని లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ లాంగ్-ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే మెక్గుర్క్ లాంగ్-ఆన్ దిశగా ఆడుతాడని ముందు గానే పసిగట్టిన రాహుల్.. లాంగ్ ఆన్ ఫీల్డర్లో సెట్ చేశాడు. ఈ క్రమంలో లాంగ్ ఆన్లో ఉన్న నవీన్ ఉల్-హాక్ ఈజీ క్యాచ్ను అందుకున్నాడు.ఇది చూసిన రాహుల్ వెంటనే నేను చెప్పా కదా అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా మెక్గర్క్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన మెక్ గుర్క్.. 330 పరుగులు చేశాడు. -
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు పలు మార్పులతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగాయి. గత మ్యాచ్కు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. లక్నో జట్టులోకి పేసర్లు అర్షద్ ఖాన్, యుద్దవీర్, మోహ్షిన్ ఖాన్ వచ్చారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్లో లక్నో కచ్చితంగా విజయం సాధించాలి. మరోవైపు ఢిల్లీ తమ చివరి లీగ్ మ్యాచ్లో సత్తాచాటాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచిన ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాలి.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ : అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/ కెప్టెన్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్ -
RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములతో చతికిల పడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసి.. ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.ఇక ఈ మ్యాచ్లో47 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకవచ్చింది. కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. ఢిల్లీ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హైలైట్గా నిలిచారు. ఆర్సీబీ గెలుపు ఖరారు కాగానే.. ఆమె పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు.వావ్.. థాంక్ గాడ్!‘వావ్’ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా చేతులు జోడించి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇందుకు కోహ్లి కూడా తనదైన శైలిలో మజిల్స్ చూపిస్తూ బదులిచ్చాడు. కాగా ఓ యాడ్ సందర్భంగా అనుష్కను కలిసిన కోహ్లి ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు.ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించాడు. లండన్లో తన ప్రసవం తర్వాత ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అనుష్క.. ఇలా భర్తను చీర్ చేస్తూ ఆర్సీబీకి మద్దతుగా స్టేడియానికి వస్తున్నారు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 నాటౌట్.. ఒక వికెట్ (1/19)). Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Virat Kohli: నన్నే ఏడిపిస్తావా?.. ప్రతీకారం తీర్చుకున్న కోహ్లి!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ల ‘బ్రొమాన్స్’ హైలైట్గా నిలిచింది.కాగా చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఇక ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు.అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్లో మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లి.. ఇషాంత్ను టీజ్ చేశాడు. తదుపరి బంతికి స్లిప్లో ఫీల్డర్ను పెట్టు అంటూ ఆటపట్టించాడు. అంతేకాదు.. మరుసటి బాల్ను సిక్సర్గా మలిచాడు.దీంతో ఉడుక్కున్నా కామ్గా కనిపించిన ఇషాంత్.. నాలుగో బంతికి కోహ్లిని ఊరించగా.. అతడు బంతిని గాల్లోకి లేపాడు. అభిషేక్ పోరెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అతడు పెవిలియన్ చేరక తప్పలేదు.ఈ క్రమంలో తానే గెలిచానన్నట్లుగా ఇషాంత్ కోహ్లిని నవ్వుతూ కోహ్లి దగ్గరు వచ్చి.. ‘‘వెళ్లు వెళ్లు ’’ అన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా కోహ్లి కూడా నవ్వుతూ సరేలే అన్నట్లు మైదానాన్ని వీడాడు.వీళ్లిద్దరి ఫ్రెండ్లీ బ్యాంటర్కు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ‘‘పశ్చిమ ఢిల్లీ అబ్బాయిలు ఇదిగో ఇలా ఉంటారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాంత్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి ఇషాంత్ శర్మ దగ్గరికి వెళ్లి ‘సర్లే పదా ఇంకా’ అంటూ టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కోహ్లి- ఇషాంత్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్య వహించారు. ఇక టీమిండియాలో కోహ్లి కెప్టెన్సీలో ఇషాంత్ ఆడిన విషయం తెలిసిందే.Kohli man I love him 🤣❤pic.twitter.com/65HxtsIwta— POTT⁷⁶⁵ (@KlolZone) May 12, 2024Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 -
IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. పటిదార్ ఫటాఫట్... డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్లు), మహిపాల్ సిక్స్లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. అక్షర్ ఒక్కడే! లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0. -
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్..
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్కు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు."ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్లో మా జట్టు కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అతడు గత రెండు సీజన్ల నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకి వైస్-కెప్టెన్గా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కూడా చాలా అనుభవం ఉంది. గేమ్ను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసే అవకాశం రావడంతో అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము అతడి బ్యాన్పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాంటింగ్ పేర్కొన్నాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రిషబ్ పంత్పై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా రూ. 30 లక్షల జరిమానా కూడా విధించింది. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఢిల్లీ స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతో పాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఏప్రిల్ 4న వైజాగ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రిషబ్ పంత్కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతకుముందు వైజాగ్లోనే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించిన పంత్కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి నియమావళి ఉల్లంఘించినందుకు పంత్పై ఐపీఎల్ మెనెజ్మెంట్ చర్యలు తీసుకుంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్కు పంత్ దూరం కానున్నాడు. కాగా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఆర్సీబీతో జరిగే మ్యాచ్ చాలా కీలకం. -
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్నటి (మే 7) మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అనుమానాస్పద క్యాచ్ ఔట్ నిర్ణయం పెండింగ్లో ఉన్నప్పుడు పార్థ్ అతిగా ప్రవర్తించాడు. థర్డ్ అంపైర్ రీప్లే చూస్తున్నప్పుడు గ్యాలరీలో నుంచి ఔట్ ఔట్ అంటూ అరుస్తూ కేకలు పెట్టాడు. ఫ్రాంచైజీకి సహ యాజమాని అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నెటిజన్లు అస్సలు తీసుకోలేకపోయారు. ఈ విషయంపై పార్థ్ ట్రోలింగ్ను ఎదుర్కొంటుండగానే ఇతని మరో వీడియో ఒకటి బాగా వైరలైంది. No #DC fan scroll without liking this।No of likes=No of slap to this mf Parth Jindal#DCvsRR pic.twitter.com/irD7dFSZoz— विक्की पाल ✍️ (@vicky_pal0515) May 7, 2024ఆ వీడియోలో పార్థ్ తన స్థాయిని మరిచి అతిగా విజయోత్సవ సంబురాలు చేసుకుంటూ కనిపించాడు. రాయల్స్పై విజయం అనంతరం పార్థ్ సంతోషం పట్టలేక ఇలా ఓవరాక్షన్ చేశాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిసింది. ఈ వీడియోలో ఉన్నది పార్థే అయినప్పటికీ.. అతను చేసుకున్న సంబురాలు మాత్రం ఇప్పటివి కాదని తేలింది. 2023 మహిళల ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ సమరంలో గెలుపు అనంతరం పార్థ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నాటి సంబురాలకు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి వైరలవుతుంది. Reaction of Delhi Capitals co- owner Parth Jindal when DC defeated Rajasthan royals last night 🔥He is living the moment 💥#DCvRR #SRHvLSG #delhicapital pic.twitter.com/4NXL8ftFNB— AVANISH (@avanish_du187) May 8, 2024ఈ వీడియోను చూసి పార్థ్ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. వేల కోట్లకు అధిపతి, ఓ ఫ్రాంచైజీకి సహ యజమాని అయిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ చురకలంటిస్తున్నారు. పార్థ్కు పారిశ్రామికవేత్తగా రాని పబ్లిసిటీ ఈ ఒక్క ఘటనతో వచ్చింది. Our Chairman and Co-owner, Parth Jindal, caught up with Rajasthan Royals' captain Sanju Samson & owner Manoj Badale, at the Arun Jaitley Stadium last night, after what was an exceptional contest of cricket. Parth also extended his congratulations to the RR skipper on being… pic.twitter.com/k47zwB7nzR— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2024మ్యాచ్ అనంతరం పార్థ్.. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యజమానితో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీకి సహ యజమాని అయిన పార్థ్.. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. జిందాల్ కుటుంబం భారత దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యాపార కుటుంబం.సంజూ వివాదాస్పద క్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సంజూ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ రోప్కు అతి సమీపాన షాయ్ హోప్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్పై ఫీల్డ్ అంపైర్కు క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. రీ ప్లేలో హోప్ చేతిలో బంతి ఉన్నప్పుడు అతను బౌండరీ రోప్ను తాకినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఢిల్లీకి అనుకూలంగా ఇచ్చి శాంసన్ను ఔట్గా ప్రకటించాడు. దీనిపై శాంసన్ ఫీల్డ్ అంపైర్తో గొడవపడి అనంతరం మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్లో సంజూ ఔటైన కావడంతో రాయల్స్ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. -
రెండుసార్లు బౌండరీని తాకినా ఎందుకిలా? ఇది అన్యాయం..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతికత పేరిట సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అతడు గనుక క్రీజులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. ఇక సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.బాధ్యత తీసుకున్న సంజూ శాంసన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(4), జోస్ బట్లర్(19) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.46 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుటయ్యాడు. పదహారో ఓవర్లో ముకేశ్ కుమార్ బౌలింగ్లో షాయీ హోప్నకు క్యాచ్ ఇచ్చాడు.అయితే, క్యాచ్ అందుకునే సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ను తాకినట్లుగా అనిపించినా ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు.. సంజూకు మద్దతుగా నిలిచాడు.సైడ్ యాంగిల్లో చూసినపుడు ‘‘అంపైర్లు తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. సంజూ శాంసన్ అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక.. కానీ సైడ్ యాంగిల్లో చూసినపుడు ఫీల్డర్ బౌండరీ లైన్ను రెండుసార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించింది.సాంకేతికత వాడినా, వాడకపోయినా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈసారి టెక్నాలజీ వల్ల కచ్చితంగా తప్పిదం జరిగిందనే చెప్తాను. రెండుసార్లు అతడు బౌండరీ లైన్ తాకినా అవుట్ ఇవ్వడం సరికాదు.అన్యాయం.. సంజూ బలైపోయాడునేను తటస్థంగా ఉండే వ్యక్తిని. సంజూ నాటౌట్ అని కచ్చితంగా చెప్పగలను. అలా అని అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని నేను అనుకోవడం లేదు.ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజూ బలైపోయాడు. ఆటలో ఇవన్నీ సహజమే అయినా.. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్లో రాజస్తాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: Playoff Race: సన్రైజర్స్ గుండెల్లో వర్షం గుబులు.. మ్యాచ్ రద్దైతే గనుక! Game of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్కు వచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్ను చేరుకున్న తొలి భారత క్రికెటర్గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 6 సిక్స్లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును సాధించాడు. ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఎంఎస్ ధోని 165 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024ఓవరాల్గా పదో ప్లేయర్ఇక ఐపీఎల్లో ఓవరాల్గా 200 సిక్స్లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా ఉన్నారు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65) దంచికొట్టారు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024 వీరికి తోడు ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. The home side emerge victorious in tonight's run-fest here in Delhi 💥And with that win, Delhi Capitals move to number 5⃣ on the Points Table 🔥🔥Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/vQvWMSk5lt— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
DC Vs RR: ఢిల్లీ రేసులోకొచ్చింది!
న్యూఢిల్లీ: జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్పై కీలకమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు; 3 సిక్స్లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఖలీల్, ముకేశ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు. 4,4,4,6,4,6... ఓపెనర్లు ఫ్రేజర్, పోరెల్ ఒకరి తర్వాత ఒకరు రాయల్స్ బౌలర్లను చితగ్గొట్టారు. ముందుగా ఫ్రేజర్... బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక సిక్స్, 2 బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 4, 4, 4, 6, 4, 6లతో 28 పరుగులు పిండుకోవడంతో ఫ్రేజర్ ఫిఫ్టీ 19 బంతుల్లోనే పూర్తయ్యింది. అతని దూకుడును అశ్విన్ తన తొలి ఓవర్లోనే అడ్డుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ అండతో పోరెల్ బాదడం మొదలుపెట్టాడు. 9వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మరుసటి ఓవర్లోనే అక్షర్ (15)ను అశ్విన్ బోల్తా కొట్టించగా, పోరెల్ సిక్సర్తో 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వరుస ఓవర్లలో పోరెల్ను అశ్విన్... రిషభ్ పంత్ (15)ను చహల్ పెవిలియన్ పంపారు. మిడిలార్డర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. కెప్టెన్ పోరాడినా... క్లిష్టమైన లక్ష్యం ముందరుంటే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19) గట్టి పునాది వేయలేకపోయారు. ఈ దశలో కెపె్టన్ సామ్సన్, రియాన్ పరాగ్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) అండతో రాయల్స్ను నడిపించాడు. 11వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు దాటాక అదే ఓవర్ ఆఖరి బంతికి పరాగ్ను రసిఖ్ బౌల్డ్ చేశాడు. అయితే శుభమ్ దూబే వచ్చాక సామ్సన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సామ్సన్ను ముకేశ్ అవుట్ చేయడం రాజస్తాన్ను కుదిపేసింది. శుభమ్తో నాలుగో వికెట్కు 59 పరుగులు జోడించాక భారీ షాట్కు ప్రయత్నించి సామ్సన్ నిష్క్రమించగా... తర్వాత ఓవర్కు ఒకటి, రెండు చొప్పున వికెట్లను కోల్పోయిన రాయల్స్ ఓటమి పాలైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50; పోరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65; షై హోప్ (రనౌట్) 1; అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) చహల్ 15; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 41; గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19; రసిఖ్ (రనౌట్) 9; కుల్దీప్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–60, 2–68, 3–110, 4–144, 5–150, 6–195, 7–215, 8–221. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–1, సందీప్ శర్మ 4–0–42–1, అవేశ్ 2–0–42–0, అశి్వన్ 4–0–24–3, పరాగ్ 2–0–17–0, చహల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అక్షర్ (బి) ఖలీల్ 4; బట్లర్ (బి) అక్షర్ 19; సామ్సన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86; పరాగ్ (బి) రసిఖ్ 27; శుభమ్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25; పావెల్ (బి) ముకేశ్ 13; ఫెరీరా (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; అశి్వన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2; బౌల్ట్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–4, 2–67, 3–103, 4–162, 5–180, 6–181, 7–185, 8–194. బౌలింగ్: ఖలీల్ 4–0–47–2, ఇషాంత్ 3–0–34–0, ముకేశ్ 3–0–30–2, అక్షర్ 3–0–25 –1, కుల్దీప్ 4–0–25–2, రసిఖ్ 3–0–36–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నో వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPl 2024 DC Vs RR: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ 86 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిగితా బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్లు రాకపోవడంతో రాజస్తాన్ ఓడిపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
DC Vs RR: ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మెక్గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ బౌలర్లను జేక్ ఫ్రేజర్ చుక్కలు చూపించాడు.ముఖ్యంగా రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్ను అయితే మెక్గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో మెక్గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే మెక్గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు.ఓవరాల్గా 20 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 7 ఫోర్లు, 3 సిక్స్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మెక్గుర్క్.. 44.14 సగటుతో 309 పరుగులు చేశాడు. Most IPL fifties reached in less than 20 balls3 - Jake Fraser-McGurk2 - KL Rahul2 - Yashasvi Jaiswal2 - Kieron Pollard2 - Sunil Narine2 - Nicholas Pooran- This comes only in his 7th match!#DCvRRpic.twitter.com/lSzFmynl66— Kausthub Gudipati (@kaustats) May 7, 2024 -
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. రాజస్తాన్ రాయల్స్ తరపున దక్షిణాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెరీరా, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున నైబ్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నారు. అదే విధంగా ఈమ్యాచ్కు రాజస్తాన్ స్టార్ క్రికెటర్లు ధ్రువ్ జురెల్, హెట్మైర్ దూరమయ్యారు. హెట్మైర్ స్ధానంలో ఫెరీరా, జురెల్ ప్లేస్లో శుబమ్ దూబే వచ్చాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
ఐపీఎల్లో ఇవాళ (మే 7) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకున్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాయల్స్కు అంత ముఖ్యం కాకపోయినా, ఢిల్లీకి మాత్రం అత్యంత కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.ఢిల్లీ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే చెన్నై, సన్రైజర్స్, లక్నో తలో 12 పాయింట్లతో సమంగా ఉంటూ ప్లే ఆఫ్స్ రేసును రసరంజకంగా మార్చాయి. ఇక ఢిల్లీ కూడా ఈ జట్లతో చేరితే రెండు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ తీవ్రతరమవుతుంది. మొదటి రెండు ప్లే ఆఫ్స్ బెర్తులను కేకేఆర్, రాజస్థాన్ దాదాపుగా ఖరారు చేసుకున్నాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఇలా ఉంది..కేకేఆర్ (11 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు, 1.453 రన్రేట్),రాజస్థాన్ (10 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్రేట్), సీఎస్కే (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్రేట్), సన్రైజర్స్ (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.065 రన్రేట్), లక్నో (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్రేట్), ఢిల్లీ (11 మ్యాచ్ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్రేట్), పంజాబ్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్రేట్), ముంబై (12 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.212 రన్రేట్),గుజరాత్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్రేట్)హెడ్ టు హెడ్ రికార్డ్స్: రాజస్థాన్, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్ల్లో తలపడగా.. రాజస్థాన్ 15, ఢిల్లీ 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్ల మధ్య ఇదే సీజన్లో జరిగిన చివరి మ్యాచ్లో రాయల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (84 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో తడబడిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (173/5) నిలిచిపోయి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ యాదవ్ [ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్]రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ [ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చహల్] -
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్ అనడం బెటర్నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో ఇలాకాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. -
DC Vs KKR: రిషభ్ పంత్దే తప్పు.. అతడి వల్లే ఓటమి!
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీరును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తప్పుబట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలను విమర్శించాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై పరుగులు రాబట్టడంలో విఫలమైన తరుణంలో పంత్ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం ఏమీ బాలేదన్నాడు.పవర్ప్లే ముగిసేసరికిఐపీఎల్-2024లో సోమవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ కేకేఆర్ను ఢీకొట్టింది. టాస్ గెలిచిన పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో మొదలు పెట్టినా... పృథ్వీ షా (13) ఎక్కువసేపు నిలవలేదు.స్టార్క్ తర్వాతి ఓవర్లోనే వరుసగా 6, 4 కొట్టిన జేక్ ఫ్రేజర్ (12) తర్వాతి బంతికి వెనుదిరగడంతో ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. షై హోప్ (6) విఫలం కాగా... హర్షిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ పొరేల్ (18) కూడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 67 పరుగులకు చేరింది.కెప్టెన్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తనదైన శైలిలో ఆడలేకపోవడంతో క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. 18 పరుగుల వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్ను హర్షిత్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ దానిని వాడుకోలేకపోయాడు.కుల్దీప్ చక్కటి షాట్లుఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, స్టబ్స్ (4), అక్షర్ (15) వెనుదిరగ్గా... 101/7 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. అయితే కుల్దీప్ కొన్ని చక్కటి షాట్ల(26 బంతుల్లో 35)తో చివరి వరకు నిలబడటంతో క్యాపిటల్స్ 150 పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సారథి పంత్ మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే మా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.రిషభ్ పంత్దే తప్పు.. అతడి వల్లే ఓటమి!ఇక్కడ 180 -210 పరుగులు స్కోరు చేయవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు.ఈ మేరకు పంత్ చేసిన వ్యాఖ్యలపై మైకేల్ క్లార్క్ స్పందిస్తూ.. ‘‘ఓటమి తర్వాత పంత్ మాట్లాడిన తీరుతో నేను ఏకీభవించను. ఒకవేళ గెలిచి ఉంటే ఆ నిర్ణయం(టాస్) సరైందిగా ఉండేది.ఓడిపోయారు కాబట్టి తప్పును అంగీకరించాల్సిందే. ఇలాంటి పిచ్పై పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కచ్చితంగా తప్పు చేశాడనే నా అభిప్రాయం. వాళ్లు కేవలం పది పరుగులు కాదు.. తక్కువలో తక్కువ యాభై పరుగులు వెనుకబడి ఉన్నారు.ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేకేఆర్కు ఇంకా 3.3 ఓవర్లు మిగిలే ఉన్నాయన్న విషయం మరవొద్దు. చేతిలో ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కనీసం 200 పరుగులు చేయాల్సింది’’ అని అభిప్రాయపడ్డాడు. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
ఐపీఎల్-2024 : ఢిల్లీపై కోల్కతా అద్భుత విజయం (ఫొటోలు)
-
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
సొంత మైదానంలో మూడు రోజుల క్రితం 261 పరుగులు చేసి కూడా ఓడి షాక్కు గురైన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తర్వాతి మ్యాచ్లోనే తేరుకుంది. అదే ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈసారి చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు ఢిల్లీ గడ్డపై గత రెండు మ్యాచ్లు గెలిచి మళ్లీ దారిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్తో తమ ఓటమికి బాట వేసుకుంది. కోల్కతా: పరుగుల వరద పారుతున్న ఐపీఎల్లో మరో చిన్న విరామం. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు స్వల్ప స్కోరుకే ఆట ముగించగా... ప్రత్యర్థి సులువుగానే లక్ష్యం చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. కోల్కతా లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం కోల్కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్కు అభేద్యంగా 57 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారుభారీ భాగస్వామ్యం... ఛేదనలో తొలి బంతి నుంచే సాల్ట్ దూకుడు మొదలైంది. లిజాడ్ వేసిన మొదటి ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, సిక్స్ బాదగా మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై 15 పరుగుల వద్ద సాల్ట్ ఇచి్చన క్యాచ్ను లిజాడ్ వదిలేశాడు. ఖలీల్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సాల్ట్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 79పరుగులు సాధించింది. అయితే అక్షర్ తన తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయగా, రింకూ సింగ్ (11) విఫలమయ్యాడు. అయితే ‘అయ్యర్’ ద్వయం ఇబ్బంది లేకుండా ఆడి మరో 21 బంతులు మిగిలి ఉండగానే గెలిపించింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సాల్ట్ (బి) అరోరా 13; జేక్ ఫ్రేజర్ (సి) వెంకటేశ్ (బి) స్టార్క్ 12; పొరేల్ (బి) హర్షిత్ 18; హోప్ (బి) అరోరా 6; పంత్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 27; అక్షర్ (బి) నరైన్ 15; స్టబ్స్ (సి) సాల్ట్ (బి) వరుణ్ 4; కుశాగ్ర (సి) సాల్ట్ (బి) వరుణ్ 1; కుల్దీప్ (నాటౌట్) 35; సలామ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 8; లిజాడ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–17, 2–30, 3–37, 4–68, 5–93, 6–99, 7–101, 8–111, 9–140. బౌలింగ్: స్టార్క్ 3–0–43–1, అరోరా 4–0–29–2, హర్షిత్ 4–0–28–2, నరైన్ 4–0–24–1, వరుణ్ చక్రవర్తి 4–0–16–3, రసెల్ 1–0–10–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 68; నరైన్ (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 15; రింకూ (సి) కుల్దీప్ (బి) లిజాడ్ 11; శ్రేయస్ (నాటౌట్) 33; వెంకటేశ్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 4; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–79, 2–96, 3–100. బౌలింగ్: లిజాడ్ 3–0–38–1, ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సలామ్ 2.3–0–30–0, అక్షర్ పటేల్ 4–0–25–2, కుల్దీప్ 4–0–34–0. . -
కుల్దీప్ యాదవ్ ఫైటింగ్ నాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్ కుల్దీప్ కీలక ఇన్నింగ్స్ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్ మార్క్ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో కుల్దీప్దే టాప్ స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ పంత్ రిషబ్ పంత్ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు. -
ఢిల్లీతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ బౌలర్ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్ స్టార్క్, వైభవ్ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ -
స్టీవ్ స్మిత్కు షాక్.. ఆసీస్ వరల్డ్కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్కు జాతీయ జట్టు ఓపెనర్గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్పై ఉండనే ఉంది. స్మిత్కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టులో స్మిత్కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
ఐపీఎల్లో నేటి (Apr 29) మ్యాచ్.. కేకేఆర్ను ఢీకొట్టనున్న ఢిల్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ను ఢీకొట్టనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 17, ఢిల్లీ 15 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్ గత మ్యాచ్లో అతి భారీ స్కోర్ (261/6) చేసి కూడా పంజాబ్ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్లో తలపడిన సందర్భంలో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఏప్రిల్3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేసర్పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్ ముంబైతో ఆడిన గత మ్యాచ్లో మ్యాడ్ మ్యాన్లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా (ఇంపాక్ట్ ప్లేయర్)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్ సలాం (ఇంపాక్ట్ ప్లేయర్) -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
రిషబ్ పంత్కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపున్కుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం ఐపీఎల్ మెన్జ్మెంట్ విధించే సూచనలు కన్పిస్తున్నాయి. శనివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు. కాగా ఢిల్లీ క్యాపిటిల్స్ స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతోపాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఒకవేల అదే జరిగితే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తదపరి మ్యాచ్కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. -
ముంబైపై ఢిల్లీ పైచేయి
-
IPL 2024 DC VS MI: ట్రిస్టన్ స్టబ్స్ ఊచకోత.. బెంబేలెత్తిపోయిన వుడ్
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. తొలుత జేక్ ఫ్రేసర్ (27 బంతుల్లో 84; 11 ఫోర్లు, 6 సిక్సర్లు), షాయ్ హోప్ (17 బంతుల్లో 41; 5 సిక్సర్లు), ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఫలితంగా ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్. ఢిల్లీ ఇన్నింగ్స్లో అభిషేక్ పోరెల్ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్), రిషబ్ పంత్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (6 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో లూక్ వుడ్, బుమ్రా, పియూశ్ చావ్లా, నబీ తలో వికెట్ పడగొట్టారు. ట్రిస్టన్ స్టబ్స్ ఊచకోతలూక్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ ఓవర్లో స్టబ్స్ ఐదు బౌండీరలు, ఓ సిక్సర్ కొట్టి (4,4,6,4,4,4) 26 పరుగులు పిండుకున్నాడు. స్టబ్స్ ధాటికి కేవలం రెండో మ్యాచ్ ఆడుతున్న వుడ్ బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో తన కోటా 4 ఓవర్లు వేసిన వుడ్ ఓ వికెట్ తీసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా వుడ్ ఐపీఎల్ చరిత్రలో ఐదో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు మోహిత్ శర్మ పేరిట నమోదై ఉంది. మోహిత్ ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో వికెట్ లేకుండా 73 పరుగులు సమర్పించుకున్నాడు. -
Jake Fraser: కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (ఏప్రిల్ 27) జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఓపెనింగ్ బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో జేక్ పడిన బంతిని పడినట్లు చితక బాదాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్ అన్నట్లు జేక్ ఇన్నింగ్స్ సాగింది.ముంబై బౌలర్ల అదృష్టం కొద్ది జేక్ పియూశ్ చావ్లా బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లేకపోతే ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు పడరాని పాట్లు పడాల్సి వచ్చేది. ఔట్ కాక ముందు జేక్ ఊపు చూస్తే క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా బద్దలయ్యేలా కనిపించింది. ఈ మ్యాచ్లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జేక్.. ఈ సీజన్లో ఈ ఘనత సాధించడం ఇది రెండోసారి. సన్రైజర్స్తో జరిగిన తన అరంగ్రేటం మ్యాచ్లోనూ జేక్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో..జేక్ ఇన్నింగ్స్లో ఆసక్తికర విషయమేమిటంటే.. అతను చేసిన 84 పరుగుల స్కోర్లో 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. అంటే జేక్ సాధించిన 84 పరుగుల్లో 80 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారా వచ్చాయి. కేవలం 4 పరుగులు మాత్రమే సింగిల్స్ రూపంలో వచ్చాయి. జేక్ ఇదే సీజన్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఇదే తరహాలోనే (90 శాతానికి పైగా పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో) రెచ్చిపోయాడు.ఆ మ్యాచ్లో జేక్ చేసిన 65 పరుగుల్లో 62 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. ఐపీఎల్లో అత్యధిక శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించిన రికార్డు మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా పేరిట ఉంది. 2014 సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రైనా తాను చేసిన 87 పరుగుల్లో 84 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించాడు. తన 87 పరుగుల ఇన్నింగ్స్లో బౌండరీలు, సిక్సర్ల శాతం 96.55గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181పరుగులు చేసింది. జేక్ (84), అభిషేక్ (36), షాయ్ హోప్ (41) ఔట్ కాగా.. పంత్ (16), స్టబ్స్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ సీజన్లో జేక్ చేసిన స్కోర్లు..- 55(35).- 20(10).- 65(18).- 23(14).- 84(27).