భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన చిన్ననాటి స్నేహితురాలు వనిష్కను శనివారం ఉత్తరాఖండ్లోని మస్సూరి హిల్ స్టేషన్లో వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పెళ్లికి కూడా కొద్ది మంది సెలబ్రెటీలకు మాత్రమే ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వివాహానికి క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సహా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలలతో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ నుంచి పెళ్లి ఆహ్వానం అందుకున్న టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ శుక్రవారమే డెహ్రాడూన్లో అడుగుపెట్టాడు.
కుల్దీప్ యాదవ్ పెళ్లి పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, మా అన్న పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ధూంధాంగా ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు. కాగా గతేడాది జూన్లోనే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో లక్నో వేదికగా తన స్నేహితురాలు వనిష్కతో కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి పెళ్లి గతేడాది నవంబర్లోనే కావాల్సి ఉండగా.. ఈలోగా టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల కావడం, కుల్దీప్ జట్టుకు ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో కుల్దీప్ యాదవ్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలుచుకుంది.
ప్రపంచకప్ గెలిచిన ఆనందానికి తోడు ఇప్పుడు కుల్దీప్ పెళ్లి కూడా తోడవ్వడంతో ఆ సంతోషం రెట్టింపుగా మారిపోయింది. టీ20 ప్రపంచకప్లో కుల్దీప్ యాదవ్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. తుదిజట్టు పటిష్టంగా ఉండడంతో కుల్దీప్కు జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు యజ్వేంద్ర చాహల్ 2023 తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.
చదవండి: IPL 2026: ధోనికిదే చివరి సీజన్!


