టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికా కంటే తెలివితక్కువ జట్టు మరొకటి లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే బలమైన టీమిండియా సెమీస్లో అడుగుపెట్టి ఉండేది కాదని, టైటిల్ గెలిచేది కాదని పేర్కొన్నాడు.
‘మీకో విషయం చెప్పదలచుకున్నా. టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2026) తెలివితక్కువ జట్టు కచ్చితంగా దక్షిణాఫ్రికానే. ఎందుకంటే సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే భారత్ టోర్నీ నుంచే నిష్క్రమించేది. కానీ విండీస్తో మ్యాచ్లో గెలిచిన సౌతాఫ్రికా ఒక రకంగా భారత్కు వరల్డ్కప్లో కొనసాగేందుకు అవకాశం కల్పించింది.
కానీ సఫారీల చేతిలో ఓటమి చవిచూసిన టీమిండియా వరుసగా వెస్టిండీస్, జింబాబ్వేలను మట్టికరిపించి సెమీస్లో అడుగుపెట్టింది. నాకౌట్ పోరులో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే.
కానీ సౌతాఫ్రికా ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది. వాస్తవానికి ఇలాంటివి జరగకూడదు. మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఉత్తమ జట్టును తొందరగానే టోర్నీ నుంచి బయటకు పంపాలి’ అని వాన్ చెప్పుకొచ్చాడు.
అయితే ఇంగ్లండ్ మాజీపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం.. స్వలాభం కోసం ఓడిపోవడం సరైన చర్య కాదు’.. ‘సౌతాఫ్రికాకు ఈసారి వరల్డ్కప్ గెలిచే అవకాశం చేజార్చుకుంది. ఒకవేళ సెమీస్ చేరినా ఆ జట్టు ఫైనల్ చేరకపోయి ఉండేదేమో’ అని కామెంట్స్ చేశారు.
ఇక సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో నెట్ రన్రేట్ మైనస్కు పడిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెమీస్ అవకాశాలు కష్టంగా ఉన్నప్పటికీ వెస్టిండీస్, జింబాబ్వేలపై అద్భుతంగా ఆడిన భారత్ విజయాలతో సెమీస్ చేరింది.
సెమీస్లో ఇంగ్లండ్తో భారత్ తలపడింది. కానీ ఛేదనలో ఇంగ్లండ్ వణుకు పుట్టించినప్పటికీ చివరకు గట్టెక్కిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరు మాత్రం వన్సైడ్గా మారిపోయింది. మొదట బ్యాటింగ్లో సంజూ శాంసన్, ఆ తర్వాత బౌలింగ్లో బుమ్రాల రాణింపుతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్కప్ను, మొత్తంగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.


