‘ఈ విజయం మీ అందరిది’ | RCB victory celebration in Bengaluru | Sakshi
Sakshi News home page

‘ఈ విజయం మీ అందరిది’

Jun 5 2025 2:09 AM | Updated on Jun 5 2025 2:09 AM

RCB victory celebration in Bengaluru

అభిమానులతో విరాట్‌ కోహ్లి 

బెంగళూరులో ఆర్‌సీబీ విజయోత్సవ వేడుక  

సాక్షి, బెంగళూరు: తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ హోం గ్రౌండ్‌లో వేడుకలు జరుపుకుంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జట్టు సభ్యులంతా పాల్గొని అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఈ సాల కప్‌ నమ్‌దు’ అంటూ విరాట్‌ కోహ్లి తనదైన శైలిలో ఫ్యాన్స్‌లో జోష్‌ నింపాడు. 

‘ఈ విజయం మీ అందరిదీ. అభిమానులు, ఈ నగరానికి చెందినవారు, కష్టాల్లోనూ జట్టుకు మద్దతునిచ్చిన వారందరికీ గెలుపులో భాగం ఉంది. ప్రపంచంలో ఏ ఫ్రాంచైజీ జట్టుకు కూడా ఇంతటి వీరాభిమానులు ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. సీజన్‌ ఆరంభం నుంచి జట్టులోని ఆటగాళ్లంరికీ తగిన బాధ్యతలు అప్పగించామని, ఇప్పుడు వారందరి ప్రదర్శనతోనే టైటిల్‌ విజయం ఖాయమైందని కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ చెప్పాడు. 

అంతకుముందు ఆర్‌సీబీ టీమ్‌ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సాంప్రదాయ రీతిలో వారిని సత్కరించారు. ఆర్‌సీబీ టీమ్‌ తమ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని, 18 ఏళ్లు టైటిల్‌ కోసం పోరాడటం చిన్న విషయం కాదని ఆయన అన్నారు.  

విజయాన్ని అలవాటుగా మార్చుకోవాలి... 
ఒక్క టైటిల్‌ విజయంతో ఆర్‌సీబీ జట్టు ఆగిపోరాదని, వచ్చే ఏడాది కూడా ఇదే జోరును కొనసాగించి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమ్‌ డైరెక్టర్‌ మొ బొబాట్‌ అన్నారు. ఫైనల్లో విజయం తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకుంటూ ఆయన టీమ్‌ సభ్యుల్లో మరింత స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు.

‘ఈ అద్భుత విజయంలో అందరూ తమవంతు పాత్ర పోషించారు. దీని విలువ ఏమిటో రాబోయే రోజుల్లో ఇంకా మీకు అర్థమవుతుంది. గతంలో ఒక జట్టు వరుసగా రెండుసార్లు టైటిల్‌ గెలవడం రెండుసార్లు మాత్రమే జరిగింది. వచ్చే ఏడాది ఫైనల్‌ బెంగళూరులో జరుగుతుంది. అప్పుడు అక్కడా మనం ఉండాలంటే విజయాలను అలవాటుగా మార్చుకోవాలి. ఈ టైటిల్‌ మీలో గెలుపు ఆకలిని ఇంకా పెంచాలి’ అని బొబాట్‌ వ్యాఖ్యానించారు.

‘బౌలింగ్‌ వల్లే గెలిచాం’
ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ తొలిసారి గెలవడంలో బౌలర్లే ప్రధాన పాత్ర పోషించారని జట్టు హెడ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ అన్నారు. వేలంలో కూడా మంచి బౌలర్లను సొంతం చేసుకోవడంపైనే దృష్టి పెట్టామని... గెలుపు దిశగా అక్కడే తమ తొలి అడుగు పడిందని ఫ్లవర్‌ వ్యాఖ్యానించారు. 

‘పేరున్న బ్యాటర్లపై భారీ మొత్తాలు వెచ్చించడంకంటే గుర్తింపు ఉన్న బౌలర్లను ఎంచుకోవడం ముఖ్యమని భావించాం. తొలిరోజు వేలం ముగిశాక మాపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే రెండో రోజు వేలంలో భువనేశ్వర్, కృనాల్, సుయాశ్‌ శర్మలను తీసుకున్నాం. వీరు ఎలాంటి ప్రభావం చూపించారో ఇప్పుడు కనిపిస్తోంది’ అని ఫ్లవర్‌ విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement