రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా | Team India Moves To 2nd Spot In WTC Points Table | Sakshi
Sakshi News home page

రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా

Published Mon, Feb 5 2024 5:13 PM | Last Updated on Mon, Feb 5 2024 5:16 PM

Team India Moves To 2nd Spot In WTC Points Table - Sakshi

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. వైజాగ్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ పూర్వస్థితికి చేరింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా రెండో స్థానంలోనే ఉండింది. అయితే ఆ మ్యాచ్‌లో ఓటమితో రోహిత్‌ సేన రెండో స్థానం నుంచి ఐదో ప్లేస్‌కు పడిపోయింది. తాజా విజయంతో భారత్‌ తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది. 

పాయింట్ల పట్టికలో డిఫెండింగ్‌ డబ్ల్యూటీసీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా (55 శాతం విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్‌ (52.77) , సౌతాఫ్రికా (50), న్యూజిలాండ్‌ (50), బంగ్లాదేశ్‌ (50), పాకిస్తాన్‌ (36.66), వెస్టిండీస్‌ (33.33), ఇంగ్లండ్‌ (25), శ్రీలంక వరుసగా రెండు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. 

ఇదిలా ఉంటే, వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్‌ (209), శుభ్‌మన్‌ గిల్‌ (104) అద్భుత ప్రదర్శనలతో టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు.

స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఓటమికి ప్రధాన కారణమైన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది.  

రెండో టెస్ట్‌ స్కోర్‌ వివరాలు..

భారత్‌: 396 & 255
ఇంగ్లండ్‌: 253 & 292


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement