న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. 214 పరుగుల తేడాతో ఘన విజయం | U-19 World Cup: Musheer Khan And Bowlers Help India Steamroll New Zealand, Start Super Six With Big Win - Sakshi
Sakshi News home page

U-19 World Cup: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. 214 పరుగుల తేడాతో ఘన విజయం

Published Tue, Jan 30 2024 8:25 PM

Musheer Khan, bowlers help India steamroll New Zealand, start Super Six with big win - Sakshi

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీ సూపర్‌ సిక్స్‌ దశను విజయంతో ఆరంభించింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత విజయంలో ముషీర్‌ ఖాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్‌.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 ముషీర్‌ పరుగులు చేశాడు.

అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.  ముషీర్‌తో పాటు ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌(52), కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మాసేన్‌ క్లార్క్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్‌ తెవాటియా, కమ్మింగ్‌, రెయాన్‌ తలా వికెట్‌ సాధించారు.

4 వికెట్లతో చెలరేగిన సౌమ్య పాండే..
296 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. భారత బౌలర్ల దాటికి కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్‌ సౌమ్య పాండే 4 వికెట్లతో బ్లాక్‌క్యాప్స్‌ పతనాన్ని శాసించగా.. రాజ్‌ లింబానీ, ముషీర్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ జాక్‌సన్‌(19) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
 

Advertisement
Advertisement