
టీ20 ప్రపంచకప్ ఆరంభంలోనే పెను సంచలనం నమోదైంది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో ఆసియా ఛాంపియన్ శ్రీలంకపై పసికూన నమీబియా చారిత్రక విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. 2021 టీ20 వరల్డ్కప్లోనూ సంచలన విజయాలు సాధించి సూపర్-12కు అర్హత సాధించిన నమీబియా.. ఈసారి కూడా అదే తరహా ప్రదర్శనను రిపీట్ చేస్తుంది. తమ కంటే పటిష్టమైన జట్టుపై నమీబియా గెలుపు అనంతరం క్రికెట్ ప్రపంచం పసికూనలపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అభిమానులు, విశ్లేషకులు నమీబియాను ఆకాశానికెత్తుతున్నారు.
ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా నమీబియా ప్రదర్శనను కొనియాడాడు. ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. పేరు గుర్తు పెట్టుకోండి (నామ్ యాద్ రఖ్నా).. ఈ రోజు నమీబియా క్రికెట్ ప్రపంచానికి తనేంటో రుజువు చేసిందంటూ టీమిండియాను పరోక్షంగా హెచ్చరించాడు. సచిన్ ట్విట్పై నమీబిమా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ స్పందించాడు. పేరు గుర్తు పెట్టుకోండి అంటూ సచిన్ ట్వీట్ను రీ ట్వీట్ చేశాడు.
Namibia 🇳🇦 has told the cricketing world today… “Nam” yaad rakhna! 👏🏻
— Sachin Tendulkar (@sachin_rt) October 16, 2022
ఇదిలా ఉంటే, క్వాలిఫయర్స్ గ్రూప్-ఏలో జరిగిన తొలి మ్యాచ్లో నమీబియా.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో జాన్ ఫ్రైలింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్ ( 16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నమీబియా ఈ స్కోర్ సాధించగలిగింది.
Nam yaad rakhna! 🇳🇦🙌 https://t.co/Y5QKFifoTg
— Gerhard Erasmus (@gerharderasmus) October 16, 2022
అనంతరం ఛేదనలో నమీబియా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. డేవిడ్ వీస్ (2/16), బెర్నార్డ్ స్కోల్జ్ (2/18), బెన్ షికొంగో (2/22), జాన్ ఫ్రైలింక్ (2/26), స్మిట్ (1/16) మూకుమ్మడిగా లంక నడ్డి విడిచారు. ఫలితంగా ఆ జట్టు 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో కెప్టెన్ షనక (29) టాప్ స్కోరర్గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment