
Photo Courtesy: BCCI/JioHotstar
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్లో ఘన విజయం సాధించి.. టాప్-4కు అర్హత సాధించింది.
కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షించిన నీతా
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ముందు చేతులు శుభ్రం చేసుకో
ఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కోవిడ్ కేసుల నేపథ్యంలో
కాగా ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రవిస్ హెడ్కు ఇటీవల కోవిడ్ పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్ చేయడం గమనార్హం.
సెలైవాతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం
కాగా ఈసారి ఐపీఎల్లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది.
కరోనా కాలంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
దంచికొట్టిన సూర్య, నమన్
ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్ తదితరులకు సానిటైజర్ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (5) విఫలం కాగా.. రియాన్ రెకెల్టన్ (25) ఫర్వాలేదనిపించాడు. విల్ జాక్స్ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.
ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
బౌలర్లు చెలరేగడంతో
ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్
Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025