
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారిద్దరి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు.
హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతాపం తెలియజేశారు.