Former Pakistan Star Says MS Dhoni ‘Unfairly’ Won the Man of the Match Award Over Him - Sakshi
Sakshi News home page

MS Dhoni: ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు?.. కనీసం ఒక్కసారైనా..

Published Sun, Jul 2 2023 4:02 PM | Last Updated on Sun, Jul 2 2023 5:23 PM

They Gave MOM To Dhoni For Dropping 2 Catches Ex PAK star Alleges MSD Won Unfairly - Sakshi

MS Dhoni: 350 వన్డేలు.. 10వేలకు పైగా పరుగులు(10773)    .. 321 క్యాచ్‌లు.. 123 స్టంపింగ్స్‌లో భాగం.. ఓ వరల్డ్‌కప్‌ ట్రోఫీ.. వన్డే ఫార్మాట్‌లో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని ట్రాక్‌ రికార్డు ఇది. అయితే, విచిత్రంగా తన కెరీర్‌లో వందలాది మ్యాచ్‌లు ఆడిన మహీ గెలుచుకున్న మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు మాత్రం 21. 

అత్యధిక సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో ఓవరాల్‌గా 33, టీమిండియా ఆటగాళ్లలో ఏడోస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఓ మ్యాచ్‌లో తనకు అన్యాయం చేసి మరీ ధోనికి అవార్డు కట్టబెట్టారంటూ పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ తాజాగా ఆరోపించాడు.

‘‘నిజంగా అది నా దురదృష్టమే. టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరైన మూడో మ్యాచ్‌లో వాళ్లను 175 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో నాదే ముఖ్యపాత్ర. ఆ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మేమే గెలిచాం. ఆ మ్యాచ్‌ల్లోనూ నేను మెరుగ్గా రాణించా. నా కెరీర్‌లో అత్త్యుత్తమ గణాంకాలు నమోదు చేశా.

నాకు అన్యాయం చేశారు
కానీ.. 175 పరుగులలో ఏవో కొన్ని రన్స్‌ తీసి.. రెండు క్యాచ్‌లు డ్రాప్‌ చేసినందుకేమో తనకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇచ్చారు. నిజంగా ఇది అన్యాయం. అసలు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఎవరికిస్తారో తెలుసా? 

ఓ మ్యాచ్‌లో జట్టు గెలిచినా ఓడినా సరే.. అత్యుత్తమంగా ఆడిన ప్లేయర్‌కే ఇవ్వాలి. కానీ ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది కాబట్టి ధోనికి అవార్డు ఇచ్చారు. అది కూడా క్యాచ్‌లు వదిలేసినందుకే అనుకుంటా’’ అంటూ అజ్మల్‌ ధోని ఆట తీరును కించపరిచే విధంగా మాట్లాడుతూ అక్కసు వెళ్లగక్కాడు. నాదర్‌ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్‌ నంబర్‌ 1 బౌలర్‌.. ఒక్క అవార్డు లేదు
కాగా అజ్మల్‌ వన్డే, టీ20లలో వరల్డ్‌ నంబర్‌ 1 బౌలర్‌గా ఎదిగినప్పటికీ ఒక్కసారి కూడా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఒక్క మ్యాచ్‌లోనూ గెలిచింది లేదు. మరి ధోనిపై మాత్రం ఎందుకంత ఏడుపు!’’ అని తలా ఫ్యాన్స్‌ అతడిని ట్రోల్‌ చేస్తున్నారు.

2012-13లో పాకిస్తాన్‌ భారత పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా.. రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. టీ20 సిరీస్‌లో దాయాదులు చెరో మ్యాచ్‌ గెలవగా.. వన్డే సిరీస్‌ను మాత్రం పాక్‌ 2-1(తొలి రెండు గెలిచి)తో కైవసం చేసుకుంది.

మతిమరుపు వచ్చిందా?
ఇక వన్డే సిరీస్‌లో నాడు ధోని సాధించిన పరుగులు వరుసగా.. 113(నాటౌట్‌- ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌), 54 నాటౌట్‌, 36. సయీద్‌ అజ్మల్‌ ఆరోపించినట్లు నాటి మ్యాచ్‌లో రెండు సులువైన క్యాచ్‌లు వదిలేయలేదు. కేవలం ఒకటి మాత్రమే మిస్‌ చేశాడు. 

అంతేకాదు సయీద్‌ అజ్మల్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టి అతడిని పెవిలియన్‌కు పంపాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో అజ్మల్‌ 9.4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి టీమిండియా 167 పరుగులకే కుప్పకూలడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, 45 ఏళ్ల సయీద్‌ అజ్మల్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ టీమిండియా 175 పరుగులకు ఆలౌట్‌ అయిందని చెప్పడం గమనార్హం.

ఈ విషయాన్ని హైలైట్‌ చేసిన ధోని అభిమానులు.. ‘‘మతిమరుపులో ఏం మాట్లాడుతున్నావో అర్థం కానట్టుంది. పైగా ధోని గురించి అవాకులు చెవాకులు పేలడం.. ఇదేం బాగాలేదు.. నువ్వు ఓసారి డాక్టర్‌ దగ్గరికి వెళ్తే మంచిది’’అని సెటైర్లు వేస్తున్నారు.

చదవండి: కొనసాగుతున్న సీన్‌ విలియమ్స్‌ భీకర ఫామ్‌.. వదిలితే రన్‌మెషీన్‌ను మిం​చిపోయేలా ఉన్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement