
సాక్షి, విశాఖపట్నం: విశ్వక్రీడల్లో గర్జించేందుకు విశాఖ అథ్లెట్ యర్రాజి జ్యోతి సిద్ధమైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఒలింపిక్స్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నగరానికి చెందిన జ్యోతి గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది. జ్యోతి ఖాతాలో రెండు కామన్వెల్త్ పతకాలు కూడా ఉన్నాయి.
అదే విధంగా.. ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించిన ఘనత యర్రాజి జ్యోతి సొంతం. ఇక వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ బెర్త్ దక్కించుకున్న యర్రాజి జ్యోతి..100 మీటర్ల హర్డిల్స్లో బరిలోకి దిగనుంది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకెక్కనుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి యర్రాజి జ్యోతితో పాటు దండి జ్యోతికశ్రీ(అథ్లెట్), రంకిరెడ్డి సాత్విక్సాయిరాజ్(బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్(ఆర్చరీ), షేక్ అర్షద్(పారా సైక్లింగ్ చాంపియన్), కె.నారాయణ(పారా రోవర్) ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొననున్నారు.
ఇక ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధు అందరిలోకెల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో క్రీడా ప్రమాణాలు పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి క్రీడాకారులను 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి ప్రోత్సాహకాలు అందించి అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment