
ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్లలో 26 సగటుతో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇంగ్లండ్ సిరీస్కు ముందు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లోనూ అయ్యర్ విఫలమయ్యాడు.
దీంతో అతడిని మూడో టెస్టుకు జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలని అయ్యర్ను ఓజా సూచించాడు. "ఇంగ్లండ్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు.
ఒకవేళ మూడో టెస్టుకు విరాట్ కోహ్లి అందుబాటులో వస్తే.. అయ్యర్ లేదా రజత్ పాటిదార్లో ఎవరో ఒకరు బెంచ్కు పరిమితవ్వాల్సి వస్తోంది. నా దృష్టిలో అయ్యర్కు అవకాశాలు ఇవ్వకూడదని కాదు. కానీ అత్యుత్తమ క్రికెటర్లు వెనక్కివచ్చినప్పుడు మనం ఫామ్లో లేకపోతే వేటు తప్పదు. కాబట్టి దేశవాళీ క్రికెట్లో ఆడి తన రిథమ్ను పొందితే బెటర్ అని ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించే ఛాన్స్ ఉంది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆఖరి మూడు మ్యాచ్లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి తమ ఫిట్నెస్ సాధించినట్లు పలురిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment