-
‘పారిస్’కు చేరువగా సచిన్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సచిన్ సివాచ్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరగా... అమిత్ పంఘాల్ (51 కేజీలు), సంజీత్ కుమార్ (92 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో సచిన్ 5–0తో బతుహన్ సిఫ్టిసీ (టర్కీ)పై ఏకపక్ష విజయం సాధించాడు. రెండో రౌండ్ బౌట్లలో సంజీత్ 5–0తో లూయిస్ సాంచెజ్ (వెనిజులా)పై, అమిత్ 4–1తో మౌరిసియో రూయిజ్ (మెక్సికో)పై గెలిచారు. మహిళల 57 కేజీల రెండో రౌండ్లో జైస్మిన్ 5–0తో మహసతి హమ్జయేవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు ఖరారవుతాయి. -
పారిస్ ఒలింపిక్స్కువిజయం దూరంలో...
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్లను ఖరారు చేసుకోవడానికి భారత బాక్సర్లు అంకుశిత బోరో (60 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) విజయం దూరంలో నిలిచారు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరూ తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ యూత్ మాజీ చాంపియన్ అంకుశిత 4–1తో ఆసియా చాంపియన్ రిమా వొలోసెంకో (కజకిస్తాన్)పై నెగ్గగా... నిశాంత్ 5–0తో పీరాపట్ యెసుంగ్నోయెన్ (థాయ్లాండ్)ను చిత్తు చేశాడు. మహిళల 66 కేజీల విభాగంలో అరుంధతి 5–0తో స్టెఫానీ పీనీరో (ప్యూర్టోరికో)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. అయితే పురుషుల ప్లస్ 92 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో నరేందర్ 2–3తో గిల్మర్ కాంగో (ఈక్వడోర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే పురుషుల 57 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో బతుహాన్ సిఫ్టిసి (టర్కీ)తో సచిన్ సివాచ్... 51 కేజీల రెండో రౌండ్లో రూయిజ్ (మెక్సికో)తో అమిత్.. 92 కేజీల రెండో రౌండ్లో లూయిస్ (వెనిజులా)తో సంజీత్... మహిళల 57 కేజీల రెండో రౌండ్లో మసాతి (అజర్బైజాన్)తో జైస్మిన్ తలపడతారు. -
Paris Olympics 2024: భారత బాక్సర్లకు చివరి అవకాశం
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీ శుక్రవారం నుంచి బ్యాంకాక్లో జరగనుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు బాక్సర్లు (అమిత్ పంఘాల్–51 కేజీలు, సచిన్–57 కేజీలు, అభినాశ్ జమ్వాల్–63.5 కేజీలు, నిశాంత్ దేవ్–71 కేజీలు, అభిమన్యు–80 కేజీలు, సంజీత్–92 కేజీలు, నరేందర్ –ప్లస్ 92 కేజీలు)... మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు (జాస్మిన్–57 కేజీలు, అంకుశిత–60 కేజీలు, అరుంధతి–66 కేజీలు) బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. భారత్కు విశ్వ క్రీడల బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్(75 కేజీలు) ఒలింపిక్స్-2024 పోటీలకు అర్హత సాధించారు. -
Paris Olympics: పర్వీన్ హుడాపై నిషేధం.. విశ్వ క్రీడలకు దూరం
Parveen Hooda suspended- భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కోల్పోయింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ వల్లే ఆమె పారిస్ విశ్వక్రీడలకు దూరం కానుంది.‘వాడా’ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) నియమావళి ప్రకారం ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. గత 12 నెలలుగా మూడుసార్లు పరీ్వన్ ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో ‘వాడా’ ఆమెపై 22 నెలలు నిషేధం విధించింది. పర్వీన్ ఈ తప్పిదాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని ‘వాడా’ అధికారులకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వివరణ ఇచ్చింది.దాంతో ‘వాడా’ ఈ నిషేధాన్ని 14 నెలలకు కుదించింది. శుక్రవారంతో మొదలైన ఈ నిషేధం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందని బీఎఫ్ఐ తెలిపింది. గత ఏడాది హాంగ్జౌలో జరిగిన జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్ కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇక పర్వీన్పై నిషేధం నేపథ్యంలో ఇప్పుడు 57 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. ఈ క్రమంలో.. పర్వీన్ స్థానంలో జాస్మిన్ లాంబోరియాను బీఎఫ్ఐ.. వరల్డ్ క్వాలిఫయర్-2 బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్లో మహిళల, పురుషుల విభాగాలలో ఏడు చొప్పున ఒలింపిక్ వెయిట్ కేటగిరీలు ఉండగా... భారత్ నుంచి ఇప్పటికే ముగ్గురు మహిళా బాక్సర్లు (నిఖత్ జరీన్–50 కేజీలు; ప్రీతి–54 కేజీలు; లవ్లీనా బొర్గొహైన్–75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. పర్వీన్పై నిషేధం కారణంగా... ఈనెల 23 నుంచి జూన్ 3 వరకు బ్యాంకాక్లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ మహిళల విభాగంలో మూడు వెయిట్ కేటగిరీల్లో (57, 60, 66 కేజీలు), పురుషుల విభాగంలో ఏడు వెయిట్ కేటగిరీల్లో పోటీపడుతుంది. -
Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నుంచి టాప్–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. తొలిసారి టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనుంది. పురుషుల, మహిళల టీమ్ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్ ప్లేయర్ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్గా ఉన్న ఆచంట శరత్ కమల్ ఐదోసారి ఒలింపిక్స్లో పాల్గోనుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). భారత పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్). మనిక పరాజయం కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. భారత్కే చెందిన కృత్విక రాయ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సానిల్ శెట్టి–హరీ్మత్ దేశాయ్ (భారత్) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్ డోర్–ఫ్లోరియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్ (భారత్) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. -
పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్త్
ఇస్తాన్బుల్: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్లో పురుషుల విభాగంలో భారత్కు తొలి బెర్త్ లభించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో అమన్ సెహ్రావత్ ఫైనల్కు చేరడంతో భారత్నుంచి ఒక రెజ్లర్ ఒలింపిక్స్లో పాల్గొనడం ఖాయమైంది. 57 కేజీల విభాగంలో అమన్ 12–2 స్కోరుతో హాన్ చాంగ్సాంగ్ (కొరియా)ను చిత్తు చేశాడు. మరో సెమీఫైనల్లో భారత రెజ్లర్ సుజీత్ (65 కేజీలు) 1–6 తేడాతో తుల్గా తుమూర్ (మంగోలియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే అతని అవకాశాలు పూర్తిగా పోలేదు. నేడు మూడో స్థానంలో కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో గెలిచినా సుమీత్ భారత్కు రెండో బెర్త్ అందిస్తాడు. మరో వైపు బరిలోకి దిగిన మిగిలిన నలుగురు భారత రెజ్లర్లకు మాత్రం చుక్కెదురైంది. వీరందరిలోకి అత్యంత అనుభవజు్ఞడైన దీపక్ పూనియా తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. 86 కేజీల విభాగంలో 4–6 తేడాతో చైనాకు చెందిన జూషెన్ లిన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. జూషెన్ ఆ తర్వాత క్వార్టర్స్లో పరాజయంపాలవడంతో పూనియా ‘రెపిచెజ్’ ఆశలు కూడా గల్లంతయ్యాయి. 74 కేజీల విభాగంలో జైదీప్ 0–3తో తైమురాజ్ సల్కజనోవ్ (స్లొవేకియా) చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా...దీపక్ (97 కేజీలు) 1–5తో ఒమర్బిబిరోవిచ్ (మాసిడోనియా) చేతిలో, ఆంథోనీ జాన్సన్ (జమైకా) చేతిలో సుమీత్ మాలిక్ (125 కేజీలు) పరాజయంపాలయ్యారు. -
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
భారత టాప్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (United World Wrestling) సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు NADAచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన తర్వాత పునియాను UWW సస్పెండ్ చేసింది. పూనియాపై ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31) సస్పెన్షన్ కొనసాగనుంది.డోప్ టెస్ట్కు నిరాకరించాడన్న కారణంగా 20 ఏళ్ల పూనియాను ఏప్రిల్ 23న NADA సస్పెండ్ చేసింది. సస్పెన్షన్పై పూనియా అప్పుడే స్పందించాడు. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని వివరణ ఇచ్చాడు. శాంపిల్ తీసుకునేందుకు నాడా అధికారులు గడువు ముగిసిన కిట్ను ఉపయోగిస్తుండటంతో అందుకు వివరణ మాత్రమే కోరానని తెలిపాడు.UWW సస్పెన్షన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని పూనియా తాజాగా వివరణ ఇచ్చాడు. పూనియా స్టేట్మెంట్పై UWW సైతం స్పందించింది. పూనియాను సస్పెండ్ చేస్తున్న విషయాన్ని కారణాలతో సహా అతని ప్రొఫైల్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. ఒకవేళ పూనియాపై సస్పెన్షన్ వేటు నిజమే అయితే ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్లో భారత పతక అవకాశాలకు గండి పడినట్లే. -
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
ఇస్తాంబుల్: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు ఆఖరి ప్రయత్నం చేయనున్నారు. గురువారం నుంచి ఇస్తాంబుల్లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 6 బెర్త్లు, గ్రీకో రోమన్ విభాగంలో 6 బెర్త్లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో ఇప్పటి వరకు భారత రెజ్లర్లకు ఒక్క బెర్త్ కూడా దక్కలేదు. మహిళల విభాగంలో 6 బెర్త్లకుగాను నాలుగు బెర్త్లు (అంతిమ్–53 కేజీలు, వినేశ్ ఫొగాట్–50 కేజీలు, అన్షు మలిక్–57 కేజీలు, రీతిక–76 కేజీలు) భారత రెజ్లర్లు సంపాదించారు. -
పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
నసావు (బహామస్): వరల్డ్ అథ్లెటిక్స్ రిలే పోటీల్లో రాణించిన భారత పురుషుల, మహిళల 4 x 400 రిలే జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, రూపల్ చౌధరీ, పూవమ్మ, శుభ వెంకటేశన్లతో కూడిన భారత మహిళల రిలే జట్టు రెండో హీట్లో 3 నిమిషాల 29.35 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకొని పారిస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 4 400 మీటర్ల విభాగంలో భారత మహిళల జట్టు ఒలింపిక్స్కు అర్హత పొందడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్లో ఈ విభాగంలో భారత జట్టు అర్హత పొందలేదు. మరోవైపు అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జేకబ్లతో కూడిన భారత పురుషుల 4 x 400 మీటర్ల రిలే జట్టు కూడా పారిస్ ఒలింపిక్స్ టికెట్ను దక్కించుకుంది. రెండో హీట్లో అనస్, అజ్మల్, అరోకియా, అమోజ్ బృందం 3 నిమిషాల 3.23 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో ఒలింపిక్స్ బెర్త్ను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్కు అర్హత పొందడం భారత పురుషుల రిలే జట్టుకిది నాలుగోసారి. టోక్యో ఒలింపిక్స్లో, ప్రపంచ చాంపియన్íÙప్లో భారత రిలే జట్టు పతకాలు సాధించకపోయినా కొత్త ఆసియా రికార్డులను నెలకొలి్పంది. వరల్డ్ రిలే పోటీల ద్వారా మొత్తం 70 జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. -
పారిస్ ఒలింపిక్స్కు ఏడుగురు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సింధు...ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది.సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి ఏడుగురికి బెర్త్లు లభించాయి. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్లో టాప్–16లో నిలిచిన క్రీడాకారులకు ఒలింపిక్ బెర్త్లు అధికారికంగా ఖరారవుతాయి.ర్యాంకులు ఇలా..ప్రస్తుతం సింధు 12వ ర్యాంక్లో ఉంది. పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు ప్రణయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండోసారి ఒలింపిక్స్కు అర్హత పొందారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీకి ఒలింపిక్ బెర్త్ దక్కింది. అశ్వినికిది మూడో ఒలింపిక్స్కాగా, తనీషా తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీపడనుంది. -
షూటింగ్లో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత మహిళా స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ రజత పతకం సాధించింది. దాంతో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. దోహాలో ఆదివారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్ ఆఫ్’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. -
మూడో స్థానంలో ధీరజ్
పురుషుల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ధీరజ్ బొమ్మదేవర 693 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందాడు. 684 పాయింట్లతో తరుణ్దీప్ రాయ్ ఏడో స్థానంలో, 672 పాయింట్లతో ప్రవీణ్ జాధవ్ 25వ స్థానంలో నిలిచారు.మహిళల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు అంకిత (664 పాయింట్లు), భజన్ కౌర్ (657 పాయింట్లు), దీపిక కుమారి (656 పాయింట్లు) వరుసగా 15వ, 29వ, 30వ స్థానాల్లో నిలిచారు. -
పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్ మోకాలి గాయంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ సమయంలో శ్రీశంకర్ మోకాలికి గాయమైంది. ఈ గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించడంతో ఈ ఏడాది మొత్తం శ్రీశంకర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. కేరళకు చెందిన 25 ఏళ్ల శ్రీశంకర్ గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 8.37 మీటర్ల దూరం దూకి రజత పతకం సాధించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్ బెర్త్ను కూడా సంపాదించాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో రజతం, 2023 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన శ్రీశంకర్ 2020 టోక్యో ఒలింపిక్స్లో పోటీపడినా ఫైనల్కు అర్హత పొందలేకపోయాడు. -
కౌంట్డౌన్ @100
ఒలింపియా (గ్రీస్): ప్రపంచ క్రీడా పండుగ పారిస్ ఒలింపిక్స్–2024కు కౌంట్డౌన్ మొదలైంది. మరో 100 రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒలింపిక్స్ పుట్టిల్లు గ్రీస్లో జ్యోతి ప్రజ్వలన ఘట్టాన్ని నిర్వహించారు. తొలి ఒలింపిక్స్ నిర్వహించిన ప్రాచీన ఒలింపియాలో ఈ ఆకర్షణీయమైన కార్యక్రమం జరిగింది. ప్రాచీన సంప్రదాయ వేషధారణలో గ్రీక్ నటి మారియా మినా జ్యోతిని వెలిగించింది. సాధారణంగా సూర్య కిరణాలను అక్కడే ఉంచిన ప్రత్యేక అద్దంపై ప్రసరింపజేసి దాని ద్వారా జ్యోతిని వెలిగిస్తారు. అయితే మంగళవారం అంతా చల్లగా మారి వాతావరణంగా అనుకూలంగా లేకుండా పోయింది. దాంతో అక్కడ అందుబాటులో ఉంచిన ఇతర ప్రత్యామ్నాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. లాంఛనం ముగిసిన తర్వాత తొలి టార్చ్ను రోయింగ్లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన గ్రీస్ ఆటగాడు స్టెఫనోస్ డూస్కస్ అందుకోగా...రెండో టార్చ్ బేరర్గా ఆతిథ్య ఫ్రాన్స్కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మింగ్ చాంపియన్ లారా మనాడూ నిలిచింది. ఈ టార్చ్ ఇక్కడినుంచి మొదలై గ్రీస్ దేశంలో సుమారు 5 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఏప్రిల్ 26న పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ వద్దకు ఇది చేరుతుంది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు కూడా దీనిని తీసుకెళతారు. -
షూటింగ్లో భారత్కు 20వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్కు 20 బెర్త్ ఖరారైంది. రియో డి జనీరోలో జరుగుతున్న చివరి ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ పలక్ గులియా కాంస్య పతకం సాధించింది. తద్వారా భారత్కు ఒలింపిక్ బెర్త్ను అందించింది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, 18 ఏళ్ల హరియాణా అమ్మాయి పలక్ 217.6 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్కే చెందిన మరో షూటర్ సంయమ్ 176.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. -
అమిత్కు పిలుపు హుసాముద్దీన్పై వేటు
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ చివరి టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. గత నెలలో జరిగిన తొలి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది కేటగిరీల్లో బరిలోకి దిగినా ఒక్కరు కూడా ఒలింపిక్స్ బెర్త్ను దక్కించుకోలేకపోయారు. తొలి టోర్నీలో పాల్గొన్న ఐదుగురు బాక్సర్లపై (దీపక్ భోరియా, హుసాముద్దీన్, శివ థాపా, లక్ష్య చహర్, జాస్మిన్) వేటు పడింది. దీపక్ స్థానంలో 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంఘాల్కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ స్థానంలో సచిన్ సివాచ్ను ఎంపిక చేశారు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీ మే 25 నుంచి జూన్ 2 వరకు బ్యాంకాక్లో జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి మహిళల విభాగంలో నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి, పరీ్వన్, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. భారత బాక్సింగ్ జట్టు: పురుషుల విభాగం: అమిత్ పంఘాల్ (51 కేజీలు), సచిన్ సివాచ్ (57 కేజీలు), అభినాష్ జమ్వాల్ (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), అభిమన్యు (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల విభాగం: అంకుశిత (60 కేజీలు), అరుంధతి (66 కేజీలు). -
Paris Olympics: మేరీ కోమ్ రాజీనామా.. కారణం ఇదేనన్న పీటీ ఉష
భారత దిగ్గజ బాక్సర్, వరల్డ్ మాజీ చాంపియన్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఇండియా చెఫ్ డీ మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మేరీ కోమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ధ్రువీకరించారు. తనను చెఫీ డీ మిషన్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ మేరీ కోమ్ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘దేశానికి సేవ చేసే ఏ అవకాశాన్నైనా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా సంసిద్ధమయ్యాను. కానీ ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒలింపిక్స్లో నా దేశం తరఫున ఆడే అథ్లెట్లందరికీ ఎల్లవేళలా మద్దతుగా ఉంటాను’’ అని 41 ఏళ్ల మేరీ కోమ్ పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత జట్టుకు మెంటార్గా సేవలు అందించేందుకు చెఫ్ డీ మిషన్గా మేరీ కోమ్ను నియమించింది ఒలింపిక్ అసోసియేషన్. మార్చి 21న ఇందుకు సంబంధించి ప్రకటన చేసింది. అయితే, తాజాగా మేరీ కోమ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ రాజీనామానకు ఆమోదించామని.. ఆమె స్థానంలో కొత్త వారిని త్వరలోనే నియమిస్తామంటూ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష ప్రకటించారు. కాగా మణిపూర్కు చెందిన మేరీ కోమ్.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచారు. 2021 లండన్ ఒలింపిక్స్లో ఈ లెజెండరీ బాక్సర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. -
వరల్డ్ ఒలింపిక్స్ చారిత్రక నిర్ణయం
ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేతలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగత, రిలే విభాగాల్లో (48 ఈవెంట్స్) స్వర్ణాలు గెలిచే వారికి 50,000 అమెరికన్ డాలర్లు ప్రైజ్మనీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది పారిస్లో జరుగబోయే ఒలింపిక్స్ నుంచి స్వర్ణ పతక విజేతలకుప్రైజ్మనీ పంపిణీ అమల్లోకి వస్తుందని తెలిపింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య పతక విజేతలకు కూడా ప్రైజ్మనీ అందిస్తామని పేర్కొంది. నాలుగేళ్లకు ఒకసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి వచ్చే ఆదాయ వాటాతో (2.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒలింపిక్స్లో ప్రైజ్ మనీ అందజేసే తొలి అంతర్జాతీయ సమాఖ్య తమదేనని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ప్రకటించారు. -
నిఖత్ విదేశీ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్తోపాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా విదేశీ గడ్డపై శిక్షణ తీసుకోనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఈ నలుగురు బాక్సర్లు టర్కీ వెళ్లనున్నారు. ఈ నలుగురు బాక్సర్ల శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. క్రొయేషి యా, చెక్ రిపబ్లిక్లో జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రాకు అయ్యే ఖర్చులు భరిస్తామని క్రీడా శాఖ తెలిపింది. -
వరుసగా మూడోసారి ఒలింపిక్స్లో పోటీపడనున్న భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
బ్యాంకాక్: భారత స్టార్ మహిళా లిఫ్టర్ మీరాబాయి చాను పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం దాదాపు ఖరారైంది. అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ప్రపంచకప్లో సోమవారం జరిగిన మహిళల 49 కేజీల ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి మూడో స్థానంలో నిలిచింది. 6 నెలల విరామానంతరం బరిలోకి దిగిన ఆమె గ్రూప్ ‘బి’లో పోటీపడి మొత్తం 184 కేజీల (81+103) బరువెత్తింది. తద్వారా మీరా మూడో స్థానంలో నిలిచింది. ఫలితమిలా ఉన్నప్పటికీ తప్పనిసరి టోర్నీల్లో పాల్గొనడంతో పాటు, 49 కేజీల కేటగిరీలో ఆమె ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్లో రెండో స్థానంలో ఉంది. చైనా లిఫ్టర్ జియాన్ హుయ్హువా అగ్రస్థానంలో ఉండగా, ప్రతి కేటగిరీ నుంచి టాప్–10 లిఫ్టర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు లభిస్తాయి. దీంతో 2017 ప్రపంచ చాంపియన్ మీరాబాయి జూలైలో జరిగే ఒలింపిక్స్కు అర్హత పొందడం లాంఛనం కానుంది. ప్రపంచకప్ ముగిశాక క్వాలిఫయర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. మణిపూర్కు చెందిన మీరాబాయికివి వరుసగా మూడో ఒలింపిక్స్ క్రీడలు కానున్నాయి. రియో ఒలింపిక్స్లో మీరాబాయి విఫలంకాగా, టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సొంతం చేసుకుంది. -
పతాకధారిగా శరత్ కమల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. -
హర్మన్ప్రీత్ సారథ్యంలో....
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో భువనేశ్వర్లో 28 మంది ఆటగాళ్లతో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ జాబితా నుంచి రబిచంద్ర సింగ్ను తప్పించి మిగతా 27 మందితో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా, హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్గా కొనసాగుతారు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు పెర్త్ వేదికగా ఏప్రిల్ 1, 6, 7, 10, 12, 13వ తేదీల్లో ఆస్ట్రేలియా జట్టుతో ఐదు మ్యాచ్లు ఆడుతుంది. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్కీపర్లు); హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్, సంజయ్, సుమిత్, అమీర్ అలీ (డిఫెండర్లు); మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రాజ్కుమార్ పాల్ (మిడ్ ఫీల్డర్లు); ఆకాశ్దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, గుర్జంత్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, బాబీ సింగ్ ధామి (ఫార్వర్డ్స్). -
Olympics–2024: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో తొలి అడుగు..!
'ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భారత్ నుంచి టీమ్ ప్రాతినిధ్యం ఎన్నడూ లేదు. వ్యక్తిగత విభాగాల్లో మన ప్లేయర్లు బరిలోకి దిగినా ఏనాడూ పతకానికి చేరువగా రాలేదు. అయితే ఈతరంలో కొత్తగా దూసుకొచ్చిన టీటీ బృందం ఆశలు రేపుతోంది. ఇటీవల వరుస విజయాలతో భారత జట్టు పారిస్ ఒలింపిక్స్–2024కు అర్హత సాధించింది. సమష్టి ప్రదర్శనలతో మన ప్యాడ్లర్లు ఆకట్టుకున్నారు. అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లోనూ తొలిసారి భారత జట్టు.. టీమ్ ఈవెంట్స్ బరిలోకి దిగనుండటం విశేషం. దేశం తరఫున ఒలింపిక్స్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ పది మంది ప్లేయర్ల వివరాలను చూస్తే..' ఆచంట శరత్ కమల్: భారత టేబుల్ టెన్నిస్లో నిస్సందేహంగా ఆల్టైమ్ గ్రేట్. చెన్నైకి చెందిన 41 ఏళ్ల శరత్ కమల్కి ఏకంగా 10సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన ఘనత ఉంది. సుదీర్ఘ కాలంగా భారత టీటీకి దిక్సూచిలా, మార్గదర్శిలా ముందుండి నడిపిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలతో ప్రతిసారీ మన దేశ ఆశలు మోస్తున్న సీనియర్ ప్లేయర్. 2006 నుంచి 2022 మధ్య ఆరుసార్లు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శరత్ కమల్ 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. రెండు ఆసియా క్రీడల కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. 2004 ఒలింపిక్స్లో పాల్గొన్న అతను ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్: 31 ఏళ్ల సత్యన్ స్వస్థలం చెన్నై. నాలుగేళ్ల క్రితం ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో 24వ స్థానానికి చేరిన సత్యన్.. టాప్–25లోకి అడుగు పెట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికీ వరల్డ్ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున అతనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించిన సత్యన్ ఆసియా క్రీడల్లోనూ ఒక కాంస్యం అందుకున్నాడు. 2018లో అతనికి అర్జున అవార్డు దక్కింది. మానవ్ ఠక్కర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్–18 స్థాయి ర్యాంకింగ్స్లో నంబర్వన్కు చేరుకోవడంతో మానవ్ ఠక్కర్కు తొలిసారి చెప్పుకోదగ్గ గుర్తింపు లభించింది. ఆ తర్వాత అండర్–21లోనూ అతను నంబర్వన్గా నిలిచాడు. 23 ఏళ్ల ఠక్కర్ స్వస్థలం గుజరాత్లోని రాజ్కోట్. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో ఒక కాంస్యం, ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు సాధించాడు. శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ తర్వాత ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక టీటీ లీగ్ బుందేస్లిగాలో ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. భారత వర్ధమాన ఆటగాళ్లలో అందరికంటే ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఠక్కర్ ఒలింపిక్స్లో పతకం గెలవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. హర్మీత్ దేశాయ్: గుజరాత్లోని సూరత్కు చెందిన హర్మీత్ దేశాయ్ కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యంతో పాటు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్న భారత జట్టులో హర్మీత్ సభ్యుడిగా ఉన్నాడు. 30 ఏళ్ల హర్మీత్ గుజరాత్ నుంచి జాతీయ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్రీడా పురస్కారం అర్జున అవార్డు అతని ఖాతాలో ఉంది. మనుష్ షా: 22 ఏళ్ల మనుష్ షా స్వస్థలం గుజరాత్లోని వడోదరా. రెండేళ్ల క్రితం సీనియర్ నేషనల్స్లో కాంస్యం సాధించడంతో వెలుగులోకి వచ్చిన అతను అంతే వేగంగా దూసుకుపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి టాప్–100లోకి వచ్చిన పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు. 10 ఏళ్ల క్రికెటర్గా మారే ప్రయత్నంలో అతను సాధన కొనసాగించాడు. అయితే స్కూల్లో ఎత్తు నుంచి పడిపోవడంతో డాక్టర్ల సూచనతో అవుట్డోర్ ఆటకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అతను టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు భారత్ తరఫున టీమ్ ఈవెంట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. ఆకుల శ్రీజ: హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల ఆకుల శ్రీజ ఇప్పుడు భారత్ తరఫున అత్యంత విజయ వంతమైన ప్లేయర్గా కొనసాగుతోంది. 2021 సీనియర్ నేషనల్స్లో రన్నరప్గా నిలిచిన శ్రీజ తర్వాతి ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన కనబరచింది. 2022లో జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. 1964లో మీర్ ఖాసిం అలీ తర్వాత హైదరాబాద్ నుంచి టీటీలో జాతీయ చాంపియన్గా నిలిచిన తొలి ప్లేయర్ శ్రీజ కావడం విశేషం. రెండేళ్ల క్రితం బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఆమె కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. చదువులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పని చేస్తోంది. ప్రస్తుతం భారత నంబర్వన్గా ఉన్న ఈ అమ్మాయి ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం శ్రీజ అర్జున అవార్డు కూడా గెలుచుకుంది. మనికా బత్రా: రెండేళ్ల క్రితం అర్చనా కామత్తో కలసి మనికా బత్రా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి చేరింది. ఏ విభాగంలోనైనా ఇప్పటి వరకు భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలతో భారత టేబుల్ టెన్నిస్లో తనదైన ముద్ర వేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం గెలుచుకున్న ఆమె ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఇంట్లో సోదర, సోదరీలను చూసి టీటీ వైపు ఆసక్తి పెంచుకున్న 28 ఏళ్ల మనికా ఇప్పుడు భారత జట్టులో కీలక సభ్యురాలు. అర్జున, ఖేల్రత్న అవార్డులను అందుకున్న ఈ ఢిల్లీ ప్లేయర్కు మున్ముందు మరిన్ని ఘనతలు సాధించగల సత్తా ఉంది. ఆటతో పాటు అందం ఉన్న మనికకు మంచి బ్రాండింగ్ సంస్థల నుంచి మోడలింగ్ అవకాశాలు వచ్చినా.. టీటీపైనే దృష్టి పెట్టేందుకు వాటన్నింటినీ తిరస్కరించింది. ఐహికా ముఖర్జీ: కోల్కతా శివార్లలోని నైహతి ఐహికా స్వస్థలం. గత ఏడాది ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్లో సుతీర్థ ముఖర్జీతో కలసి ఐహికా సెమీఫైనల్కు చేరింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్న ఈ జోడి ఆసియా క్రీడల మహిళల డబుల్స్లో భారత్కు తొలిసారి పతకాన్ని అందించింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో చైనా దిగ్గజం సున్ యింగ్షాపై సాధించిన పలు విజయాలు ఐహిక ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే ఐహికకు అర్జున అవార్డు కూడా దక్కింది. దియా చిటాలే: ముంబైకి చెందిన 21 ఏళ్ల దియా చిటాలే జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలతో గుర్తింపులోకి వచ్చింది. అండర్–15 స్థాయి నుంచి వరుసగా కేడెట్, జూనియర్ స్థాయిలలో వేర్వేరు వయో విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. ఆటతో పాటు రెండేళ్ల క్రితం చెలరేగిన ఒక వివాదంతో దియా వార్తల్లో నిలిచింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో దియా కోర్టును ఆశ్రయించింది. తన ప్రదర్శన, రికార్డులతో ఆమె కోర్టులో పోరాడింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో దియాకు భారత జట్టులో స్థానం లభించడం విశేషం. అర్చనా కామత్: 23 ఏళ్ల అర్చనా కామత్ స్వస్థలం బెంగళూరు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 11 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ అండర్–12, అండర్–18 టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించింది. 14 ఏళ్లకే అండర్–21లో కూడా విజేతగా నిలవడంతో మరింత గుర్తింపు లభించింది. 2018లో తొలిసారి సీనియర్ నేషనల్స్ గెలిచిన తర్వాత ఆమె వేగంగా దూసుకుపోయింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలకు ముందుగా జట్టులో ఎంపికై ఆ తర్వాత దియా చిటాలేకు వచ్చిన అనుకూల కోర్టు తీర్పుతో చోటు కోల్పోయింది. అయితే తర్వాతి ఏడాది సీనియర్ జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో డబుల్స్లో కొంతకాలంగా టాప్–15లో కొనసాగుతోంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: PSL 2024: నిరాశపరిచిన బాబర్.. ఫైనల్కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు -
స్పోర్ట్స్ న్యూస్: ‘పారిస్’ మార్క్ను దాటిన రాంబాబు..
న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ రాంబాబు పారిస్ 20 కిలో మీటర్ల రేసులో పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్ను అందుకున్నాడు. స్లొవేకియాలో జరుగుతున్న టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్లో రాంబాబు మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్ను 1 గంటా 20 నిమిషాల్లో రాంబాబు పూర్తి చేశాడు. పెరూ, ఈక్వెడార్ అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పారిస్ క్వాలిఫయింగ్ టైమింగ్ 1 గంటా 20 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. అయితే ఈ ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్కు చెందిన రాంబాబు నేరుగా ఒలింపిక్స్లో ఆడే అవకాశం లేదు. అతనికంటే ముందే ఆరుగురు భారత రేస్ వాకర్లు అర్హత టైమింగ్ను సాధించారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం దేశంనుంచి గరిష్టంగా ముగ్గురికే పాల్గొనే అవకాశం ఉంది. ఇవి చదవండి: నేడు జరిగే WPL లో.. కొత్త విజేత ఎవరో!? -
నిశాంత్కు నిరాశ
బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్ నుంచి తొమ్మిది మంది భారత బాక్సర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో మిగిలిన చివరి బాక్సర్ నిశాంత్ దేవ్ (71 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. అమెరికా బాక్సర్ ఒమారి జోన్స్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ 1–4తో ఓటమి చవిచూశాడు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఇప్పటి వరకు నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి పవార్, పర్విన్ హుడా, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందారు. మిగిలిన భారత బాక్సర్లకు ఒలింపిక్స్కు అర్హత సాధించేందు రెండో అవ కాశం ఉంది. మే 23 నుంచి జూన్ 3 వరకు థాయ్లాండ్లో జరిగే చివరిదైన రెండో క్వాలిఫయింగ్ టోర్నిలో సెమీఫైనల్ చేరితే భారత బాక్సర్లకు ఒలింపిక్ బెర్త్లు లభిస్తాయి.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- HYD: నాంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఏసీబీ అదుపులో ఈఈ, ఏఈలు..
- నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
- మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
- ‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో.. సాయంత్రం ట్యాంక్బండ్పై..
- సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్
- ఆర్వో శ్రీలేఖపై ఈసీ వేటు
- నిఘా నీడలో... భారత్–పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ మ్యాచ్
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement