
ముంబై మారణహోమం(26/11) తర్వాత ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తాను ఆడిన 103 పరుగుల ఇన్నింగ్స్ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు చెప్పపుకొచ్చాడు. ఆ ఇన్నింగ్స్ను ముంబై మారణహోమ బాధితులకు అంకితం చేసినట్లు మ్యాచ్ అనంతరం ప్రకటించడం అప్పటి క్రికెట్ అభిమానుల్లో ఎంతో సంతోషం నింపింది. ఆరోజు సచిన్ చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాయి. సచిన్ వ్యాఖ్యలకు నేటితో(డిసెంబర్ 15) సరిగ్గా 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మరోసారి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం. (చదవండి : దుమ్మురేపిన కోహ్లి.. జడేజా)
ఇంగ్లండ్పై విజయం అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడాడు. 'ముంబై మారణహోమం (26/11 దాడులు) నన్ను చాలా కలచివేసింది.. ఆ దృశ్యం తలచుకుంటేనే నా హృదయం కన్నీళ్లతో బరువెక్కుతుంది.. ఎంతో మంది అమాయకప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను చూస్తే నా రక్తం మరిగిపోయేది. వారిని అంతమొందించిన ఎన్ఎస్జీ కమాండోలకు నా శతకోటి వందనాలు.. ఈరోజు ఇంగ్లండ్పై చేసిన సెంచరీని ఆ మారణహోమంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నా...
అసలు ఆరోజు ముంబైలో ఏం జరుగుతుందో నాకు మొదట అర్థం కాలేదు. అర్థమయ్యే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈరోజు ఇంగ్లండ్పై చేసిన 100 పరుగులు.. ఆ మారణహోమం నుంచి అభిమానులు బయటపడేందుకు సహాయపడుతుందనే అనుకుంటున్నా.మారణహోమం తర్వాత ఉగ్రవాదులతో పోరాడిన కమాండోలకు, అక్కడి ప్రజలకు, పోలీసులకు సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేను. ఆ దహనకాండ తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సెంచరీ చేయడం.. అమరులకు అంకింతం చేయడం జీవితంలో మరిచిపోలేనిదంటూ' ఉద్వేగంతో పేర్కొన్నాడు.
కాగా ముంబై మారణహోమానికి ముందే ఇంగ్లండ్ జట్టు భారత్లో 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడడానికి వచ్చింది. మూడో వన్డే సమయంలోనే 26/11 దాడులు జరగడంతో తదుపరి రెండు వన్డేలను రద్దు చేశారు. అనంతరం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ను నిర్వహించారు. సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆండ్రూ స్ట్రాస్ సెంచరీతో 316 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 241 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్కు 75 పరుగుల ఆధిక్యం వచ్చింది. రెండో ఇన్నింగ్స్లో స్ట్రాస్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత్కు 387 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. సచిన్ 103 పరుగుల వీరోచిత సెంచరీతో భారత్ 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. (చదవండి : ఆసీస్కు మరో దెబ్బ.. స్మిత్ అనుమానమే!)
Comments
Please login to add a commentAdd a comment