భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్‌ బంప్స్‌ రావాల్సిందే..! | T20 World Cup Victory Parade: Goosebumps Guaranteed While Team India Singing Vande Mataram With Wankhede Crowd | Sakshi
Sakshi News home page

భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్‌ బంప్స్‌ రావాల్సిందే..!

Published Fri, Jul 5 2024 9:07 AM | Last Updated on Fri, Jul 5 2024 12:10 PM

T20 World Cup Victory Parade: Goosebumps Guaranteed While Team India Singing Vande Mataram With Wankhede Crowd

టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ 2024 సాధించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఊరూ వాడా భారత క్రికెట్‌ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. టీమిండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. 

నిన్న (జులై 4) జరిగిన వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ పెరేడ్‌లో భారత ఆటగాళ్లు తమనుతాము మైమరిచిపోయి సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్స్‌లు, పాటలతో తెగ సందడి చేశారు. వాంఖడేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లను పట్టడానికి వీల్లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు చిన్న పిల్లాడిలా మారిపోయి ఆనందంలో మునిగి తేలారు. 

వందేమాతర గీతాలపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్‌ బంప్స్‌ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లి, హార్దిక్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. వీరిద్దరు దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోను ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది.

ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్‌ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 

11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్‌ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్‌ పెరేడ్‌లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్‌ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. 

భారత క్రికెటర్లు ఓపెన్‌ టాప్‌ బస్‌ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్‌ పెరేడ్‌ మెరైన్‌ రోడ్‌ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం​ జరిగింది. భారత​ క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement