
వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇరకాటంలో పడింది. భద్రతా కారణాల చేత భారత్ ఇప్పటికే పాక్లో పర్యటించబోదని తేల్చి చెప్పగా.. తాజాగా పాక్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు టోర్నీ నిర్వహణను మరింత అడ్డుగా మారాయి. పాక్లో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా పలువురు ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఇమ్రాన్ జైలులో ఉండి ప్రభుత్వంపై ఆందోళనకారులను రెచ్చగొడుతున్నాడు. అల్లర్లలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆర్మీ రంగంలో దిగింది. ఆందోళనలు ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక
పాక్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు పాక్ నుంచి వైదొలిగింది. రెండు అనధికారిక టెస్ట్లు, మూడు వన్డేల కోసం శ్రీలంక ఏ జట్టు పాక్లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్లు, ఓ వన్డే ముగిశాయి. ఈలోపు పాక్లో ఆల్లర్లు చెలరేగడంతో శ్రీలంక ఏ జట్టు పాక్ పర్యటన నుంచి అర్దంతరంగా వైదొలిగింది.
శ్రీలంక ఏ జట్టు పాక్-ఏ టీమ్తో మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ రెండు వన్డేలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, శ్రీలంక-ఏతో ఆడిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. లంక-ఏతో జరిగిన తొలి వన్డేలో కూడా పాకిస్తానే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment