
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్ తుది పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఆహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. తుది పోరులో గెలిచి 18 ఏళ్ల కలను నేరవేర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్నప్పటికి పంజాబ్, ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ను సొంతం చేసుకోలేకపోయాయి. ఈసారి ఎవరు గెలిచినా అదే చరిత్రే అవుతోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఫైనల్ సమయానికి కోలుకుంటాడని ఆర్సీబీ మెనెజ్మెంట్ ఆశించింది.
కానీ డేవిడ్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్కు కూడా డేవిడ్ దూరం కానున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా డేవిడ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆ తర్వాత రెండు మ్యాచ్లకు డేవిడ్ దూరమయ్యాడు. ఈ ఆస్ట్రేలియా స్టార్ గాయం తీవ్రతపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సైతం క్లారిటీ ఇవ్వలేదు.
"టిమ్ డేవిడ్ గాయం తీవ్రతపై నాకు ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ సాయంత్రం లోపు నాకు ఓ క్లారిటీ వస్తుందని" సోమవారం ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాటిదార్ పేర్కొన్నాడు.
ఆర్సీబీ ప్లెయింగ్ ఎలెవన్(అంచనా)
విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ (ఇంపాక్ట్ సబ్-ఆప్షన్)