పారాలింపిక్స్‌కు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ | A setback for India before the Paralympics | Sakshi
Sakshi News home page

పారాలింపిక్స్‌కు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ

Published Wed, Aug 14 2024 4:16 AM | Last Updated on Wed, Aug 14 2024 7:24 AM

A setback for India before the Paralympics

బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్రమోద్‌ భగత్‌పై 18 నెలలు నిషేధం

పారాలింపిక్స్‌కు దూరమైన డిఫెండింగ్‌ చాంపియన్‌

డోపింగ్‌ నియమావళి ఉల్లంఘనతో బీడబ్ల్యూఎఫ్‌ చర్యలు 

భువనేశ్వర్‌: పారాలింపిక్స్‌ ప్రారంభం కాకముందే భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తాడనుకున్న భారత పారా షట్లర్, టోక్యో పారాలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత ప్రమోద్‌ భగత్‌పై నిషేధం పడింది. డోపింగ్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రమోద్‌పై 18 నెలలపాటు సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) మంగళవారం వెల్లడించింది. దీంతో 2020 టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన ప్రమోద్‌.. ఈ నెల 28న ప్రారంభం కానున్న పారిస్‌ పారాలింపిక్స్‌కు దూరమయ్యాడు. 

పోటీలు లేని సమయంలో క్రీడాకారులు డోపింగ్‌ పరీక్షలకు అందుబాటులో ఉండేందుకు తాము ఎక్కడ ఉన్నామనే వివరాలు అందించాల్సి ఉంటుంది. మూడుసార్లు వివరాలు ఇవ్వని పక్షంలో ఆ క్రీడాకారుడిపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో ప్రమోద్‌ విఫలమయ్యాడు. ఏడాది వ్యవధిలో ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలు ప్రమోద్‌ అందించని కారణంగా అతడిపై బీడబ్ల్యూఎఫ్‌ సస్పెన్షన్‌ విధించింది. 

‘టోక్యో పారాలింపిక్స్‌ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌పై ఏడాదిన్నరపాటు సస్పెన్షన్‌ విధించాం. బీడబ్ల్యూఎఫ్‌ డోపింగ్‌ నిరోధక నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం. గత 12 నెలల్లో ఎక్కడ ఉన్నాడనే వివరాలు ఇవ్వకపోవడంతోనే నిషేధం విధించాం’ అని బీడబ్ల్యూఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. ఎక్కడున్నానో చెప్పడంలో జరిగిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 

గత ఏడాదిలో రెండుసార్లు టెస్టుకు అందుబాటులో లేను. మూడోసారి పూర్తి వివరాలు సమర్పించా. అయినా నా అప్పీల్‌ను స్వీకరించలేదు. పారిస్‌ పారాలింపిక్స్‌ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి అనూహ్య ఘటన ఎదురవడం చాలా బాధగా ఉంది. గుండె పగిలినట్లయింది. 

నా బృందం ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ (సీఏఎస్‌) నిర్ణయాన్ని గౌరవిస్తున్నా’ అని ప్రమోద్‌ వివరించాడు. నిషేధం విషయంలో గత నెలలో సీఏఎస్‌లో ప్రమోద్‌ అప్పీల్‌ చేసుకోగా.. సీఏఎస్‌ డోపింగ్‌ నిరోధక విభాగం దాన్ని తాజాగా తోసిపుచ్చింది. 

ఈ ఏడాది మార్చి 1 నుంచే ఈ నిషేధం అమల్లోకి రాగా.. వచ్చే ఏడాది సెపె్టంబర్‌ ఒకటి వరకు కొనసాగనుంది. ఒడిశాకు చెందిన ప్రమోద్‌ కేంద్రం నుంచి 2021లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’... 2022లో ‘పద్మశ్రీ’ అందుకున్నాడు.  టోక్యో పారాలింపిక్స్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 3 విభాగంలో స్వర్ణం గెలిచిన ప్రమోద్‌... పారా ప్రపంచ చాంపియన్‌íÙప్‌లలో ఐదుసార్లు టైటిల్స్‌ గెలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement